ETV Bharat / state

Power Subsidy In AP: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై బాదుడే బాదుడు

author img

By

Published : May 9, 2023, 11:53 AM IST

Power Subsidy In AP: విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాలబారి నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతోనే యూనిట్ ధరల్ని స్వల్పంగా సవరిస్తున్నామని.. ఏపీ విద్యుత్ నియంత్రణామండలి ప్రతీసారీ చెప్తోంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రతి ఏట విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అదనంగా ట్రూఅప్ ఛార్జీల పేరిట భారం. వెరసి వినియోగదారుడి నడ్డివిరిచేలా విద్యుత్ సంస్థల నిర్ణయాలు ఉంటున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు చేస్తున్న ప్రతిపాదనలను యధాతథంగా అమోదించడం మినహా ఏపీ ఈఆర్సీ చేస్తోందేం లేదు. దీంతో నేరుగా డిస్కమ్‌లు చేస్తున్న అనవసర వ్యయాలూ, ప్రభుత్వ నిర్ణయాలు సగటు వినియోగదారుల నెత్తిపై పెనుభారం అవుతున్నాయి. రాజకీయ కారణాలతో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, హామీలన్నీ ప్రజల నెత్తిన గుదిబండలై కూర్చుంటున్నాయి. అంతలా జగన్‌ సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.

Subsidized power supply and retention of subsidy arrears in ap
రాయితీలతో విద్యుత్ సరఫరా మరియు సబ్సిడీ బకాయిలు నిలుపుదల

Power Subsidy In AP : విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వ రాజకీయ నిర్ణయాలు, హామీలే శాపంలా మారుతున్నాయి. రాయితీతో విద్యుత్ సరఫరా, సబ్సిడీ బకాయిలు విడుదల చేయకపోవటం తదితర నిర్ణయాలన్నీ పరోక్షంగా విద్యుత్ వినియోగదారుడే భరించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీంతో ఏటా విద్యుత్ పంపిణీ సంస్థలు యూనిట్ ధరను పెంచాలంటూ ఏపీ ఈఆర్సీకి ప్రతిపాదించటం దాన్ని యధాతథంగా వారు అమోదించేయటం ప్రతి ఏడాది జరుగుతున్న విషయమే. విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు వార్షికాదాయ అవసర నివేదికలో డిస్కమ్‌లు సవరణ ప్రతిపాదించగానే తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసేసి దాన్ని యధాతథంగా ఆమోదించటం జరుగుతోంది. దీంతో ప్రతిసారీ వినియోగదారుల నెత్తిన భారం పడుతోంది.

రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై బాదుడే బాదుడు


ఈ ఏడాదిలో రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీ ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థలు గృహ వినియోగానికి ఎలాంటి పెంపూ ప్రతిపాదించకపోయినా గతేడాదిలో మాత్రం యూనిట్‌కు గరిష్టంగా 45 పైసల నుంచి 1రూపాయి 57 పైసల వరకూ పెంపుదల చేశాయి. 2022 ఏప్రిల్ నుంచి పెంచిన ధరలు అమలయ్యాయి. 30 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు 1 రూపాయి 45 పైసల చొప్పున వసూలు చేస్తే అది 1 రూపాయి 90పైసలకు పెరిగింది. 31 నుంచి 75 యూనిట్ల వరకు గతంలో 2రూపాయల 09పైసల చొప్పున వసూలు చేస్తే దాన్ని డిస్కమ్ లు 3 రూపాయలకు పెంచాయి. అలాగే 76 నుంచి 125 యూనిట్ల వరకు ఉన్న 3రూపాయల10 పైసల ధర యూనిట్‌కు 4రూపాయల 50పైసలకు పెరిగింది. 126 నుంచి 225 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు 4రూపాయల43 పైసల చొప్పున వసూలు చేసిన డిస్కమ్‌లు దాన్ని 6రూపాయలకు పెంచాయి. 226 నుంచి 400 యూనిట్ల వరకు ఉన్న ధర 8రూపాయల 75పైసలకు పెంచాయి. ఇక 400 యూనిట్లకు పైబడిన ప్రతీ యూనిట్‌కు చెల్లించాల్సిన కొత్త ధరను 9రూపాయల 75పైసలకు పెంచాయి డిస్కమ్‌లు.

వినియోగదారులు ఇప్పటి వరకు తాము వినియోగిస్తున్న విద్యుత్‌లో ఎటువంటి మార్పులు లేకపోయినా చెల్లించాల్సిన బిల్లు మొత్తం మారుతోంది. దానికి భిన్నంగా విద్యుత్ వినియోగం ఏ మాత్రం పెరిగినా టారిఫ్ మారుతోంది. టారిఫ్ మారితే భారం మరింత ఎక్కువ అవుతోంది. గతంలో చెల్లించిన బిల్లు మొత్తానికి 2 రెట్ల మేర విద్యుత్ బిల్లులు పెరిగాయన్నది విద్యుత్ వినియోగదారుల ఆందోళన. పెరిగిన ధరలను టెలిస్కోపిక్ విధానంలో నిర్ణయించారు. దాని ప్రకారం శ్లాబులు మారితే పెరిగిన యూనిట్ల మేరకే చెల్లించాల్సి ఉంటుంది.

