ETV Bharat / state

'భూముల పంపిణీ దేశంలోనే పెద్ద కుంభకోణం'

author img

By

Published : Jun 8, 2020, 4:43 PM IST

Updated : Jun 8, 2020, 7:51 PM IST

వైకాపా ఏడాది పాలనపై 'విధ్వంసానికి ఒక్క ఛాన్స్‌' పేరిట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఛార్జిషీట్‌ విడుదల చేశారు. వైకాపా ఏడాది పాలనలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. పేద ప్రజలకు భూముల పంపిణీ దేశంలోనే పెద్ద కుంభకోణమని అన్నారు.

Nara Lokesh released a charge sheet on ycp one year rule
Nara Lokesh released a charge sheet on ycp one year rule

వైకాపా ప్రభుత్వం స్కామ్​ల కోసమే పథకాలు తీసుకొస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. వైకాపా ఏడాది పాలనపై 'విధ్వంసానికి ఒక్క ఛాన్స్‌' పేరిట ఆయన ఛార్జిషీట్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడాది అయ్యిందని దుయ్యబట్టారు.

'వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 564 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు పెద్దపీట వేస్తామని చెప్పిన ప్రభుత్వం... కనీసం విత్తనాలు కూడా ఇవ్వలేదు. పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. రూ.250 మాత్రమే పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇస్తామన్నారు.. ఇప్పుడు వాటి ఊసేలేదు. వాటి గురించి అడిగితే జైలుకు పంపే పరిస్థితి వచ్చింది. మద్య నిషేధం అమలుపై గొప్పలు చెప్పారు. ఇప్పుడు జే ట్యాక్స్‌ పేరిట ప్రజలను దోచుకుంటున్నారు. అమ్మ ఒడి పథకం అర్ధఒడిగా మారింది. 83 లక్షల మంది విద్యార్థులకు బదులు 43 లక్షల మందికే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కాపు కార్పొరేషన్‌ నిధులు మళ్లించారు'

- నారా లోకేశ్, తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

'వైకాపా నేతలే ఇసుకను బొక్కేస్తూ... దొరకట్లేదని చెబుతున్నారు. మరోవైపు విద్యుత్‌ తీగ పట్టుకుంటే కాదు.. బిల్లు ముట్టుకుంటే షాక్‌ కొడుతోంది. విద్యుత్‌ రంగంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతోంది. కరోనా టెస్టింగ్‌ కిట్లలో కుంభకోణానికి పాల్పడ్డారు. బ్లీచింగ్‌ పౌడర్‌ పేరుతో సున్నం పోసి రూ.70 కోట్లు కాజేశారు. పేద ప్రజలకు భూముల పంపిణీ దేశంలోనే పెద్ద కుంభకోణం. ఒక్క నియోజకవర్గంలో ఆవ భూముల్లో రూ.222 కోట్ల కుంభకోణం జరిగింది' అని లోకేశ్ విమర్శించారు.

ట్వీట్ పెడితే వైకాపా వణుకుతోంది

'జగన్ రెడ్డి మతం విధ్వంసం. జగన్ రెడ్డి కులం కక్షసాధింపు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన మొదలైంది. సొంత బాబాయి చనిపోతే సీబీఐ విచారణ జరిపించలేకపోయారు. జగన్ ఇంటి పేరు అసత్యం. సొంత పేరు అబద్ధం. మొన్నటి ఎన్నికల్లో అబద్దాలు చెప్పి జగన్ గెలిచారు. అమరావతే రాజధాని అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చాక మూడు ముక్కల రాజధాని అంటున్నారు. పోలవరం పనులు ఆపేశారు. మాపై అసత్య ఆరోపణలతో పుస్తకం వేసి నిరూపించలేకపోయిన వైకాపా నేతలు క్షమాపణలు చెప్పాలి. మాకొద్దు జగన్ అని ప్రజలు... పోవాలి జగన్ అని వైకాపా కార్యకర్తలు అంటున్నారు. వైకాపా నేతలు, కార్యకర్తలెవరైనా తెదేపా శ్రేణులపై దాడి చేస్తే ఊరుకోం. నేను ట్వీట్ పెడితే వైకాపా వణుకుతోంది. ఏపీలో కరోనా వ్యాప్తికి అధికార పార్టీ నేతలే కారణం. కొవిడ్ ఇడియట్స్ అని వైకాపా ఎమ్మెల్యేలకు జాతీయ మీడియా పేరు పెట్టింది' అని నారా లోకేశ్ అన్నారు.

ఇదీ చదవండి:

భూముల సర్వే వేగవంతం చేయండి: సీఎం జగన్

Last Updated : Jun 8, 2020, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.