ETV Bharat / state

స్మార్ట్​మీటర్ల ప్రాజెక్టు లోపాలపై సంచలన నివేదిక.. ప్రభుత్వ మాటల్లో నిజం లేదా..?

author img

By

Published : Mar 7, 2023, 9:35 AM IST

smart meters
స్మార్ట్‌మీటర్లు

Flaws in Smart Meters Project for Agricultural Motors: "వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే విద్యుత్‌ ఆదా అయింది.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టుతో ఇది రుజువైంది..’ అంటూ వైసీపీ సర్కారు పదేపదే ఊదరగొడుతోంది. కానీ ఈ మాటల్లో ఏ మాత్రం నిజం లేదని.. పైగా ప్రజాధనం వృథా అని ప్రభుత్వం చేయించిన అధ్యయనంలోనే బయటపడింది. ‘వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు అమర్చడం వల్ల విద్యుత్‌ వినియోగం తగ్గినట్టు.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులో ఎలాంటి ఆధారమూ లేదు అని.. పుణెకి చెందిన ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది.ఈ నివేదికలోని వాస్తవాల్ని రహస్యంగా ఉంచిన ప్రభుత్వం.. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకే మొగ్గుచూపుతోంది.

Flaws in Smart Meters Project for Agricultural Motors: వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టులోని లోపాల్ని ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ అనే స్వచ్ఛంద సంస్థ అడుగడుగునా ఎత్తిచూపినా ప్రభుత్వానికి చెవికెక్కలేదు.వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తూ రాష్ట్రంలోని 18.50 లక్షలకుపైగా వ్యవసాయ పంప్‌సెట్లకు స్మార్ట్‌మీటర్లను అమర్చాలని, వాటి సరఫరా, నిర్వహణ కాంట్రాక్ట్‌ను అస్మదీయుల కంపెనీలకు అప్పగించాలని చూస్తోంది. పైగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు శ్రీకాకుళం పైలట్‌ ప్రాజెక్టును ఉదాహరణగా చూపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 28 వేల వ్యవసాయ పంప్‌సెట్‌లకు ఇన్‌ఫ్రారెడ్‌ మీటర్లు అమర్చడం వల్ల 36 శాతం విద్యుత్‌ ఆదా అయినట్టు చెబుతోంది. కానీ అంత భారీ ఖర్చుతో మోటార్లకు మీటర్లు అమర్చడం ఎంత పనికిమాలిన, తెలివితక్కువ వ్యవహారమో, ప్రభుత్వ వాదన ఎంత అసంబద్ధమో.. పీఈజీ నివేదిక స్పష్టం చేసింది.

విద్యుత్‌ వినియోగం, సబ్సిడీల భారం తగ్గాలనుకుంటే.. వ్యవసాయంలో నీరు, విద్యుత్‌ వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలే తప్ప.. మోటార్లకు మీటర్లు పెడితే ఒరిగేదేమీ ఉండదని చురకలు వేసింది.రాష్ట్రంలోని 18.50 లక్షలకుపైగా వ్యవసాయ పంప్‌సెట్‌లకు 6 వేల500 కోట్ల భారీ పెట్టుబడితో స్మార్ట్‌మీటర్లు అమర్చాలన్న ఆలోచన సబబుగా లేదని పీఈజీ నివేదిక పేర్కొంది. ప్రస్తుత వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌లో 25 శాతం చొప్పున ఐదేళ్ల కాలం ఆదా చేయగలిగితేనే.. స్మార్ట్‌మీటర్లపై చేసిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకున్నట్టవుతుందని తెలిపింది. కానీ అది అంత తేలిక కాదంది.

తేల్చిచెప్పిన పీఈజీ: శ్రీకాకుళం ప్రాజెక్టుపై రాష్ట్ర ఆర్థికశాఖ పరిధిలోని ఏపీ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థ పీఈజీతో ఈ అధ్యయనం చేయించింది. శ్రీకాకుళంలో విస్తృతంగా అధ్యయనం చేసిన పీఈజీ సంస్థ నివేదిక ఆధారంగానే.. స్మార్ట్‌మీటర్లపై డిస్కంల వైఖరిని, టెండర్ల ప్రక్రియలోని లోపాలను ఎండగడుతూ, తీవ్రంగా పరిగణిస్తూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గత సంవత్సరం సెప్టెంబరు, అక్టోబరుల్లో లేఖలు రాశారు. దాంతో గుత్తేదారులకు భారీగా ధరలు చెల్లించేలా అప్పటికే పిలిచిన టెండర్లను డిస్కంలు రద్దు చేసి.. మరోసారి టెండర్లకు వెళ్లాయి. ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ నివేదికను రహస్యంగా ఉంచింది.

శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ పైలట్‌ ప్రాజెక్టు ద్వారా కచ్చితమైన ఫలితాలు రావాలన్నా, అది విజయవంతమైందో లేదో తెలియాలన్నా.. కనీసం రెండు నుంచి మూడేళ్ల పాటు పరిశీలన, డేటా అవసరమని పీఈజీ తేల్చిచెప్పింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లను అమర్చాలనుకుంటే.. ముందుగా కొన్ని పైలట్‌ ప్రాజెక్టులు చేపట్టి తరువాత ఫలితాలు అధ్యయనం చేశాకే ముందుకెళ్లాలని సూచించింది.

ధర ఎక్కువే: ప్రస్తుతం ఐఆర్‌ మీటర్ల కన్నా స్మార్ట్‌ మీటర్లకు ఖర్చు ఎక్కువ అన్న ప్రయాస్‌ సంస్థ.. ఐఆర్‌ మీటర్‌ ధర 2 వేల 500 రూపాయలు ఉంటే, స్మార్ట్‌ మీటర్‌ ధర 3 వేల 600 రూపాయలుగా ఉందని తెలిపింది. స్మార్ట్‌ మీటర్లకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, డేటా స్టోరేజి ఎలిమెంట్‌ కావాలని.. ఐఆర్‌ మీటర్ల నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ కన్నా దాని ధర చాలా ఎక్కువని పేర్కొంది. మీటర్‌ రీడింగ్‌కయ్యే ఖర్చు ఒక్కటే.. ఐఆర్‌ మీటర్లకు సంబంధించిన నిర్వహణ వ్యయమని వెల్లడించింది. స్మార్ట్‌ మీటర్లకు డేటా కమ్యూనికేషన్‌ ఛార్జీలు, డేటా హోస్టింగ్‌ ఛార్జీలు అదనం కాగా.. స్మార్ట్‌ మీటర్లకు మంచి డేటా కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఉండాలని పేర్కొంది.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చేందుకు భారీ మొత్తంతో మూలధన, నిర్వహణ వ్యయం అవసరమని.. వ్యవసాయ పంప్‌సెట్‌లు విసిరేసినట్టుగా అక్కడక్కడా ఉండటం, మీటర్లపై ఎండావానా వంటి ప్రకృతి శక్తుల ప్రభావం, జీఎస్‌ఎం నెట్‌వర్క్‌ సమస్యలు వంటివి ఉండనే ఉంటాయంది. స్మార్ట్‌మీటర్లతో బిల్లింగ్, కలెక్షన్‌ సామర్థ్యం పెరుగుతుందన్నది నిజమే కానీ గడువు ప్రకారం ఆటోమేటిక్‌గా బిల్లులు జారీ చేయడం, చెల్లించనివారి కనెక్షన్లు తొలగించడం, బిల్లు కట్టాక పునరుద్ధరించడం వంటి చర్యల ద్వారానే అది నెరవేరుతుందంది. వ్యవసాయ పంప్‌సెట్‌లకు అలా చేయడం అసాధ్యమన్న పీఈజీ నివేదిక.. అంత భారీ వ్యయంతో స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దాని వల్ల ఏ మేరకు అదనపు ప్రయోజనాలుంటాయన్నది ముందుగా మదింపు చేయాలంది.

వ్యవసాయ విద్యుత్‌ వినియోగాన్ని మెరుగైన విధానాల్లో ఎలా లెక్కించాలన్న దానిపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టిపెట్టాలని.. రైతులు ఎంత విద్యుత్‌ వినియోగించారో అంతే మొత్తాన్ని ప్రభుత్వం నుంచి డిస్కంలకు వారి ఖాతాల ద్వారా బదిలీ చేయడమన్నది అంత తెలివైన పనికాదని పేర్కొంది. ఆ ఖాతాల్ని రైతులు ఎప్పుడూ వినియోగించరని.. డిస్కంలు నష్టాలు తగ్గించుకోవాలంటే దీనికి బదులు, వేరే విధానాలు అనుసరించాలని తేల్చిచెప్పింది.

మీటర్ల వైఫల్యం 21 శాతం?: శ్రీకాకుళంలో ప్రారంభించిన పైలట్‌ ప్రాజెక్టులో అన్నీ సక్రమంగా ఉన్న మీటర్‌ రీడింగ్‌ నమోదు 45 నుంచి 55 శాతమే ఉందని పీఈజీ నివేదిక చెప్పింది. అదే రాష్ట్రంలో గృహ వినియోగానికి సంబంధించిన వ్యాలీడ్‌ మీటర్‌ రీడింగ్‌ 95 శాతంగా ఉన్నట్లు తెలిపింది. మీటర్ల వైఫల్యం 21 శాతంగా ఉందని పేర్కొంది. ప్రతి నెలా సుమారు 300 వరకూ మీటర్లను మార్చాల్సి వస్తోందని ఏపీఈపీడీసీఎల్‌ సిబ్బందే చెప్పారని.. మీటర్లు ఆగిపోవటం, కాలిపోవడం, రీడింగ్‌ ఒక్కసారిగా జంప్‌ అవడం, పడిపోవడం వంటి పలు సమస్యలు ఎక్కువగా కనిపించాయని పేర్కొంది. ఈ లెక్కన ఐదేళ్లలో ఒక్క జిల్లాలోనే 18 వేల మీటర్లను మార్చాల్సి వస్తుందని తెలిపింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో కేవలం 22 శాతం మంది వినియోగదారులకు సంబంధించే మొత్తం 12 నెలలూ రీడింగ్‌ నమోదు చేయగా.. శ్రీకాకుళంలో అమర్చిన 28,463 మీటర్లలో.. సక్రమంగా పనిచేస్తున్న స్థితితో ఉన్న మీటర్ల నుంచి తీసుకున్న రీడింగ్‌ 55 శాతమే. 28 శాతం మీటర్లలో సున్నా రీడింగ్, లేదా రీడింగ్‌ నమోదు కాకపోవడం వంటివి ఉన్నాయని తెలిపింది. డోర్‌ లాక్‌ చేసినవి, స్తంభించిపోయినవి, ఇతర కేటగిరీలకు చెందినవి 17 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

లెక్కలు సరైనవేనా?: 2021 -22 ఆర్థిక సంవత్సరానికి చెందిన.. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ శాంప్లింగ్‌ ఆధారంగా తీసుకొని సేకరించిన డేటాను, 2020 -21 ఆర్థిక సంవత్సరానికి చెందిన మీటర్ల ద్వారా రికార్డు చేసిన డేటాతో పరిశీలిస్తే వ్యవసాయ విద్యుత్‌ వినియోగం 36 శాతం తగ్గినట్టు కనిపిస్తోందని ప్రయాస్‌ తన నివేదికలో తెలిపింది. కానీ అదే సమయంలో ఫీడర్‌ ఆధారిత అంచనాల ప్రకారం విద్యుత్‌ నష్టాలు పెరిగాయని.. ఈ తేడాను గమనించాలని సూచించింది. సమాచారం సక్రమంగా ఉందో లేదో సరిచూసుకోవాలని చెప్పింది. ఐఆర్‌ మీటర్ల బిల్లులు సక్రమంగా తీశారా.. లేదా? మీటర్ల ఐఆర్‌ స్టేటస్‌ ఎలా ఉందో పరిశీలించాలని పేర్కొంది.

ఫీడర్‌ సేల్స్‌ డేటాకి, పంప్‌సెట్‌ స్థాయిలో వినియోగించిన విద్యుత్‌ లెక్కలకు మధ్యా వ్యత్యాసం ఉందన్న నివేదిక.. ఈపీడీసీఎల్‌ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2020-21లో 106 మిలియన్‌ యూనిట్‌ల వినియోగం జరిగితే, మరుసటి సంవత్సరం అది 64 మిలియన్‌ యూనిట్‌లకు తగ్గినట్లు పేర్కొంది. కానీ ఐఆర్‌ మీటర్‌ రీడింగ్‌కి సంబంధించి అనేక సమస్యలున్న దృష్ట్యా, ఈ లెక్కలు సరైనవని చెప్పడానికి వీల్లేదని నివేదక స్పష్టం చేసింది.

రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ కనీసం పది నెలల చొప్పున ఐఆర్‌ మీటర్‌ రీడింగ్‌ సేకరించిన 13వేల 787 మంది వినియోగదారుల డేటాను పరిశీలిస్తే.. 2020-21లో 63 మిలియన్‌ యూనిట్ల వినియోగాన్ని అంచనా వేయగా, 97 మిలియన్‌ యూనిట్‌లు వినియోగించినట్టు నమోదైందని వెల్లడించింది. అదే 2021-22లో 50 మిలియన్‌ యూనిట్లే నమోదైందని...విద్యుత్‌ వినియోగం తగ్గుదల కేవలం ఐఆర్‌ మీటర్ల వల్లేనని చెప్పలేమని పేర్కొంది. వర్షాలు పడటం, రైతులు పంట మార్పిడి చేయడం వంటి కారణాలూ ఉంటాయని నివేదిక స్పష్టం చేసింది.

