TDP Agitation On Electricity Charges Hike: విద్యుత్​ కోతలు, ఛార్జీల పెంపుపై టీడీపీ ఆందోళనలు

author img

By

Published : May 24, 2023, 7:00 AM IST

Power Agitation
Power Agitation ()

TDP Agitation: అప్రకటిత విద్యుత్​ కోతలు, విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు విద్యుత్ సబ్ స్టేషన్లను ముట్టడించారు. అనధికార కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు. ప్రజలపై 57 వేల కోట్ల భారం మోపిన ప్రభుత్వం.. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేకపోతోందని ధ్వజమెత్తారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు

TDP Agitation: మండు వేసవిలో అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, గరివిడి, గజపతినగరం, డెంకాడ, గంట్యాడ, గుర్ల, లక్కవరపుకోట విద్యుత్తు ఉపకేంద్రాల వద్ద ఆందోళన చేశారు. ఎస్.కోట మండలం పోతనాపల్లి విద్యుత్ ఉపకేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే లలితకుమారి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన తెలిపారు. మన్యం జిల్లా పాలకొండ, గుమ్మలక్ష్మీపురం సహా పలు గ్రామాల్లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

అనకాపల్లిలో విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం విద్యుత్ సబ్‌స్టేషన్, నందిగామ మండలం చందాపురం సబ్‌స్టేషన్ వద్ద తెలుగుదేశం నేతలు విసన కర్రలు, లాంతర్లతో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం, కంకిపాడు విద్యుత్ స్టేషన్ల వద్ద టీడీపీ శ్రేణులు కరెంట్ కోతలు నిలిపేయాలని ఆందోళన చేశారు. తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఏ.కొండూరులో ధర్నా నిర్వహించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రజలపై నెలనెలా బాదుడు కార్యక్రమం చేపట్టారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. ఛార్జీలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక నెలవారి బాదుడు జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు పెరిగి, ఒక వైపు చెత్త పన్నులు, నీటి పన్నులు, ఇంటి పన్నులు ఇలా అన్నింటి మీద మోపిన భారాల వల్ల ప్రజల ఓపిక నశించి పోయింది. అందుకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు ఎత్తివేయాలి, కరెంట్ ఛార్జీల పెంపు ఆపివేయాలని డిస్కంల దగ్గర, సబ్​స్టేషన్​ల వద్ద నిరసనలు, ధర్నాలు చేపట్టాం.- బొండా ఉమ, టీడీపీ నేత

విద్యుత్ కోతలను నిరసిస్తూ... పాత గుంటూరు విద్యుత్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు, కార్పొరేటర్లు నిరసనకు దిగారు. అనధికారికంగా ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తోందని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో టీడీపీ నేతలు నిరసన దీక్షలు నిర్వహించారు. కనిగిరిలో ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. యర్రగొండపాలెంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

కర్నూలు జిల్లా ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్లలో కరెంట్ కోతలు, విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తెలుగుదేశం నేతలు ధర్నా చేశారు. వేసవిలో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కరెంట్ కష్టాలు మెుదలయ్యాయని అనంతపురం సబ్‌స్టేషన్ వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా తిరుపతి సబ్‍ స్టేషన్‍ ఎదుట బైఠాయించారు. ఇప్పటికే ఏడుసార్లు విద్యుత్‍ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.