టీఎస్​ఆర్టీసీ బస్సుల్లో ఇక జీవా జలం.. 'జీవా' కథేంటో తెలుసుకోండి..!

author img

By

Published : Jan 9, 2023, 10:56 AM IST

Jeeva Jalam water Bottles

Jeeva Jalam water Bottles: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆ దిశగా వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తోంది. ఇప్పటికే పెట్రోల్‌ బంక్‌లు, లాజిస్టిక్స్‌ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆర్టీసీ డిమాండ్‌ ఎక్కువగా ఉన్న మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బస్టాండ్లలో ఆర్టీసీ సొంతబ్రాండ్‌ పేరుతో ప్యాకెజ్డ్​ డ్రింకింగ్‌ వాటర్‌ బాటిళ్లను విక్రయించాలని భావిస్తోంది. నేడు హైదరాబాద్‌లో లాంఛనంగా మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రారంభించనున్నారు.

Jeeva Jalam water Bottles: ఆర్టీసీ అంటే ప్రజల్లో మంచి పేరు ఉంది. ఆ ధీమాతోనే కేవలం బస్సుల నిర్వహణ ద్వారానే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చడంపై యాజమాన్యం దృష్టిసారించింది. ఇప్పటికే వివిధ రకాల సేవలు అందిస్తున్న ఆర్టీసీ టికెట్‌యేతర వ్యాపారంలోకి ప్రవేశిస్తుంది. కొంతకాలంగా ఆర్టీసీ ప్యాకెజ్డ్​ డ్రింకింగ్‌ వాటర్‌పై కసరత్తు చేసింది. మిగతా కంపెనీల మంచినీళ్ల బాటిళ్లు ఇవ్వడం కంటే సొంత బ్రాండ్‌తో తయారుచేసి అందించాలన్న అభిప్రాయానికి వచ్చింది.

ఆర్టీసీ విక్రయించే వాటర్‌బాటిళ్లకు జీవా అనే పేరును ఖరారుచేసింది. జీవా వాటర్‌ బాటిల్‌ను ఆకర్షణీయంగా రూపొందించారు. జీవా అంటే తేజస్సు, ప్రకాశం, కాంతి అనిఅర్థం. అందుకు తగ్గట్టుగానే వాటర్‌ బాటిల్‌ను డిజైన్‌చేశారు. ప్రస్తుతంమార్కెట్‌లో ఉన్న బాటిళ్లకు భిన్నంగా డైమండ్‌కట్స్‌తో జీవా వాటర్‌ బాటిల్‌ను డిజైన్‌ చేశారు. ఆ డైమండ్‌ కట్స్‌ వల్ల లైటింగ్‌ పడగానే మంచినీళ్ల బాటిల్‌ మెరుస్తుంది. బాటిల్‌ డిజైన్‌పై స్పింగ్‌ ఆఫ్‌ లైఫ్‌ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు.

తొలుత లీటర్‌ వాటర్‌ బాటిళ్లను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. త్వరలోనే కార్యాలయాల్లో వినియోగించేందుకు 250 మిల్లీలీటర్ల బాటిళ్లు తీసుకురానున్నట్లు యాజమాన్యం పేర్కొంది. జీవావాటర్‌ బాటిళ్లను ఏసీ బస్సు ప్రయాణికులకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. అందుకోసం అర లీటర్‌ బాటిళ్లు ఉత్పత్తిచేయనుంది. బస్టాండ్లలోని స్టాళ్లలో విక్రయించనున్నట్లు తెలిపిన ఆర్టీసీ యాజమాన్యం బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో తేనున్నట్లు వెల్లడించింది.

బుకింగ్‌ కౌంటర్లలో టికెట్లతోపాటు జీవా వాటర్‌ బాటిళ్లను ప్రయాణికులకు విక్రయించనున్నారు. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఉదయం పదకొండున్నరకు జీవావాటర్‌ బాటిళ్లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంచినీళ్ల వ్యాపారంలోని మిగతా బ్రాండ్‌లకు ధీటుగా జీవా వాటర్‌ బాటిళ్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా వాటిని విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యంత నాణ్యత ప్రమాణాలతో మార్కెట్‌లోకి తీసుకొస్తున్న జీవా వాటర్‌ బాటిళ్లను ప్రజలు ఆదరించాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

మంచినీటి వ్యాపారంలోకి టీఎస్​ఆర్టీసీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.