ETV Bharat / state

ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వం స్థాపిస్తాం: పవన్

author img

By

Published : Mar 14, 2022, 8:42 PM IST

Updated : Mar 14, 2022, 10:34 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని.. రాష్ట్ర రాజధాని ఎక్కడికీ తరలిపోయే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైకాపా ప్రజావ్యతిరేక విధానాలపై యుద్ధం కొనసాగుతుందన్న జనసేనాని.. 2024 ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ గుంటూరు జిల్లా ఇప్పటంలో ఘనంగా జరిగింది. ఈ బహిరంగ సభలో సుదీర్ఘంగా ప్రసంగించిన పవన్.. జగన్ ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతూ.. తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వం స్థాపిస్తాం: పవన్
ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వం స్థాపిస్తాం: పవన్

జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సభావేదిక మీదుగా.. అధికార వైకాపా తీరుపై నిప్పులు కురిపించారు పవన్. ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వైకాపాను గద్దె దించి తీరుతామన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్. జనసైనికులపై వైకాపా చేసే దాడులకు వెన్ను చూపేది లేదన్న పవన్.. వైకాపా మహిషానికి మొలిచిన కొమ్ములు విరగ్గొట్టి.. గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఇందుకోసం భాజపా నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తానన్నారని, దానికోసమే ఎదురుచూస్తున్నామని చెప్పారు పవన్‌. వైకాపా వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదన్న జనసేనాని.. ప్రజా ప్రయోజనాల కోసం పొత్తుల గురించి తర్వాత ఆలోచిస్తామన్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్​ బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.

ఏపీ రాజధాని అమరావతే.. 2024లో ప్రజాప్రభుత్వం స్థాపిస్తాం: పవన్

అశుభంతో వైకాపా పాలన ఆరంభం..
వైకాపా 151 సీట్లు గెలిచినపుడు బాగా పాలిస్తారనే తాను ఎదురుచూశానని, కానీ.. ప్రజాకాంక్షకు వ్యతిరేక పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు పవన్. ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా పాలన ప్రారంభించిందని అన్నారు. వైకాపా తీసుకొచ్చిన ఇసుక విధానంతో 30 లక్షల మంది రోడ్డునపడ్డారని, 32 నిండు ప్రాణాలు బలయ్యాయని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాకు ఇంత విధ్వంసపూరిత ఆలోచనా విధానం ఏంటని ప్రశ్నించారు. వైకాపా నేతలు ఏమని ప్రతిజ్ఞ చేసి అధికారం చేపట్టారని నిలదీశారు. ఏపీ ప్రజలు తమ బానిసలని ప్రతిజ్ఞ చేశారా? ప్రజల నడ్డి విరగ్గొడతామని ప్రతిజ్ఞ చేశారా? ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఆంధ్రను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారా? అని పవన్ ప్రశ్నించారు. ఇంకా.. న్యాయవ్యవస్థను లెక్కచేయబోమని ప్రతిజ్ఞ చేశారా? రోడ్లను గుంతలు గుంతలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారా? అని నిలదీశారు. వైకాపా నేతలంటే తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్న పవన్‌కల్యాణ్‌.. వైకాపా విధానాలపైనే తాను విమర్శలు చేస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే తాను మాట్లాడేవాడిని కాదని అన్నారు.

రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాక రాజధాని ఎలా మారుస్తారు..?
ఏపీ రాజధాని అమరావతిపైనా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు పవన్. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని, రాజధాని అమరావతికి రైతులు భూములు ఇచ్చారని పవన్‌ అన్నారు. రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాక ఎవడబ్బ సొమ్మని రాజధాని మారుస్తారని పవన్ నిలదీశారు. సీఎం మారినప్పుడల్లా రాజధానులు మారవని తేల్చి చెప్పారు. ఏ ప్రభుత్వం చట్టం చేసినా అది కొనసాగుతుందన్న పవన్.. సీఎంలు మారినప్పుడల్లా విధానాలు మారవని అన్నారు. రాజధానులకు భూములివ్వని రైతులకు తాను ఆరోజు మద్దతిచ్చానని పవన్‌ చెప్పారు. మరి, రైతులు ఒప్పందం చేసుకున్నప్పుడు వైకాపా నేతలు గాడిదలు కాశారా? అని పవన్‌ ప్రశ్నించారు. రాజధానికి 32 వేల ఎకరాలు సరిపోవని అప్పుడు జగన్‌ అన్నారన్న పవన్‌.. మరి, ఆనాడే 3 రాజధానులు చేస్తామని వైకాపా నేతలు ఎందుకు చెప్పలేదని సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్ర ఆదాయం రూ.1.17 లక్షల కోట్లు.. ఆ డబ్బంతా ఎటు పోతోంది?
రాష్ట్రంలో ఆదాయం భారీగా వస్తున్నప్పటికీ.. దుర్వినియోగమే ఎక్కువగా అవుతోందని అన్నారు పవన్. పార్టీ ప్రకటనల కోసమే రూ.400 కోట్లు వృథా చేశారని వైకాపాపై ధ్వజమెత్తారు. పార్టీ రంగులు వేసుకునేందుకు రూ.300 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఈ వృథా ఖర్చు బదులు ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఇవ్వవచ్చు కదా? అని పవన్ ప్రశ్నించారు. ఇలా దుబారా చేయడానికి డబ్బులు ఉంటాయిగానీ.. ఉద్యోగుల జీతాలకు మాత్రం డబ్బులు ఉండవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం ఎటు పోతుందో అడిగేవారు లేరని అన్నారు. రూ.7 లక్షల కోట్లు అప్పు అని చెబుతున్నారన్న పవన్‌కల్యాణ్‌.. అప్పులు తీర్చే మార్గాలను వెతకాలని సూచించారు. వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంటే ఎలా? అని నిలదీశారు. రూ.లక్ష కోట్ల ఆదాయం సద్వినియోగం చేయకపోతే.. ప్రభుత్వంలో లోపమున్నట్లేనని తేల్చి చెప్పారు. ఈ విషయాలు ప్రశ్నిస్తే.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. చివరకు పోలీసులు కూడా భయపడే స్థాయికి వెళ్లారని అన్నారు. ఎక్కువగా మాట్లాడితే వీఆర్‌కు పంపుతున్నారని, ఇప్పటి వరకు ఎందరు అధికారులను వీఆర్‌లో పెట్టారో లెక్కలేదని పవన్‌ అన్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిన వైకాపా.. ఆ తర్వాత ఉద్యోగులకు మొండిచేయి చూపారని మండిపడ్డారు.

ఏపీని సుసంపన్నం చేసేందుకు షణ్ముఖ వ్యూహం..
ఆవిర్భావ సభ వేదికగా.. జనసేన భవిష్యత్ ప్రణాళికలను పవన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలని, ఉంటుందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేస్తామని చెప్పారు. అప్పుల్లో కూరుకున్న ఏపీని సంపన్న రాష్ట్రంగా మార్చాలన్నదే పవన్‌ జనసేన లక్ష్యమని అన్నారు. బలమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తెస్తామని పవన్‌ చెప్పారు. పెట్టుబడులు తరలివచ్చే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్న పవన్‌.. అల్పాదాయ వర్గాలకు ఉచితంగా ఇసుక ఇస్తామని ప్రకటించారు. జనసేన సౌభాగ్య పథకం కింద యువతకు సాయం చేస్తామని, ఐదేళ్లలో 5 లక్షల మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పవన్‌ ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మారుస్తామని, పంట కాలువలు, మినీ రిజర్వాయర్లను ఆధునీకరిస్తామన్నారు. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రతి పోస్టునూ భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగుల ప్రయోజనాలు కాపాడడమే జనసేన లక్ష్యమన్నారు. ఉద్యోగులకు వేతన సవరణ చేపడతామన్న పవన్‌కల్యాణ్‌.. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సీపీఎస్‌ ఖచ్చితంగా రద్దు చేస్తాని స్పష్టంగా చెప్పారు.

జనసేనకు గత పునాది లేదు..
ఒక పార్టీని నడపాలంటే సైద్ధాంతిక బలం ఉండాలని, బలమైన సిద్ధాంతాన్ని పట్టుకున్న లక్షల మంది ఉండాలని పవన్‌ అన్నారు. వైకాపా, తెదేపాకు బలమైన పునాదులున్నాయని పవన్‌కల్యాణ్‌ గుర్తు చేశారు. కానీ.. జనసేనలో సీనియర్‌ నాయకులు ఎవరూ లేరని అన్నారు. జనసైనికులు, తాను మాత్రమే ఉన్నామని చెప్పారు. అయినా.. అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నామని పవన్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో 7 శాతం ఓట్లు సాధించామన్న పవన్‌కల్యాణ్‌.. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరఫున 1,209 మంది సర్పంచులు గెలిచారని అన్నారు. తద్వారా.. 7 నుంచి 27 శాతానికి జనసేన ఓట్లు పెరిగాయని చెప్పారు. రాబోయే రోజుల్లో.. అధికారం సాధించే స్థాయికి జనసేన చేరుతుంది పవన్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనే నేతల వ్యక్తిత్వం బయటపడుతుందన్న పవన్‌.. ఇచ్చిన మాటపై నిబద్ధత కలిగి ఉండటం నాయకత్వ లక్షణమని అన్నారు. ఆ లక్షణంతోనే ముందుకు సాగుతున్నానని అన్నారు.

సుదీర్ఘ నమస్కారాలు..
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సభ నిర్వహించిన అధినేత పవన్ సుదీర్ఘంగా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నేతలకు, అన్ని వర్గాల ప్రజలకూ ధన్యవాదాలు తెలియజేశారు. తమ పార్టీ నేతలు శ్రేణులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. చివరకు తన సంస్కారం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా నేతలకూ నమస్కారాలు తెలియజేశారు పవన్.

సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం పంచాయతీకి విరాళం..
జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చి, తమ పార్టీపై ప్రేమచూపిన ఇప్పటం ప్రజలకు కృతజ్ఞతగా గ్రామానికి రూ.50 లక్షలు విరాళం ఇస్తున్నట్టు పవన్ ప్రకటించారు. రైతు పెద్దల ద్వారా గ్రామ పెద్దలకు విరాళం అందజేస్తాని పవన్‌ తెలిపారు.

ఈరోజే ఎన్నికల సమరశంఖం పూరిద్దాం : నాదెండ్ల

ఈరోజే ఎన్నికల సమరశంఖం పూరిద్దాం : నాదెండ్ల
వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం స్థాపించేందుకు ప్రతీ జనసైనికుడూ ప్రయత్నించాలని.. అందుకోసం ఇప్పటం సభనుంచే.. సమరశంఖం పూరించాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ వెంట ప్రతిఒక్కరూ నడవాలని కోరారు. పార్టీ స్థాపించిన తర్వాత పవన్‌కల్యాణ్‌ ఎన్నో అవమానాలకు గురయ్యారని, పవన్‌ను ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయ నాదెండ్ల అన్నారు. అయితే... తెలుగు ప్రజల కోసం ఎవరినైనా ఎదుర్కొంటానని పవన్‌ అన్నారని చెప్పారు.

కార్యకర్తలు సమయం వెచ్చించాలి..
పార్టీ కార్యక్రమాల్లో జనసేన కార్యకర్తలు విస్తృతంగా పాల్గొనాలని నాదెండ్ల కోరారు. ఇప్పుడు అహంకారం.. ఆత్మగౌరవానికి మధ్య పోరాటం సాగుతోందని, ఇందులో అందరూ పాల్గొనాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని అన్నారు. యువత, మహిళలు, అన్నదాతల పక్షన జనసేన పనిచేస్తోందని చెప్పారు. గత ఎన్నికల్లో కొందరికి జీతాలు ఇచ్చి మరీ.. జనసేనపై దుష్ప్రచారం చేయించారని, ఇప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మనోహర్ అన్నారు. దీనిపై జనసైనికులు పోరాటం చేయాలని కోరారు.

రాజకీయ నాయకుల్లో అవినీతి పెరిగిపోయింది..
ప్రస్తుతం రాజకీయాల్లో అవినీతి భారీగా పెరిగిపోయిందని మనోహర్ అన్నారు. పేద ఎస్సీ కుటుంబం నుంచి వచ్చి, ఏఐసీసీ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన సంజీవయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. అంతటి మహానుభావుడినీ ఎవరూ స్మరించట్లేదని, అందుకే సంజీవయ్య పేరును ఈ సభా ప్రాంగణానికి పెట్టామని మనోహర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమం పేరుతో విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని వైకాపా ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. భూకబ్జాలు చేస్తూ, చెరువులు తవ్వేస్తూ, నదీ పరివాహక ప్రాంతాలు ఆక్రమిస్తున్నారని అన్నారు.

రాజధాని సర్వనాశనం...
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని సర్వ నాశనం చేశారని నాదెండ్ల ధ్వజమెత్తారు. అమరావతిలో ఒకప్పుడు 8 కోట్లు పలికిన భూమి.. ఇప్పుడు 3 కోట్లకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నాశనానికి జగన్‌ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమం పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్న నాదెండ్ల.. రాష్ట్రంలో 30-40 శాతం మందికే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ఈ మూడేళ్లలో జగన్‌ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో జగన్‌ మోసం చేశారని అన్నారు. సీఎం తీరుతో పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్న నాదెండ్ల.. ఎమ్మెల్యేలే రౌడీలుగా మారి కర్రలు పట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు, రాష్ట్రం బాగు కోసం ప్రతిక్షణం పవన్‌కల్యాణ్‌ ఆలోచిస్తున్నారని, ప్రజలకోసమే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు.

