ETV Bharat / state

మనం తాగే నీటికి ఓ లెక్క ఉంది!

author img

By

Published : May 18, 2021, 9:17 PM IST

పీహెచ్‌ స్థాయిని కొలిచే పరికరం
పీహెచ్‌ స్థాయిని కొలిచే పరికరం

మనం తాగే నీటికి ఓ లెక్క ఉంది. ఆ నీటిలో ఉండాల్సిన మినరల్స్​ స్థాయి గురించి ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం వివరించింది. ప్రతి నెలా నీటిపారుదల శాఖ సిబ్బంది గ్రామాలకు వెళ్లి రక్షిత నీటి పథకాలు, చెరువులు, బావులు, బోర్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షా కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగానికి చెందిన వాటర్‌ సాఫ్ట్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా వీటి పంపిణీ చేపట్టలేదు. గ్రామాల్లో అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయిస్తూ చర్యలు తీసుకోవాల్సి ఉందని పలువురు అంటున్నారు.

గుంటూరు జిల్లా బాపట్ల గ్రామీణ నీటి సరఫరా విభాగానికి గుంటూరు, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, మాచర్ల, పిడుగురాళ్ల, వినుకొండ, పెదనందిపాడు, సత్తెనపల్లిలో నీటి పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ప్రతి నీటి కేంద్రం పరిధిలో ఐదు నుంచి ఏడు మండలాలు ఉన్నాయి. ప్రతి నెలా సిబ్బంది గ్రామాలకు వెళ్లి రక్షిత నీటి పథకాలు, చెరువులు, బావులు, బోర్ల నుంచి 350 నమూనాలు సేకరించి పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి ఫలితాలను ఆన్‌లైన్‌లో ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగానికి చెందిన వాటర్‌ సాఫ్ట్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. పురపాలక సంఘాల్లో ప్రజారోగ్య విభాగానికి చెందిన సిబ్బంది రక్షిత నీటి పథకాల నుంచి నీటి నమూనాలు సేకరించి గుంటూరులో ప్రయోగశాలకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజలు సైతం గ్రామీణ నీటి సరఫరా విభాగం నీటి పరీక్ష కేంద్రాలకు నీటి నమూనాలను తీసుకెళ్లి ఇస్తే 24 గంటల్లో పరీక్ష నిర్వహించి ఏ రసాయనం ఎంత మోతాదులో ఉంది.. బ్యాక్టీరియా స్థాయి వివరాలను తెలియజేస్తారు. గ్రామపంచాయతీ స్థాయిలో నీటి పరీక్షలు నిర్వహించటానికి ఎఫ్‌టీకే కిట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయాలకు వచ్చాయి. కరోనా వ్యాప్తి కారణంగా వీటి పంపిణీ చేపట్టలేదు. త్వరలో పంచాయతీ సిబ్బందికి కిట్ల ద్వారా నీటి పరీక్షలు చేసే విధానంపై గ్రామీణ నీటి సరఫరా అధికారులు శిక్షణ ఇచ్చి పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయిస్తూ చర్యలు తీసుకోవాల్సి ఉంది.


కలుషిత నీటితో అనర్థాలెన్నో..

  • నీటి కలుషితం వలన చర్మ వ్యాధులు, విషజ్వరాలు, కుష్ఠు, కాలేయ వ్యాధులు, మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ జ్వరం, పసికర్లు, కొన్ని రకాల క్యాన్సర్లు, నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి.
  • నీటిలో ఈకోలి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే విరేచనాలు, వికారం, వాంతులు, రక్తస్రావం, కడుపు తిమ్మిరి, నొప్పి వంటి ఆరోగ్య సమస్యలను కలగజేస్తాయి.
  • వేసవిలో ప్రజలు కలుషిత నీటిని తాగి డయేరియా(అతిసారం) బారినపడుతున్నారు. సకాలంలో వైద్య చికిత్స చేయించుకోకుంటే ఇది చివరికి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది.
  • నీటిలో టీడీఎస్‌ ఎక్కువగా ఉంటే రుచి బాగోదు. గ్యాస్ట్రిక్, చికాకు తదితర ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేసవిలో బోరు నీటిలో టీడీఎస్‌ స్థాయి పెరుగుతుంది. పీˆహెచ్‌ విలువ ఎక్కువగా ఉంటే శ్లేష్మ పొర సమస్య వస్తుంది. నీరు చేదు, వగరగా ఉంటుంది.
  • అర్సెనిక్, మెర్కూరీ, కాడ్మియం, లెడ్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటే కేంద్ర నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. గుండె, నరాల సంబంధ తీవ్రమైన వ్యాధులు వస్తాయి.

వేసవిలో చెరువుల్లో నీరు అడుగంటడంతో బాక్టిరియా బాగా పెరిగే అవకాశం ఉంది. లభ్యత తగ్గడంతో నీరు బురదగా మారి శుద్ధి చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఈనేపథ్యంలో ఏమాత్రం అలక్ష్యం వహించినా కలుషిత నీరు సరఫరాతో ప్రజలకు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పట్టణాలు, గ్రామాల్లో రక్షిత నీటి పథకాల పైప్‌లైన్లు లీకై నీరు కలుషితమవుతుంది. 71 శాతం ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందడం లేదని సర్వేలు చెబుతున్నాయి. కొందరు ప్రైవేటు వ్యాపారులు విక్రయిస్తున్న శుద్ధజలం సైతం నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం లేదు. కలుషిత నీరు పదుల సంఖ్యలో ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతోంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం, ప్రజారోగ్యశాఖ అధికారులు నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే స్థానిక అధికారులు పరీక్షలు సక్రమంగా చేయించాల్సిన అవసరం ఎంతో ఉంది.

వేసవిలో క్లోరినేషన్‌ తప్పనిసరి
రక్షిత నీటి పథకాల కుళాయిలు, చెరువులు, బోర్ల నుంచి నీటి నమూనాలు సేకరించి 12 రక్షాల పరీక్షలు చేస్తున్నాం. ప్రజలు సైతం సమీపంలోని ప్రయోగశాలకు నీటి నమూనా తీసుకు వచ్చి పరీక్ష చేయించుకోవచ్చు. నీరు కలుషితం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి ఏమైనా తేడా ఉంటే వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రజారోగ్యం దెబ్బతినకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. వేసవి నేపథ్యంలో కుళాయిల ద్వారా ప్రజలకు సరఫరా చేసే నీటిని ప్రతి రోజూ తప్పనిసరిగా క్లోరినేషన్‌ చేయాలని ఆదేశించాం. - చంద్రశేఖర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ

ఇదీ చదవండి.. రాష్ట్రంలో కర్ఫ్యూతో ప్రభావమెంత? పాజిటివిటీ రేటు కాస్తైనా తగ్గిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.