ETV Bharat / state

నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్

author img

By

Published : Dec 12, 2022, 8:07 PM IST

Pawan
పవన్

Pawan Kalyan demand help for Farmers: తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎందుకు ధైర్యం చెప్పడం లేదని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై వరుసగా విరుచుకుపడే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

Pawan Kalyan demand help for Farmers: తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కోతకు వచ్చిన పంటలు, కళ్లాల్లో ఉంచిన ధాన్యం కళ్లెదుట వర్షాలకు నానిపోతుంటే రైతులు దైన్యంగా చూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రైతులను చూస్తుంటే తన గుండె భారంగా మారుతోందన్నారు.

ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి ప్రాంతాలలో లక్షలాది ఎకరాలలో వరి, పత్తి లాంటి వాణిజ్య పంటతో బొప్పాయి, అరటి వంటి ఉద్యాన పంటలు సైతం తుపాను ధాటికి దెబ్బతిన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎందుకు ధైర్యం చెప్పటం లేదని ప్రశ్నించారు. విపక్ష పార్టీల నేతలను తిట్టడానికి వరుసలో నాయకులను పంపుతూ,.. ఎలా తిట్టాలో స్క్రిప్టులు పంపే తాడేపల్లి పెద్దలు.. ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతులకు అండగా ఉండాలని ఎందుకు చెప్పటం లేదన్నారు. తుపాను దెబ్బతో నష్టపోయిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలన్నారు.

నష్టపరిహారాన్ని ప్రతి ఎకరాకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కళ్లంలోని తడిసిన ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేయాలని.. కూరగాయలు, పండ్లతోటల రైతులకు పరిహారం అందించాలని కోరారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు చేతనైనంతగా సహాయపడాలని జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రైతుల పక్షాన నిలబడి వారి దుస్థితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తద్వారా రైతులకు మానసిక ధైర్యం కల్పించాలన్నారు. ఒకవేళ సాయం అందకపోతే ప్రజాస్వామ్య రీతిలో ప్రశ్నించాలని సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.