భయపెడుతున్న రెవెన్యూ లోటు.. ప్రతిసారీ అంచనాలకు మించే ఖర్చులు.. దీనికి పరిష్కారం ఏంటి..?

author img

By

Published : Mar 11, 2023, 8:29 AM IST

Revenue Deficit In AP

Revenue Deficit In AP: రాష్ట్రాన్ని రెవెన్యూ లోటు తీవ్రంగా వేధిస్తోంది. ఎప్పటికప్పుడే లోటు పోటు తప్పడం లేదు. రెవెన్యూ రాబడిని మించి మరీ.. వ్యయాలు జరుగుతున్నాయి. ఎంత పరిమితం చేస్తామంటున్నా.. అంచనాలకు మించే ఖర్చులు ఉంటున్నాయి.

భయపెడుతున్న రెవెన్యూ లోటు.. ప్రతిసారీ అంచనాలకు మించే ఖర్చులు.. దీనికి పరిష్కారం ఏంటి..?

Revenue Deficit In AP : ఆంధ్రప్రదేశ్​లో రెవెన్యూ లోటు భయపెడుతోంది. ప్రతిసారీ రెవెన్యూ లోటును నియంత్రిస్తామని అధికారులు, మంత్రులు చెబుతున్నా అది సాధ్యం కాకపోగా.. అంచనాలు మించిపోతోంది. గడిచిన ఐదు సంవత్సరాలలో ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో మరో సరళి ప్రబలిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వరంగ కార్పొరేషన్ల నుంచి అప్పులు తెచ్చి మరీ కొన్ని కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వాటిని తీర్చేందుకు రాష్ట్ర ఆదాయాన్ని మళ్లిస్తున్నారు.

రాష్ట్ర బడ్జెట్‌లోనే కార్పొరేషన్లకు గ్రాంట్లు మంజూరు చేసి, రుణాలు తీర్చాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ అప్పులతో రెవెన్యూ ఖర్చులు చేస్తున్నా.. వాటిని లెక్కల్లోకి చేర్చట్లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా రెవెన్యూ లోటును, ద్రవ్యలోటును ఉన్న దాని కంటే తక్కువగా చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

రెవెన్యూ రాబడి కన్నా.. ఖర్చులు ఎక్కువైతే దానిని రెవెన్యూ లోటు అంటారు. దీనిని ఎప్పటికప్పుడు పరిమితం చేసుకుంటే.. అదే అసలైన ఆర్థిక నిర్వహణ. రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కలిపితే రెవెన్యూ రాబడి అంటారు. సొంత పన్నుల్లో జీఎస్టీ వసూళ్లు, రిజిస్ట్రేషన్ల ఆదాయం, స్టాంపులు, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, కేంద్రపన్నుల్లో వాటాలు, రాష్ట్ర ఎక్సైజ్‌ డ్యూటీలు, ఇతర పన్నులు-సుంకాల ద్వారా వచ్చే మొత్తం ఉంటాయి.

జీతాలు, సబ్సిడీలు, పింఛన్లు, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వ నిర్వహణ, ఇతర ప్రభుత్వ పథకాలకు వెచ్చించే మొత్తాలనూ రెవెన్యూ ఖర్చులే అంటారు. వీటితో ప్రభుత్వానికి ఆదాయం రాదు. రెవెన్యూ రాబడి కన్నా.. ఖర్చులు తక్కువ ఉంటే దానిని రెవెన్యూ మిగులు అంటారు. ప్రస్తుతం 2022-2023 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ అంచనాల్లో రెవెన్యూ లోటు 17,036.15 కోట్ల రూపాయలుగా ఉంటుందని లెక్కించారు. జనవరి వరకు 10 నెలల్లోనే ఇది 47,958.78 కోట్ల రూపాయలకు.. అంటే అంచనాలతో పోలిస్తే 281 శాతంగా ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి.

2019-2020 బడ్జెట్‌ అంచనాల్లో రెవెన్యూ లోటును రూ.1,778.52 కోట్ల రూపాయలకు పరిమితం చేస్తామనగా.. అది 26 వేల 440.52 కోట్ల రూపాయలకు పెరిగింది. 2020-21 బడ్జెట్‌ అంచనాల్లో 18 వేల434 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుగా చూపిస్తే.. అది 35 వేల 540 కోట్ల రూపాయలుగా తేలింది. 2021-22 బడ్జెట్‌ అంచనాల ప్రకారం 5,000.05 కోట్ల రూపాయల లోటు లెక్కించగా అది 19 వేల 545.13 కోట్ల రూపాయలకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును ప్రభుత్వమే 17,036.15 కోట్లుగా అంచనా వేసింది. తొలి పది నెలల్లోనే అది రూ.47,958.78 కోట్లకు చేరుకుంది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడం, రెవెన్యూ ఖర్చులను పరిమితం చేయలేని పరిస్థితుల్లో ఈ సవాలు ఎదురవుతోంది. రెవెన్యూ రాబడులు అంచనాలతో పోలిస్తే మరీ తగ్గిపోతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.