అయితే నాన్ టెలిస్కోప్ విధానమైతే... ఉదాహరణకు 76 నుంచి 125 యూనిట్ల వరకు ఉన్న శ్లాబులోని వినియోగదారుడు ఒక నెలలో 130 యూనిట్ల విద్యుత్ వాడితే మొత్తం అన్ని యూనిట్లకు కలిపి ప్రస్తుతం ఉన్న టారిఫ్ ప్రకారం 4.43 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉండేది. కానీ, ప్రస్తుతం టెలిస్కోప్ విధానమంటూ ఏపీఈఆర్సీ ప్రకటించిన మూలంగా 125 యూనిట్ల వరకూ రూ. 3.10 చొప్పున చెల్లించి, ఆ పైన యూనిట్లకు మాత్రమే రూ. 4.43 చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది పెంచినంత భారీగా ఎప్పుడూ విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. అలాగే సర్దుబాటు ఛార్జీలు గతంలో వసూలు చేయలేదు. కానీ, ప్రభుత్వం కేవలం డిస్కమ్‌లను నష్టాల నుంచి రక్షించాలన్న పేరుతో తాను విడుదల చేయాల్సిన సబ్సిడీ మొత్తాలను ఇవ్వకుండా నేరుగా వినియోగదారుల నెత్తిపైనే ట్రూ ఆప్ భారం మోపుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రతీ ఒక్క గృహ విద్యుత్ వినియోగదారుల బిల్లులోనూ అదనపు మొత్తం వసూలు చేశారు. వాటిపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఈఆర్సీ ఆదేశాలతో కొద్ది నెలలు ట్రూ అప్ వసూళ్లు నిలిపేసినా మళ్లీ ఇప్పుడు కథ మొదటికివచ్చింది.

ప్రస్తుతం రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థలైన... తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల్లో విద్యుత్ పంపిణీ జరుగుతోంది. ఈ విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా సరఫరా అవుతున్న విద్యుత్‌కి 45వేల398.66 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం అమల్లో ఉన్న ధరల కారణంగా అందులో 10వేల933 కోట్ల రూపాయల లోటు ఏర్పడుతోందని అంచనా. ప్రభుత్వం ఎగవేస్తున్న రాయితీలు, సబ్సిడీల కారణంగా ఇంత భారీ లోటు ఏర్పడుతుంది. ఇప్పుడా ఆ భారాన్ని గృహ విద్యుత్ వినియోగదారుల టారిఫ్ సవరించడం ద్వారా భర్తీ చేయాలన్నది డిస్కమ్‌ల ఆలోచన. రాష్ట్రంలో ఉన్న 1.91 కోట్ల విద్యుత్ కనెక్షన్లలో 70 % మేర గృహ వినియోగదారులే ఉన్నారు. టారిఫ్ సవరణలు, ఛార్జీల పెంపు మూలంగా నేరుగా గృహ విద్యుత్ కనెక్షన్లపైనే అదనపు భారం పడుతోంది. 2014 నుంచి 19 వరకు ఐదేళ్ల కాలంతో పోలిస్తే సరాసరి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై భారం మోపాయి. ప్రతి నెల ట్రూ అప్‌ భారంను ప్రజలపై మోపేందుకు కొత్త నిబంధనను కేంద్రం తీసుకువచ్చింది. ఈ మేరకు విద్యుత్‌ నిబంధన చట్టం-2005లోని నిబంధనలు మారుస్తూ కేంద్ర విద్యుత్‌మంత్రిత్వ శాఖ గతేడాది డిసెంబర్‌లో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ట్రూ అప్‌ భారాన్ని నెలనెలా వసూలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ అడ్జస్ట్‌మెంట్‌ సర్‌చార్జ్‌ (ఎఫ్‌పిపిఎఎస్‌) పేరుతో దీనిని అమలు చేయాలని చెప్పింది.

ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నట్లే... కరెంట్‌ ఛార్జీలు నెలకొక్కసారి పెరిగేలా ఉంది. ఈ నిర్ణయంపైనా రాష్ట్రప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డిస్కంలు 3 నెలలకోసారి చేసిన ఖర్చు ఆదాయంలో రాకపోతే ట్రూ అప్‌ భారాలు మోపేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ఈఆర్‌సికి ప్రతిపాదిస్తున్నాయి. ఇప్పటికే 2021-22కి చివరి త్రైమాసికానికి సంబంధించిన ట్రూ అప్‌ భారం 1,048కోట్ల రూపాయలను ప్రస్తుతం ఏపీ ఈఆర్సీ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు బొగ్గు ధరలు, విద్యుత్‌ కొనుగోలు ధర, ట్రాన్స్‌మిషన్‌ ధరలు పెరిగిన ప్రతిసారి వీటిని వసూలు చేసుకోవచ్చునని తెలిపింది. దీంతో ఈ ట్రూప్‌ చార్జీలు ప్రజలపై మోపేందుకు విద్యుత్‌ నియంత్రణ మండలిని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. ఇక నుంచి ప్రతి నెల వినియోగదారులకు తెలియకుండానే భారాలు పడనున్నాయి.

ప్రస్తుతం ప్రతి నెల ట్రూ అప్‌ వసూలు చేసేందుకు అవసరమైన విధానం, తగిన సిబ్బంది లేకపోవటంతోనే డిస్కంలు... ఈ భారం మోపేందుకు ఏడాది పాటు సమయాన్ని తీసుకుంటున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలు విద్యుత్‌ నిల్వ ఉంచే విధానం (ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం) ఏర్పాటు చేసుకోవాలని కూడా కేంద్రం తన నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే ఈ విధానం చాలా ఖర్చుతో కూడుకున్నది. గతంలోనే ఈ విధానంపై రాష్ట్ర ఇంధన శాఖ ఆలోచన చేసింది. ఈ విధానం వల్ల విద్యుత్‌ యూనిట్‌కు సుమారు 20 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడంతో డిస్కంలు వెనక్కి తగ్గాయి. లేకపోతే ఈ భారం కూడా విద్యుత్ వినియోగదారుడిపై వేసేసి చేతులు దులిపేసుకునేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధంగానే ఉన్నాయి.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.