తెలుగు భాషాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గుర్రం జాషువా (Gurram Jashua) 126 జయంతి పురస్కరించుకుని గుంటూరు నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.
సమాజంలోని అసమానతలు, రుగ్మతలు తొలగించడానికి జాషువా అనేక రచనలు చేశారన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆంగ్ల మాధ్యమాన్ని(English Medium) ప్రవేశపెడుతూ కూడా.. తెలుగు(Telugu)ను తప్పనిసరి చేశామన్నారు. దళిత, బడుగు,బలహీన వర్గాలకు విద్య అందుబాటులో ఉండాలన్నారు. గత ప్రభుత్వాలు విద్యను ప్రైవేటుపరం చేసి బడుగులకు విద్యను దూరం చేశాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను(Government Schools) నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు... బడుగు, బలహీన విద్యార్థులు కేటాయించాలని.. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే వసూలు చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. నూతన మంత్రివర్గం (New Cabinet) విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉన్నామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.
జాషువా సిద్దాంతాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని.. తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు జాషువా అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ కొనియాడారు. జాషువా పేరు మీద కళా ప్రాంగణం నిర్మాణం జరుగుతోందన్నారు. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్నారు. ఆయన నివసించిన ఇంటిని గ్రంథాలయంగా మార్చాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు డొక్కా మణిక్యవరప్రసాద్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : KOPPARU INCIDENT: కొప్పర్రు ఘటన..25 మంది అరెస్ట్