ETV Bharat / state

No Police Jobs from 4 years: 'జగన్ సారూ పోలీసు ఉద్యోగాలు ఎక్కడ.. నాలుగేళ్లు అయిపోయింది'

author img

By

Published : Jul 9, 2023, 7:44 AM IST

No Police Jobs in AP from 4 years: అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఊదరగొట్టారు. అందుకోసం ప్రతి ఏటా జాబ్‌క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఢంకా బజాయించారు. సీఎం అయ్యాక పోలీసు శాఖలో ఏటా 6,500 పోస్టులు భర్తీ చేస్తున్నామంటూ నమ్మించారు. మొత్తంగా నాలుగేళ్లలో ఒక్క పోలీసు ఉద్యోగమూ భర్తీ చేయకుండా.. నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారు మన సీఎం జగన్‌ సారు. విలువలు, విశ్వసనీయత, మాటతప్పం, మడమతిప్పకపోవడం అంటే.. ఇదేనా అని నిరుద్యోగులు నిలదీస్తున్నారు.

Police Jobs
జగన్ సారూ పోలీసు ఉద్యోగాలు ఎక్కడ.. నాలుగేళ్లు అయిపోయింది

జగన్ సారూ పోలీసు ఉద్యోగాలు ఎక్కడ.. నాలుగేళ్లు అయిపోయింది

Police Jobs Notification in AP: ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన సీఎం జగన్‌.. అధికారం చేపట్టి నాలుగేళ్లు దాటుతున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ ఇవ్వలేదు. ఉద్యోగ ప్రకటన విడుదలై ఎనిమిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ దేహదారుఢ్య, శారీరక్ష సామర్థ్య పరీక్షలు నిర్వహించలేదు. కనీసం అవి ఎప్పుడు జరుపుతారో కూడా స్పష్టతివ్వడం లేదు. కనీసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ మేరకైనా ఉద్యోగాల భర్తీ సకాలంలో పూర్తి చేయకపోవటం ఏంటి? సీఎం గారూ.. పోలీసు ఉద్యోగాలు ఇంకెప్పుడు ఇస్తారు? దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణ షెడ్యూల్‌ ప్రకటించేందుకు మీకు ఇంకెన్నాళ్లు పడుతుంది? ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఇదేనా? ఇది నిరుద్యోగుల జీవితంతో చెలగాటం ఆడటం కాదా?

జాబ్‌ క్యాలెండర్‌లో 10వేల143 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం.. అందులో 450 పోలీసు పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. అదేంటి వేల ఖాళీలుంటే 450 పోస్టులు మాత్రమే భర్తీ ఏంటని.. ఆశావహులు కంగుతిన్నారు. పోనీ వాటికైనా నోటిఫికేషన్‌ ఇచ్చారా అంటే.. అదీ లేదు. ఆ తర్వాత తీరిగ్గా 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నవంబరు 28న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. అర్హత సాధించిన వారికి రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. 4 నెలలుగా పట్టించుకున్న పాపాన పోలేదు.

కొత్త షెడ్యూల్‌ మాటే లేదు.. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ పీఈటీ, పీఎంటీ పరీక్షలు నిర్వహిస్తామంటూ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త షెడ్యూల్‌ మాటే లేదు. ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించాల్సిన పీఎంటీ, పీఈటీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయలేదు.

ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఇదేనా?.. ఉద్యోగ ప్రకటన విడుదలై 8 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించకపోవడంపై.. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఎప్పుడు నిర్వహిస్తారో కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో.. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన 1.53 లక్షల మంది అభ్యర్థులకు నెలల తరబడి నిరీక్షణ తప్పట్లేదు. సీఎం జగన్ ఇచ్చిన హామీని ఎప్పటిలోగా నిలబెట్టుకుంటారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ ఎటూ ఇవ్వట్లేదు. కనీసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ మేరకైనా ఉద్యోగాల భర్తీ సకాలంలో పూర్తి చేయకపోవటం ఏంటని.. నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఏటా 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయటం అంటే ఇదేనా? అని.. సీఎం సారుని నిలదీస్తున్నారు.

తెలుగుదేశం హయాంలో శరవేగంగా.. నాలుగేళ్లలో ఏటా 6వేల500 చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2020 అక్టోబరులో జగన్‌ చెప్పారు. ఆ లెక్కన చూసినా ఇప్పటికే 19,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ కావాలి. కానీ ఆ జాడే లేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం 2018 నవంబరు, డిసెంబరు నెలల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్ష అన్ని కేవలం.. 2019 ఫిబ్రవరి నాటికే పూర్తి చేశారు. తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో తుది ఫలితాల విడుదల ఆగిపోయింది.

అంతకుముందే సిద్ధంగా ఉన్న తుది ఫలితాలను 2019 మేలో అధికారం చేపట్టిన జగన్‌ ప్రభుత్వం జూన్‌లో విడుదల చేసింది. అలా చూసినా మొత్తం భర్తీ ప్రక్రియ ఏడు నెలల్లోనే పూర్తయిపోయింది. తెలుగుదేశం హయాంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంత శరవేగంగా జరగ్గా.. ఇప్పుడు వైసీపీ హయాంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్‌ విడుదలై 8 నెలలవుతున్నా ఇప్పటికీ కనీసం శారీరక ధారుడ్య పరీక్షల షెడ్యూల్‌ కూడా ప్రకటించని పరిస్థితి. మొత్తంగా వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో సొంతంగా ఒక్కటంటే ఒక్క పోలీసు ఉద్యోగమూ భర్తీ చేయకపోవడం విచారకరం

2020 అక్టోబరు 21.. నిరుద్యోగులపై జగన్‌ సారుకు ఎంత ప్రేమ ఉందనుకుంటారు. ఇదేం కాదండోయ్‌.. ఏటా 6వేల 500 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2020 అక్టోబర్‌ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా మరో హామీ ప్రకటించారు మన సీఎం జగన్‌.

2021 జూన్‌ 18.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామంటూ ఆర్భాటంగా 2021లో జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేశారు మన సీఎం సారు. ఇంకేముంది ఏటా జాబ్‌క్యాలెండర్‌ ఇస్తారు. ఇక పోలీసు శాఖలో ఉద్యోగాల విప్లవమే అనుకున్నారు నిరుద్యోగులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.