ETV Bharat / state

వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే.. నాలాంటి తీవ్రవాదిని చూడరు: పవన్‌

author img

By

Published : Jan 26, 2023, 1:49 PM IST

Updated : Jan 26, 2023, 2:25 PM IST

PAWAN SPEECH AT REPUBLIC DAY: రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

PAWAN SPEECH AT REPUBLIC DAY
PAWAN SPEECH AT REPUBLIC DAY

PAWAN SPEECH AT REPUBLIC DAY : ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతమని.. వైఎస్సార్సీపీనో.. సజ్జల సొంతమో కాదని గుర్తుంచుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పవన్​ ప్రసంగించారు.

వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే.. నాలాంటి తీవ్రవాదిని చూడరు: పవన్‌

నా లాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు: ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్‌ నిప్పులు చెరిగారు. రిపబ్లిక్‌ డే రోజున చెప్తున్నా.. ఏపీకి చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని మండిపడ్డారు. విసిగిపోయాం.. మీ బతుకులకేం తెలుసు? కానిస్టిట్యూషన్‌ అసెంబ్లీ డిబేట్స్‌ చదివారా? అవినీతిలో మునిగిపోయిన.. పబ్లిక్‌ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా? అని నిలదీశారు.

సన్నాసులతో విసిగిపోయాం: మేం దేశ భక్తులం.. ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? సన్నాసులతో విసిగిపోయాం. ఎంతమంది సీఎంలు రాయలసీమ నుంచి వచ్చారు? ఆ ప్రాంతానికేం చేశారు? అక్కడ నుంచి వలసలు ఎందుకు ఆపలేకపోయారని తీవ్రంగా మండిపడ్డారు.

"వేర్పాటువాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు. విసిగిపోయాం.. మీ బతుకులకేం తెలుసు? కానిస్టిట్యూషన్‌ అసెంబ్లీ డిబేట్స్‌ చదివారా? అవినీతిలో మునిగిపోయిన మీరు.. పబ్లిక్‌ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? మేం చూస్తూ కూర్చొంటామా? మేం దేశ భక్తులం.. ఆంధ్రప్రదేశ్‌ను ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉందా? సన్నాసులతో విసిగిపోయాం"-పవన్​, జనసేన అధినేత

మీ స్వార్థం కోసం స్టేట్​మెంట్లు ఇవ్వొద్దు: ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా? వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సాయిరెడ్డి చనిపోయారని.. గుంటూరులో హబీబుల్లా మస్తాన్‌ మరణించారు. ఆ సంగతి మీకు తెలుసా? అని నిలదీశారు. మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని.. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపేయండి అని పవన్‌ వ్యాఖ్యానించారు.

బాధ్యతగా మెలగకపోతే మెడలు వంచుతాం: వైఎస్సార్సీపీ నేతలు బాధ్యతగా మెలగాలని.. లేకుంటే మెడలు వంచుతామని హెచ్చరించారు. వైసీపీలా కులాల మధ్య తగవులు పెట్టేందుకు రాలేదని స్పష్టం చేశారు. కులాలపై ప్రేమ ఉన్నంతవరకు, ఆధిపత్య ధోరణి ఉన్నంతవరకు రాష్ట్రంలో అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. రాజకీయ స్థిరత్వం ఉంటేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని.. కొందరు వైసీపీ నేతలు వేర్పాటువాద ధోరణితో ఉన్నారని విమర్శించారు.

కులాల మధ్య ఐక్యత కోసం పనిచేస్తా: బ్రిటిష్‌ వారు పోయినా వాళ్ల అహంకార ధోరణి ఇంకా పోలేదని పవన్‌ విమర్శించారు. అవగాహన లేకుండా తాను దేనిపైనా మాట్లాడనని.. యూనివర్సిటీల్లో చదవకపోయినా నోటికి వచ్చినట్లు మాట్లాడనని తెలిపారు. కులాల మధ్య ఐక్యత కోసం పనిచేస్తానని పవన్‌ స్పష్టం చేశారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్కడ? అని ప్రశ్నించిన పవన్​.. అభివృద్ధిలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దుర్వినియోగం చేసినవాళ్లా మాకు చెప్పేదని నిలదీసిన పవన్​.. తాము అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమంగా ఖర్చు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని పవన్‌ తెలిపారు.

హిందూ దేవతలను కించపరిస్తే సహించేది లేదు: సెక్యూలరిజం ముసుగులో హిందూ దేవతలను కించపరిస్తే సహించేది లేదని జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. అన్ని మతాలు సమానంగా చూసే దృక్పథం ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. ఒక మతం వారిని పదే పదే అవమానపరిస్తే.. వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు.

"సెక్యూలరిజం ముసుగులో హిందూ దేవతలను కించపరిస్తే సహించేది లేదు. అన్ని మతాలను సమానంగా చూడడం ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. పదే పదే ఒకరిని అవమానపరిస్తే మనోభావాలు దెబ్బతింటున్నాయి. మహమ్మద్​ ప్రవక్తను, జీసస్​ను కించపరచడానికి మీకు భయం ఉన్నప్పుడు.. హిందూ దేవతలను కించపరచడానికి మాత్రం ఎందుకు భయం లేదు"-పవన్​, జనసేన అధినేత

వారాహి యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం: జనసేన యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. వారాహి వాహనంపై వివాదం సృష్టించాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 26, 2023, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.