ఆషామాషీ వ్యవహారం కాదు: వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలనుకోవడం కీలకమైన అడుగే అయినా.. అన్ని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు అమర్చడం, వాటిని నిర్వహించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని పీఈజీ నివేదిక పేర్కొంది. వినియోగంలో లేని పంపుల్ని, లోడ్‌లో హెచ్చుతగ్గుల్ని, లోపవర్‌ ఫ్యాక్టర్‌ వంటి అంశాల్నైతే గుర్తించొచ్చు కానీ వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించి మోటార్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు.. ఇలా వివిధ స్థాయిల్లో మీటర్లు మీటర్లు అమర్చడం వల్ల అయ్యే ఖర్చు, ప్రయోజనాలు, సవాళ్లు వేర్వేరుగా ఉంటాయని తెలిపింది.

ఏ స్థాయిలో మీటర్లు పెడితే మంచిదన్న విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించాకే ఏపీలో మీటరింగ్‌ వ్యూహాన్ని ఖరారు చేయాలని ప్రయాస్‌ సంస్థ సూచించింది. స్మార్ట్‌ మీటర్లకయ్యే ఖర్చును, ప్రయోజనాల్ని సరిగ్గా మదింపు చేసి.. నేర్చుకున్న పాఠాల ఆధారంగా దశలవారీగా మిగతా ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది. శ్రీకాకుళం జిల్లాలో మీటరింగ్‌ వ్యవస్థ మెరుగుపడిన తర్వాతే ఇతర జిల్లాల్లో చేపట్టాలని స్పష్టం చేసింది.

అలా చేస్తే తక్కువ ఖర్చే: వ్యవసాయ విద్యుత్‌ వినియోగాన్ని అంచనా వేయాలంటే మోటార్లకే మీటర్లు పెట్టాల్సిన పనిలేదనన్న పీఈజీ నివేదిక.. ఫీడర్‌ స్థాయిలో మీటర్లు, పంపిణీ నష్టాల్ని లెక్కించడం ద్వారానూ తెలుసుకోవచ్చు అంది. ఏపీలో 67 శాతం వ్యవసాయ పంప్‌సెట్‌లకు హైవోల్టేజి డిస్ట్రిబ్యూషన్‌ స్కీంల నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతోందని.. వ్యవసాయ విద్యుత్‌ వినియోగాన్ని అంచనా వేసేందుకు డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు అమర్చడం తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ అని తెలిపింది.

డీటీలకు అయితే.. నాలుగోవంతు మీటర్లే సరిపోతాయని.. డీటీల వారీగా వినియోగించిన విద్యుత్‌ను.. దాని పరిధిలోని వినియోగదారులకు నిర్దేశిత లోడ్స్‌ ఆధారంగా విభజించడం ద్వారా, తరచూ తనిఖీలు చేయడం ద్వారానూ వ్యక్తిగత స్థాయిలో ఒక రైతు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నారో తెలుసుకోవచ్చని నివేదిక తెలిపింది.


స్పష్టం చేసిన నివేదిక: ఏపీలో వ్యవసాయ విద్యుత్‌ వినియోగ అంచనాల్ని మెరుగుపరచాల్సిన అవసరముంది కానీ అది మొదట ఫీడర్‌ స్థాయిలో మొదలవ్వాలని పీఈజీ నివేదిక స్పష్టం చేసింది. ఆ తర్వాత డీటీలకు, చివరగా పంప్‌సెట్‌లకు పెట్టాలని సూచించింది. ప్రతి గంటకు ఆటోమేటిక్‌గా డేటా రికార్డు చేయడం, వినియోగదారుల్ని మ్యాపింగ్‌ చేయడం, నష్టాల్ని లెక్కించే విధానాల్ని మెరుగుపరచడం వంటి చర్యల ద్వారా ఫీడర్‌లకు మీటర్లు అమర్చి మంచి ఫలితాలను సాధించవచ్చని పీఈజీ నివేదిక తెలిపింది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో అమల్లో ఉన్న డీటీ ఆధారిత వ్యవసాయ విద్యుత్‌ వినియోగ అంచనా వ్యవస్థల్ని తొలగించకూడదు. శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్‌డీ మీటర్లు అమర్చాక దాన్ని తీసేశారు. వీలైతే అక్కడా పునరుద్ధరించాలని నివేదిక సూచించింది.

వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టులో విస్తుగొలిపే విషయాలను బయటపెట్టిన ప్రయాస్ సంస్థ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.