ETV Bharat / state

సీఎం జగన్ సహా మొత్తం 41 మందికి హైకోర్టు నోటీసులు - తనకు, తన బంధుగణానికి లబ్దిచేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న పిటీషనర్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 7:26 AM IST

Updated : Nov 24, 2023, 7:50 AM IST

High Court Notices to 41 People Including CM Jagan: జగన్‌కు, ఆయన బంధుగణానికి వేల కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఎంపీ రఘురామ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో.. హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా వివిధ శాఖల కార్యదర్శులకు, కంపెనీల డైరెక్టర్లకు మొత్తం 41 మందికి తాఖీదులు జారీ అయ్యాయి.

high_court_notices_to_ycp_leaders
high_court_notices_to_ycp_leaders

High Court Notices to 41 People Including CM Jagan: సీఎం జగన్, మంత్రులు, ఆయన సన్నిహితులకు.. లబ్ది చేకూరేలా జరిగిన అక్రమాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి.. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని.. రఘురామ హైకోర్టులో పిల్ వేశారు. ప్రభుత్వ ఖజనాకు జరిగిన నష్టాన్ని తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు. జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ కిరణ్మయిల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. సీఎం జగన్‌తో పాటు సమాచార పౌర సంబంధాల ముఖ్యకార్యదర్శి పక్షపాత ధోరణితో ప్రభుత్వ సంబంధ వార్తలు, ప్రకటనలను ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్‌కు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం కల్పించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

  • భారతి, దాల్మియా, పెన్నా, మరో అయిదు కంపెనీలకు సింహభాగం సిమెంట్‌ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్, గనులశాఖ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు అక్రమ నిర్ణయాలు తీసుకున్నారని రఘురామ ఆరోపించారు.
  • 104, 108 అంబులెన్సుల నిర్వహణను అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు అప్పగించడంలో జగన్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అవినీతికి పాల్పడ్డారని పిటిషన్‌లో తెలిపారు.
  • ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు, కాకినాడ సీ పోర్టులను అరబిందో రియాల్టీ సంస్థకు అప్పగించే విషయంలో ముఖ్యమంత్రి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక సీఎస్‌ అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
  • జగన్, గనుల శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు అవినీతికి పాల్పడి ఇసుక తవ్వకాలను చెన్నైకి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించారని ఆరోపించారు.

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో ఎంపీ రఘురామ పిటిషన్ - ఈ నెల 24న విచారణ చేపడతామన్న ధర్మాసనం

పేదలకు ఒక సెంటు స్థలం ముసుగులో ప్రైవేటు సంప్రదింపుల ద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల భూములతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. కొన్ని కంపెనీలకే ఎక్కువ భాగం మద్యం కొనుగోలు ఆర్డర్లను అప్పగించే విషయంలోనూ జగన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ కమిషనర్, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్‌లో అభియోగాలు మోపారు. జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ కేంద్ర హోంశాఖ మౌనం వహిస్తోందని ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేసేలా సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించాలని పిటిషన్‌ ద్వారా కోరారు.

రాజకీయ వైరంతో పిటిషన్‌.. హైకోర్టులో ఈ పిటిషన్​పై విచారణ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ పిల్‌ విచారణ అర్హతపై అభ్యంతరం లేవనెత్తారు. రిట్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఉందని.. పూర్తి వివరాలను ప్రస్తావించలేదన్నారు. పిటిషనర్‌ను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ విప్‌ స్పీకర్‌కు లేఖ రాశారని ఆ విషయాన్ని పిల్‌ డిక్లరేషన్‌లో పేర్కొనలేదని తెలిపారు. పిటిషనర్‌ డైరెక్టర్‌గా ఉన్న ఓ కంపెనీ 700 కోట్లు చెల్లించడంలో విఫలమైందని.. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయాన్ని పిల్‌లో పేర్కొనలేదని ఏజీ శ్రీరామ్‌ వాదించారు. పిల్‌ దాఖలు తర్వాత ముఖ్యమంత్రిని వదలనని.. మీడియా ముందు ప్రకటన చేశారన్నారు. దురుద్దేశంతో, రాజకీయ వైరంతోనే ఈ పిటిషన్‌ వేశారని ఆరోపించారు. ఎంపీ రఘురామ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ ఏజీ చెబుతున్న కారణాలు పిల్‌ దాఖలుకు అడ్డంకి కాదని తెలిపారు.

