రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో పరిస్థితి బీభత్సంగా మారింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో.. పలు మార్గాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పక్క రాష్ట్రమైన తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు ప్రకటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో.. రెండు, మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు..
రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1576 డెంగీ కేసులు నమోదయ్యాయన్న మంత్రి... ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై గుంటూరు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున దోమలు వ్యాప్తి చెందుతున్నాయని... ఇవే డెంగీ, మలేరియా కేసులకు కారణమవుతున్నాయని చెప్పారు.
డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని అధికారులను మంత్రి నాని ఆదేశించారు. మూడో విడత కరోనా వ్యాప్తిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని... ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: