అమ్మో! ప్రభుత్వ కాంట్రాక్టా.. రాష్ట్రంలో చితికిపోయిన చిన్న కాంట్రాక్టర్లు..!

author img

By

Published : Jan 31, 2023, 8:29 AM IST

Updated : Jan 31, 2023, 12:32 PM IST

Etv Bharat

CONTRACTORS STRUGGLE : రాష్ట్రంలో నిర్మాణరంగం పూర్తిగా పడకేసింది. ప్రభుత్వ పనులకు బిల్లులు రాక గుత్తేదారులు ఆస్తులు అమ్ముకుంటున్నారు. అమ్మో ప్రభుత్వ కాంట్రాక్టు పనులా..! అనేలా పరిస్థితి వచ్చింది. కనీసం బిల్లులు సమర్పించేందుకు సరైన వ్యవస్థ లేదని ఎన్ని బిల్లులు పెండింగ్‌ ఉన్నాయో కూడా ప్రభుత్వం చెప్పలేని స్థితిలో ఉందని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుంటే అప్పులు కట్టలేక ఆత్మహత్యలే శరణ్యమని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో చితికిపోయిన చిన్న కాంట్రాక్టర్లు..!

CONTRACTORS STRUGGLE : రాష్ట్రంలో ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసిన గుత్తేదారుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని గుత్తేదారులు వాపోతున్నారు. కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి పనులు చేస్తే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్ సాధారణ నిధుల కింద చేపట్టిన పనులకు సంబంధించి నిధులు విడుదల చేయకపోవడంతో గుత్తేదారులు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. గుత్తేదారు వ్యవస్థకు అనుబంధంగా ఉన్న 250 పరిశ్రమల పరిస్థితి ఇలాగే ఉందని వారు తెలిపారు. ప్రభుత్వ పనులు చేయలేక చాలామంది గుత్తేదారులు నిర్మాణాలు నిలిపివేశారన్నారు. బిల్లులు చెల్లించేందుకు తీసుకొచ్చిన సీఎంఎఫ్‌ఎస్‌-2 సాంకేతిక ఇబ్బందుల వల్ల అసలు బిల్లులు అప్‌లోడ్‌ చేయలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం చెల్లించే బిల్లులతో జీఎస్టీ రూపంలోనూ మళ్లీ ప్రభుత్వానికే ఆదాయం వస్తుందని గుత్తేదారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా చిన్న గుత్తేదారులు 10వేల మందికి పైగా ఉన్నారని సీఎంఎఫ్‌ఎస్‌-2 ద్వారా బిల్లులు నమోదు కాకపోవడంతో ఎంత మొత్తంలో పెండింగ్‌ బకాయిలు ఉన్నాయో కూడా తెలియడం లేదన్నారు. ఆర్థికసంవత్సరం ముగింపు సమయం దగ్గరపడుతుండటంతో కొన్ని నిధులు కోల్పోయే ప్రమాదముందని కాబట్టి ఈసారికి పాత విధానంలోనే బిల్లులు తీసుకోవాలని గుత్తేదారులు కోరుతున్నారు. సుమారు 6వేల కోట్ల రూపాయలకు పైగానే ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంటుందన్నారు. పాతబకాయిలు చెల్లించకపోవడంతో వ్యాపారులు సైతం తమకు అప్పు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నవరత్నాలు అమలు చేసేందుకు లేని ఆర్థిక ఇబ్బందులు తమకు బిల్లులు చెల్లించడానికే ఉన్నాయా అంటూ గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై భరోసాతో పనులు చేస్తే నేడు గుత్తేదారులు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని మండిపడుతున్నారు.

ఇవీ చదవండి

Last Updated :Jan 31, 2023, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.