జనసేన పార్టీ బలపడింది..
జనసేన పార్టీని ఎందరో నాయకులు పార్టీ వదిలివెళ్లినా.. కార్యకర్తలు, మహిళలు పార్టీని నిలబెట్టారని నాదెండ్ల కొనియాడారు. ప్రస్తుతం జనసేన పార్టీ సంస్థాగతంగా బలపడిందని, గ్రామగ్రామాన పార్టీ సభ్యత్వం పెరిగిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నార చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదుకు ఊహించని స్పందన వచ్చిందన్న మనోహర్.. పార్టీ క్రియాశీల సభ్యులే బూత్‌ ఏజెంట్లుగా పనిచేయాల్సి ఉందని సూచించారు. పార్టీకోసం.. 'అస్త్ర' యాప్‌ను సిద్ధం చేశామని చెప్పారు. ప్రతి జనసైనికుడు మన కుటుంబంలో భాగమేనని, అందరం కలిసి వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం సాధించేలా పోరాటం చేయలని పిలుపునిచ్చారు.

మూడేళ్లు రాజధాని లేకుండా పాలించిన ఘనత జగన్‌దే: నాగబాబు

మూడేళ్లు రాజధాని లేకుండా పాలించిన ఘనత జగన్‌దే: నాగబాబు
జనసేన నేత నాగబాబు మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మూడేళ్లపాటు రాజధాని లేకుండా పాలించిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా చేశారు. రాజధాని కోసం రైతులు, జనసేన అకుంఠిత దీక్షతో పోరాటం చేశారని నాగబాబు కొనియాడారు. చివరకు అమోఘమైన పోరాటానికి న్యాయస్థానంలో విజయం దక్కిందని అన్నారు. రాజధానిపై కోర్టు తీర్పులను సీఎం జగన్‌ శిరసావహించి, అమరావతిని రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

జగన్ పాలనలో అప్పులే మిగిలాయి..
జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ బాగలేరని అన్నారు నాగబాబు. ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు మినహా.. ఎవ్వరూ సంతోషంగా లేరని అన్నారు. వైకాపా క్యాడర్ తోపాటు మిగిలిన మంత్రులు కూడా ఏ మాత్రం బాగాలేరని అన్నారు. అధికారంలేని పదవులు ఇస్తే.. నాయకులు అల్లాడిపోతున్నారని చెప్పారు నాగబాబు. ఇక రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలుస్తోందన్న నాగబాబు.. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపైనా రూ.లక్షకు పైగా అప్పు ఉందన్నారు. ఈ అప్పులను తిరిగి మళ్లీ పన్నుల రూపంలో మనమే కట్టాలని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని నాగబాబు అన్నారు. నవరత్నాల లబ్ధిదారులు కూడా ఈ అప్పులు కట్టాల్సి ఉందనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. జగన్ పాలనతో రాష్ట్రంలో అందరూ అసంతృప్తిగా ఉన్నారని నాగబాబు.. మరోసారి వైకాపా అధికారంలోరి వస్తే.. కాందిశీకులుగా పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు చాలా మంది చూస్తున్నారని అన్నారు.

జనం వెన్నెముక పవన్‌ కల్యాణ్‌..
కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని, ప్రజలను ఆదుకునేందుకే పవన్ కల్యాణ్ వచ్చారని నాగబాబు అన్నారు. జనం కోసం వచ్చిన వెన్నెముక పవన్‌ కల్యాణ్‌ అని అన్నారు. జనసేన గుండె పవన్‌ కల్యాణ్‌.. జనసైనికుడి చేతి జెండా పవన్‌ అని చెప్పారు. రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్తును దోచుకుంటున్నారని, అలాంటి వారిని ప్రజలే ఎన్నుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఎదిరించి.. ప్రజల కోసం పవన్‌ కల్యాణ్‌ వచ్చారు నాగబాబు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. తట్టుకుని నిలబడ్డామని చెప్పారు. ఇవాళ్టి సభ కోసం.. సభాస్థలి ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందిపెట్టిందని నాగబాబు ఆరోపించారు. అయినప్పటికీ భయపడకుండా సభ కోసం పొలాలు ఇచ్చిన రైతులకు నమస్కారాలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నిలబడదాం.. తలబడదాం.. గెలుద్దాం.. సాధిద్దాం అని జనసేన కార్యకర్తలకు సూచించారు నాగబాబు.

Last Updated :Mar 14, 2022, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.