ETV Bharat / state

High Court Stay on R5 Zone: పట్టాలు ఇవ్వొచ్చని చెబితే.. ఇళ్లు కట్టేయమనా?.. ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

author img

By

Published : Aug 4, 2023, 10:24 AM IST

High Court Stay on Housing in R5 Zone
High Court Stay on Housing in R5 Zone

High Court Stay on Housing in R5 Zone: రాజధాని అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై ఎక్కడలేని దూకుడు ప్రదర్శిస్తున్న జగన్‌ ప్రభుత్వానికి.. హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ మార్చి ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, బయటి ప్రాంతాలకు చెందిన వారికి అక్కడ ఇళ్ల స్థలాలివ్వడం.. ఇళ్ల నిర్మాణాలు చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగానే.. ప్రభుత్వం అక్కడ ఇళ్లు నిర్మించడం విస్తృత ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని.. జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌. సోమయాజులు, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

High Court Stay on Housing in R5 Zone: రాజధాని అమరావతి ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై.. జగన్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే ఇచ్చింది. నీరుకొండ, కురగల్లు రైతుల సంక్షేమ సంఘం కార్యదర్శి జూరగంటి శ్రీధర్‌బాబు, మరో 11 మంది దాఖలు చేసిన కేసులో.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రాజధానిలో బయటి ప్రాంతాల వారికి ఇచ్చిన ఇళ్లపట్టాలపై.. కోర్టు తుది తీర్పునకు లోబడే లబ్ధిదారులకు హక్కు దఖలు పడుతుందని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఇంటి స్థలంపై హక్కు విషయంలోనే సుప్రీం కోర్టు అంత స్పష్టంగా చెప్పినప్పుడు, అక్కడ ఇళ్లు కట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడాన్ని తప్పుబట్టింది.

ఈ వ్యవహారంలో న్యాయపరంగా, తీవ్రంగా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, వాటిపై స్పష్టత రావాలంటే పూర్తిస్థాయిలో విచారణ జరగాలని పేర్కొంది. భూమి నిమిత్తం సీఆర్‌డీఏకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం, ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించిన మొత్తం కలిపి.. సుమారు 2వేల కోట్లు ప్రభుత్వం అక్కడ ఖర్చు చేయనుందని, అదంతా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మని, రేపు కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే.. అదంతా నష్టపోవాల్సిందేనని కోర్టు పేర్కొంది. ప్రజల సొమ్మును ప్రభుత్వం తన ఇష్టానికి వృథా చేస్తుంటే.. కోర్టు ప్రేక్షకపాత్ర వహించబోదని స్పష్టం చేసింది. కోర్టుల నుంచి తుది తీర్పు వెలువడేంత వరకు ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై యథాతథ స్థితిని కొనసాగించడమే సరైందని స్పష్టం చేసింది.

పేదలకు పంచిన ఇళ్ల స్థలాలపై తదుపరి చర్య కోర్టు తీర్పులకు లోబడే ఉంటుందని పట్టాపై ప్రభుత్వమే రాసింది కదా?.. అలాంటప్పుడు అక్కడ ఇళ్లు ఎలా నిర్మిస్తారని.. ధర్మాసనం ప్రశ్నించింది. అది రాసిన వ్యక్తి చేసిన పొరపాటు అని, దాన్ని పరిగణనలోకి తీసుకోరాదని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఏఏజీ ప్రభుత్వ చర్యను సమర్థించుకోవాలని చూస్తున్నారని, దానితో తాము ఏకీభవించబోమని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాతే.. అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లిందని పేర్కొంది. రాజధానిలో బయటి ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల నిర్మాణం.. అమరావతిపై హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు అమలులో భాగమేనని ఏఏజీ చెప్పడంపై ధర్మాసనం చురకలు వేసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి హైకోర్టు విస్తృత ధర్మాసనం చెప్పిన అన్ని కార్యక్రమాల్నీ వదిలేసి.. కేవలం ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం చేపట్టడమే కోర్టు ఆదేశాల్ని పాటించడం అంటారా? అని వ్యాఖ్యానించింది.

