ETV Bharat / state

సీఎం సభలో గేట్లకు తాళాలు.. గోడలు దూకి వెళ్లిన ప్రజలు

author img

By

Published : Feb 28, 2023, 6:23 PM IST

YSR Rythu Bharosa program: సీఎం జగన్‌ సభకు జనాన్ని భారీగా తరలించారు. వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లోని పలుగ్రామాల నుంచి డ్వాక్రా మహిళల్ని బస్సుల్లో తరలించారు. ఉదయం 9 గంటలకల్లా ప్రాంగణంలోకి పంపించేశారు. అయితే, ప్రజలు మాత్రం ఓవైపు ఎండ, మరోవైపు ఆకలికి తట్టుకోలేక బయటిదారి పట్టారు. సీఎం వెళ్లాకే గేట్లు తెరుస్తామని... ఈలోగా వెళ్లాలనుకుంటే చుట్టూ తిరిగి వెళ్లాలని తెగేసి చెప్పడంతో.. సభకు వచ్చిన వారు గోడ దూకుతూ.. సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వచ్చింది.

Etv Bharat
Etv Bharat

ఎంతకీ గేట్లు తెరవకపోవడంతో గోడ దూకుతూ వెళ్లిన ప్రజలు

YSR Rythu Bharosa program in AP: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో.. సీఎం జగన్‌ సభకు జనాన్ని భారీగా తరలించారు. వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల్లోని పలుగ్రామాల నుంచి డ్వాక్రా మహిళల్ని బస్సుల్లో తరలించారు. ఉదయం 9 గంటలకల్లా ప్రాంగణంలోకి.. పంపించేశారు. పదిన్నర గంటల తర్వాత జగన్‌ సభాస్థలికి చేరుకున్నారు. 11 గంటల తర్వాత వేదికపైకి చేరుకున్నారు. ఉదయం 9గంటల్లోపే గ్యాలరీల్లోకి ప్రవేశించిన ప్రజలకు ఈలోగా ఓపిక నశించింది. ఓవైపు ఎండ, మరోవైపు ఆకలికి తట్టుకోలేక బయటిదారి పట్టారు. ఆంక్షల పేరుతో చుక్కలు చూపించిన పోలీసులు సభకు వచ్చినవారితో.. ఓ రకమైన సర్కస్‌ ఫీట్లే చేయించారు. సీఎం వెళ్లేదాకా బయటకు పంపేది లేదంటూ గేట్లు మూసేశారు. ఎండకు, ఆకలికి ఉండలేని ప్రజలు సీఎం ప్రసంగిస్తుండగానే.. గోడలు దూకి వెళ్లిపోయారు.

గేటుకు తాళాలు: గేటువరకూ వచ్చిన ప్రజలను పోలీసులు బయటకు వెళ్లనీయలేదు. గేటుకు తాళాలు వేశారు. సీఎం వెళ్లాకే గేట్లు తెరుస్తామని.. ఈలోగా వెళ్లాలనుకుంటే చుట్టూ తిరిగి వెళ్లాలని తెగేసి చెప్పారు. గేటువద్ద ఎంతసేపు వేచిచూసినా ఎవరినీ బయటకు పంపలేదు. 40 ఏళ్లు దాటిన వారిపైనా దయ తలవలేదు. ఎంతకీ గేట్లు తెరవకపోవడంతో.. అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నతమ్ముళ్లు ఒకింత సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వచ్చింది. బారికేడ్ల లోపలి నుంచి దూరి బయటపడ్డారు. ప్రధాన గేటు తెరవకపోడంతో గోడ దూకారు. 40 నుంచి 50 ఏళ్ల వయస్కులు కూడా కష్టమైనా ఒకరినొకరు సాయం తీసుకుంటూ గోడ దూకారు. అలా ఒకరిద్దరు కాదు పెద్దసంఖ్యలో పరారయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందే సభ కోసం వచ్చిన చాలా మంది ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అన్నపానీయాలు లేవని ఆక్రోశించారు.

చెట్లు తొలగింపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటన అనగానే రోడ్ల వెంట ఉన్న చెట్లను నరకటం పరిపాటి అయ్యింది. ప్రతి సారి జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు సాకు చూపుతూ చెట్లను తొలగించటానికి ఆదేశాలు ఇస్తున్నారు. సీఎం భద్రత పేరుతో, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనీ... ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వృక్షాలను నరికివేస్తున్నారని ప్రకృతి ప్రేమికులు ఆరోపించారు. ప్రజలు.. అధికారులు వ్యవహరించే తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు గుంటూరు జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు చెట్లను తొలగించారు. అలాగే రోడ్డుకు ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

తెలుగుదేశం, జనసేన నేతలపై మరోవైపు సీఎం పర్యటన దృష్ట్యా.. గుంటూరు జిల్లా తెలుగుదేశం, జనసేన నేతల కదలికల్ని పోలీసులు నియంత్రించారు. ముఖ‌్య నేతలను గృహ నిర్భంధం చేశారు. కొందరిని, స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. పోలీసుల నిర్బంధంపై గుంటూరు లాడ్జి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జనసేన నేతలు నిరసన తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.