సీఎం జగన్ స్టే తెచ్చుకోకుండా సీబీఐ విచారణ ఎదుర్కోగలడా? : రఘురామ

ఈ దశలో స్పందించిన ధర్మాసనం పిల్‌ విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని ప్రతిపాదించింది. విచారణార్హత గురించి తేల్చాక లోతుల్లోకి వెళ్తామని పేర్కొంది. ఏజీ స్పందిస్తూ విచారణార్హతను తేల్చకముందే నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇలాంటి వ్యాజ్యంలో వాదనలు చెప్పుకొనేందుకు న్యాయస్థానం తమకు అవకాశం ఇవ్వలేదని వారు భావించే అవకాశం ఉందని పేర్కొంది. అందుకు వీల్లేకుండా నోటీసులు ఇవ్వడం ఉత్తమమని వ్యాఖ్యానిస్తూ సీఎం సహా 41 మందికి నోటీసులు జారీచేసింది.

నోటీసులు ఇచ్చింది వీరికే.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నుంచి లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగతి పబ్లికేషన్స్‌ డైరెక్టర్‌ వేమిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఇందిరా టెలివిజన్‌ డైరెక్టర్‌ కల్వ రాజప్రసాద్, భారతి సిమెంట్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ, సాగర్‌ సిమెంట్స్‌ డైరెక్టర్‌ ఒంటెద్దు రేఖ, ఇండియా సిమెంట్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాసన్, దాల్మియా సిమెంట్‌ డైరెక్టర్‌ భరత్‌ భూషణ్‌ మెహతా, పెన్నా సిమెంట్‌ డైరెక్టర్‌ పుత్తంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మైహోం ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ రామేశ్వర్‌రావు, శ్రీజయజ్యోతి సిమెంట్స్, భారతి పాలిమర్స్‌ ఇండియా, అరబిందో ఫార్మా ఫౌండేషన్, అరబిందో రియాల్టీ, జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్, రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్, గ్రేసన్‌ డిస్టిలరీస్, అదాన్‌ డిస్టిలరీస్, సన్‌రే బాట్లింగ్‌ అండ్‌ బెవరేజెస్, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌, బీ 9 బెవరేజెస్, సెంటినీ బయో ప్రొటెక్ట్స్, R.R.గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థల డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. అలాగే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు, గనులు, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు సహా వైద్య ఆరోగ్యశాఖ, మౌలిక, పెట్టుబడుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ కమిషనర్, గనుల శాఖ డైరెక్టర్లకు తాఖీదులు ఇచ్చింది.

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంలో రఘురామ పిటిషన్‌

రికార్డులు మాయం.. అయితే ఇసుక, మద్యం పాలసీ వ్యవహారాలపై రికార్డులను సీజ్‌ చేసేలా అధికారులను ఆదేశించాలని ఎంపీ రఘురామ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ధర్మాసనాన్ని కోరారు. పిల్‌ దాఖలు చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కోర్టులో రికార్డులను మాయం చేసిన ఘటన గతంలో చోటు చేసుకుందని గుర్తుచేశారు. అయితే ఈ దశలో రికార్డుల సీజ్‌కు ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. పిల్‌ విచారణ అర్హతతోపాటు అనుబంధ పిటిషన్లను తర్వాత పరిశీలిస్తామని తెలుపుతూ.. విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది.

సీఎం జగన్ సహా మొత్తం 41 మందికి హైకోర్టు నోటీసులు- తదుపరి విచారణ డిసెంబరు 14కు వాయిదా
Last Updated : Nov 24, 2023, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.