అమరావతి అంశం రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల జీవించే హక్కు, జీవనోపాధితో ముడిపడినదిగా హైకోర్టు విస్తృత ధర్మాసనం తన తీర్పులో పేర్కొందని.. ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆ కోణంలో చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్థిక కష్టాలున్నాయనో, మరో కారణమో చెప్పి రాజధానిలో నిర్మాణాల్ని సగంలో వదిలేయడం కుదరదనీ విస్తృత ధర్మాసనం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అమరావతి అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తామని హైకోర్టు విస్తృత ధర్మాసనం పేర్కొందని, దాన్ని చట్టం ద్వారా తొలగించలేరని కోర్టు స్పష్టం చేసింది.

సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ఎఫర్డబుల్‌ హౌసింగ్‌ అంటే.. రాజధాని నిర్మాణానికి భూములు కోల్పోయినవారికి, భూ సమీకరణ పథకం పరిధిలోని ఇతరులకు మాత్రమే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇతర జిల్లాలకు చెందినవారికి కూడా అక్కడ స్థలాలిచ్చి, ఇళ్లు కట్టించే అధికారం ప్రభుత్వానికి ఉందా? అన్నది చర్చనీయాంశమని తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి ఆవాసం కేటాయించాలని, రాజధాని అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోతున్నవారికి ప్రభుత్వం ఇంటి సదుపాయం కల్పించాలని చట్టం చెబుతోందని.. కోర్టు ప్రాథమిక అభిప్రాయం ప్రకారం.. దానిలోని క్లాజ్‌లు, నిబంధనలు ఎల్‌పీఎస్‌లో భూములిచ్చినవారికి, ఎల్‌పీఎస్‌ పరిధిలో నివసిస్తున్న ఇతరులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పింది. ఆ చట్టాన్ని సవరించిన ప్రస్తుత ప్రభుత్వం.. ఎఫర్డబుల్‌ హౌసింగ్‌ అంటే ఇళ్ల పట్టాలు ఇవ్వడం కూడానని, రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా ఇళ్ల పట్టాలు ఇవ్వవచ్చునని నిబంధన మార్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసు కోర్టులో ఉంది. ప్రభుత్వం చేసిన ఈ సవరణలు.. రాజధానికి భూములిచ్చిన రైతుల హక్కులపై హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు కోణంలోనూ పరిశీలించాలని కోర్టు పేర్కొంది.

లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా.. తుది తీర్పునకు లోబడే వాటిపై వారికి హక్కులు దఖలు పడతాయన్న విషయాన్ని పట్టాపైనే స్పష్టంగా పేర్కొనాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇళ్ల నిర్మాణం కూడా తుది తీర్పునకు లోబడే ఉండాలని దానర్థం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా ఇళ్ల నిర్మాణం గురించి విపులంగా చర్చించలేదు. ఇళ్ల నిర్మాణానికయ్యే ఖర్చు, కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే అయ్యే వృథా గురించిన ప్రస్తావనా లేదని హైకోర్టు పేర్కొంది. రాజధాని ప్రాంతంలో వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన మౌలిక వసతుల్ని నిరుపయోగంగా వదిలేయడంపై హైకోర్టు విస్తృత ధర్మాసనం కూడా అప్పట్లో రాజధానిపై తన తీర్పులో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. చేసే ప్రతి పైసా ఖర్చుకూ ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది.

రాజధానిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేయడం, అందులో బయటి ప్రాంతాలకు చెందినవారికి ఇళ్ల స్థలాలు కేటాయించడంపై కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల హక్కులకు భంగం కలగడం, అమరావతి మాస్టర్‌ప్లాన్‌ను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులపై దాఖలైన కేసులూ పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టు విస్తృత ధర్మాసనం తన తీర్పులో రైతుల హక్కుల గురించి చర్చించి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం వల్ల రాజధాని రైతుల హక్కులకు భంగం వాటిల్లుతుందా? అన్నది అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన ఎస్‌ఎల్‌పీలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.