ETV Bharat / state

Viveka: వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని.. జగన్ చెప్పగలడా ?: టీడీపీ

author img

By

Published : Apr 30, 2023, 10:17 PM IST

jagan
jagan

వివేకా హత్య కేసులో జగన్​ ప్రమేయంపై టీడీపీ నేతలు ఆరోపణలు తీవ్రతరం చేశారు. బాబాయి హత్య కేసులో తనకు సంబంధం లేదని జగన్ చెప్పగలడా అని ప్రశ్నించారు. జగన్ తన బంధువులు, మిత్రులను ఉపయోగించి హత్యలు చేయించి.. తన చేతికి మట్టిఅంటుకోకుండా వ్యవహరిస్తాడం జగన్ నైజమని ఆరోపించారు. గతంలో వివేక హత్య కేసు విషయంలో గొడ్డలి పోటును గుండె పోటుగా... సాక్షి పేపరు, ఛానల్​లో ఎన్నో కథలు అల్లారని టీడీపీ నేత మండిపడ్డారు.

వివేకా హత్య కేసులో సీఎం జగన్​పై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసుతో తనకు సంబంధం లేదని చెప్పే ధైర్యం సీఎం జగన్ కు ఉందా అని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. మీడియా సమావేశం నిర్వహించిన ఆయన జగన్​పై విమర్శలు చేశారు. వివేకానంద రెడ్డిని గతంలో చంద్రబాబు చంపారని చెప్పారన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక సిబిఐ కేసులు ఉపసంహరించుకున్నారన్నారు. వివేక కూతురు గట్టిగా పోరాడుతుండడం వల్లే ఆ కేసు ముందుకు వెళుతుందని ప్రభాకర్ చౌదరి అన్నారు. గతంలో ప్రతిపక్షాలపై ఎవరైనా అక్రమ కేసులు పెడితే ముఖ్యమంత్రులు వాటి విషయంలో స్పందించేవారు అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పరోక్షంగా వాటిని ప్రోత్సహిస్తూ ప్రతిపక్షాలను అణిచివేయాలన్న ధోరణిలో ముందుకు వెళ్తున్నారని ప్రభాకర్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలను మోసం చేయడమే కాకుండా సొంతచెల్లిని, తల్లిని కూడా మోసం చేసిన మోసగాడని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో జగనాసుర అవినీతి నేరాక్షసుడు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బీకే పార్థసారథి మాట్లాడుతూ దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్. తండ్రిని అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకొన్నాడు. రూ.43వేల కోట్లు దోచుకొన్నట్లు ఈ.డీ. గుర్తించి 13కేసులు నమోదు చేసింది వాస్తవమన్నారు. జగన్ బంధువులు, మిత్రులను ఉపయోగించి హత్యలు చేయించి చేతికి మట్టిఅంటుకోకుండా వ్యవహరిస్తాడని ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు కోడి కత్తికేసు తనే సృష్టించి సానుభూతి సంపాదించాడని తెలిపారు. ఎన్నికల ముందర నారాసుర చరిత్ర అని వివేకానంద మరణంపై సాక్షిలో ప్రచురించాడని పేర్కొన్నారు.

జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడంలో సిద్ధహస్తుడని టీడీపీ నేత కూన రవికుమార్ పేర్కొన్నారు. శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కూన రవికుమార్... రావణుడికి ఉన్న అహంకారం జగన్మోహన్ రెడ్డి ఉందని ఎద్దేవా చేశారు. వివేకానంద హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి కుటుంబసభ్యులు అతీతంకాదని నిరూపణ అయిందన్నారు. వివేక హత్య కేసులో... గొడ్డలి పోటును గుండె పోటుగా... సాక్షి పేపరు, చానల్ లో ఎన్నో కథలు అల్లారని టీడీపీ నేత మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మరికొందరి నాయకులపైనా... 408 కేసులు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ వైకాపానే అన్నారు. ఇక సీబీఐ తాడేపల్లి ప్యాలస్ తలుపులు తట్టాలని కూన కోరారు.

పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లు అవినీతి, హత్యలు, నేరచరిత్రలతో సరిపోయిందని ఆరోపించారు. సొంత బాబాయ్ ని అతి కిరాతకంగా చంపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహనరెడ్డి అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. వైకాపా అధికారంలోకి రావడానికి ఎన్నో రకాల అబద్ధపు హామీలు, ప్రచారాలు చేశారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.