సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకొచ్చేసరికి మర్చిపోయారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో పర్యటించిన ఆయన స్థానిక తెదేపా నేతలతో సమావేశమయ్యారు. ''ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 4 నెలలు కూడా పూర్తి కాక ముందే విమర్శించకూడదని అనుకున్నా... ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను చూసి తప్పనిసరై స్పందించాల్సి వస్తోంది'' అన్నారు. కరెంటు కోతలు, ఇసుక కొరతతో ప్రజలు అల్లాడుతున్నా.. నవరత్నాలంటూ నవ్వులు చిందించడం జగన్కే చెల్లిందన్నారు.
900 పైగా హామీలిచ్చి 9 హామీలైన నవరత్నాలనే అమలు పరుస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. వీటిల్లో నెలకో రత్నం రాలిపోతోందని.. రూపాయి బియ్యానికి 9 రూపాయల సంచిలో ఇవ్వడం ఒక్క జగన్కే సాధ్యమని ఎద్దేవా చేశారు. పోలవరం రివర్స్ టెండర్ పేరిట వందల కోట్లు మిగిల్చామని ప్రకటించుకోవడం వెనుక ప్రమాదకరమైన చర్యలున్నాయని అనుమానించారు. రాజధాని ప్రాంతంలో తనకు 500 ఎకరాలుందని ఆరోపించిన వైకాపా నేతలు, ఇప్పటి వరకూ ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు.
మంగళగిరి ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎప్పుడూ కనిపించరని లోకేశ్ విమర్శించారు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే మాత్రం ఎప్పుడూ కరకట్టపైనే తిరుగుతుంటారని ఆక్షేపించారు. చంద్రబాబు ఇంటికి కాపలా ఉండేందుకు ఆయన ఎమ్మెల్యే అయ్యారా అనే అనుమానం కలుగుతోందన్నారు.
ఇదీ చదవండి: