ETV Bharat / state

పొరుగు సేవల ఉద్యోగులపై వేటు మొదలుపెట్టిన ప్రభుత్వం..

author img

By

Published : Dec 5, 2022, 10:06 AM IST

OUTSOURCING EMPLOYEES TERMINATION
OUTSOURCING EMPLOYEES TERMINATION

OUTSOURCING EMPLOYEES TERMINATION : రాష్ట్రంలో పొరుగుసేవల ఉద్యోగులపై వేటు మొదలైంది. వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో 17 మంది తొలగింపుతో.. ప్రభుత్వం ప్రక్రియను మొదలుపెట్టింది. గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో 350 మందినీ ఇంటికి పంపేసిన ప్రభుత్వం.. సోమవారం నుంచి హాజరు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. దీంతో ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్లోనూ అలజడి, ఆందోళన మొదలయ్యాయి.

TERMONATION OF OUTSOURCEING EMPLOYESS : రాష్ట్రంలోని వివిధ శాఖల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల మెడపై ప్రభుత్వం కత్తిపెట్టింది. ఔట్ సోర్సింగ్‌ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం.. మొదటగా డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అండ్ అకౌంట్స్‌ విభాగం నుంచి పని మొదలుపెట్టింది. ఆ విభాగంలో పదేళ్ల లోపు సర్వీసు ఉన్న 17 మందిపై వేటు వేస్తూ డిసెంబర్ 1న మెమో ఇచ్చింది.

సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో పనిచేస్తున్న సుమారు 300 నుంచి 350 మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగిస్తూ ఆదివారం ఆదేశాలిచ్చింది. సోమవారం నుంచి వారి హాజరు తీసుకోవద్దని స్పష్టం చేసింది. పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు, స్వీపర్లు, వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుమారు...700 మందిలోనూ అలజడి మొదలైంది.

మున్ముందు మిగిలిన విభాగాల్లోనూ పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగులను వదులుకునేందుకు అడుగులు పడుతున్నాయని వాపోతున్నారు. వివిధ శాఖల్లో ఇప్పటికే మంజూరయిన పోస్టుల రద్దు, ఉద్యోగుల కుదింపుపై ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తున్న ప్రభుత్వం... తదనుగుణంగా పొరుగుసేవల ఉద్యోగుల తొలగింపు చేపట్టిందని పలువురు విమర్శిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 40 వేల మంది ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మందింని ప్రభుత్వం ఆప్కాస్‌ విభాగంలోకి తెచ్చింది. లక్షా 40 వేల మంది ఇంకా ఏజెన్సీలు, థర్డ్‌ పార్టీల ద్వారా సేవలందిస్తున్నారు. మొత్తంగా పదేళ్లలోపు సర్వీసు ఉన్న వారు 60 వేల వరకు ఉంటారని అంచనా. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరి భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. ఆప్కాస్‌లో చేర్చినవారిలోనే ప్రస్తుతం 17 మందిపై వేటు పడటం వీరిని మరింత కలవరపెడుతోంది.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసిన వైసీపీ ప్రభుత్వం.. లక్షా 31 వేలకుపైగా ఉద్యోగుల్ని, 2.52 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని రద్దుచేసి.. శాఖలను పునఃవ్యవస్థీకరిస్తోందని.. ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కొంతకాలంగా దీనిపై కసరత్తు జరుగుతోంది. విభాగాల వారీగా చూస్తే.. రాష్ట్రస్థాయిలో అసిస్టెంట్ సెక్షన్‌ ఆఫీసర్లు, జిల్లాలో సీనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు వంటి పోస్టుల్లో ఖాళీలున్నాయి.

కిందిస్థాయిలో అటెండర్లు, జమేదారు, దఫేదారు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సిన అవసరం లేదని... రద్దు చేయొచ్చనేది ప్రభుత్వ భావనగా ఉంది. అందుకే కొత్త నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఏదైనా ఒక పోస్టును భర్తీ చేయాలంటే.. అందుకు ప్రభుత్వం నుంచి మంజూరు తప్పనిసరి. అలా ఖాళీగా ఉంటేనే అందులో శాశ్వత నియామకాలు చేపట్టడమో, లేదంటే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులతో భర్తీ చేయడమో సాధ్యం.

ఇలా మంజూరైన జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల్లోనే కొన్నాళ్లుగా ఒప్పంద, పొరుగు సేవల కింద డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. శాశ్వత నియామకాలు లేకుండా ఖాళీగా ఉన్న ఈ పోస్టుల్ని రద్దు చేయాలంటే ముందుగా అక్కడ పనిచేస్తున్న వారిపై వేటు తప్పనిసరి. ఈ క్రమంలోనే తొలి వేటు వర్క్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలోని 17 మందిపై పడిందని సమాచారం.

సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గతంలో 1:80 విధానంలో వంటవారు, సహాయకులు, కమాటీలను నియమించేవారు. ఇప్పుడు 1:120 నిష్పత్తికి మార్చారు. దీంతో రాష్టవ్యాప్తంగా 300 నుంచి 350 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని అంచనా. అలాగే పంచాయతీరాజ్‌ పరిధిలో ఉపాధిహామీ పథకం కింద ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు, స్వీపర్లు, వాచ్‌మెన్‌గా పలువురిని నియమించారు. వీరంతా ఆప్కాస్‌లో ఉన్నారు. N.R.E.G.S. కింద చేపట్టే నిర్మాణాలకు మంజూరైన నిధుల్లోంచి 3 శాతం చొప్పున అడ్మినిస్ట్రేటివ్‌ ఛార్జీలుగా వసూలు చేస్తారు. అందులో నుంచే వీరికి జీతాలు చెల్లిస్తున్నారు. పదేళ్లలోపు వారిని తొలగిస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది.

గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయికి సేవలను చేరువ చేశామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు అదే తరహా సేవలందించే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల అవసరమేంటన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అభిప్రాయం మేరకు వారిపై వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో అధిక శాతం గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే.

2009-2014 మధ్య కూడా కొందరిని తీసుకున్నారు. పదేళ్లకు మించి పనిచేస్తున్న వారికి ప్రస్తుతానికి ఉపశమనం లభించినా.. భవిష్యత్తులో వారికీ ఉద్వాసన తప్పదని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. అధికారంలోకి వస్తే ఒక్క ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగినీ తొలగించబోమని హామీ ఇచ్చిన జగన్‌.. అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

న్యాయస్థానాల ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని.. ప్రభుత్వం తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే.. లక్షలాది మంది ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు.

పొరుగు సేవల ఉద్యోగులపై ప్రభుత్వం వేటు
ఇవీ చదవండి:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.