ETV Bharat / state

తెలంగాణ వైద్యవిద్యలో నూతన శకం.. ఒకేసారి 8 వైద్య కళాశాలలు ప్రారంభం

author img

By

Published : Nov 15, 2022, 1:23 PM IST

తెలంగాణ వైద్యవిద్యలో కొత్త అధ్యాయానికి నాంది పడింది. 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏకకాలంలో తరగతులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్​గా తరగతులను ప్రారంభించారు.

KCR Inaugurated Medical Colleges
KCR Inaugurated Medical Colleges

KCR Inaugurated Medical Colleges : రాష్ట్ర వైద్యవిద్యలో కొత్త అధ్యాయానికి నాంది పడింది. 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏకకాలంలో తరగతులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్​గా తరగతులను ప్రారంభించారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, సంగారెడ్డి వైద్యకళాశాలల్లో విద్యాబోధనకు సీఎం శ్రీకారం చుట్టారు. కొత్త కళాశాలలతో కలిపి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు చేరింది.

KCR Inaugurated Eight Medical Colleges : రాష్ట్ర ఆవిర్భావం వరకు ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే అందుబాటులో ఉండటంతో 850 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. వైద్య కళాశాలలు లేక, సూప‌ర్ స్పెషాలిటీ వైద్యం అంద‌క ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. ఏదైనా పెద్ద వ్యాధి వ‌స్తే చికిత్స పొందాల‌న్నా.. మెరుగైన వైద్యం దొర‌కాల‌న్నా హైద‌రాబాద్​కు ప‌రిగెత్తాల్సి వ‌చ్చేది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూప‌ర్ స్పెషాలిటీ వైద్యం అంద‌ని ద్రాక్షగా ఉండేది. తక్కువ సీట్లు అందుబాటులో ఉండడంతో రాష్ట్ర విద్యార్థులకు మెడిసిన్‌ విద్య కష్టతరంగా ఉండేది. స్వరాష్ట్రంలో సూప‌ర్ స్పెషాలిటీ వైద్యసేవ‌ల‌ను పేద‌లకు చేరువ చేయ‌డంతో పాటు వైద్యవిద్య అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

KCR Inaugurated New Medical Colleges in Telangana : అందుకు అనుగుణంగా రాష్ట్రం ఆవిర్భవించిన తొలి నాళ్లలోనే మహబూబ్​నగర్‌, సిద్దిపేటలో ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాతి దశలో నల్గొండ, సూర్యాపేటలోనూ ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటయ్యాయి. కొత్తగా ఏర్పాటైన నాలుగు కళాశాలలతో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యకళాశాలల సంఖ్య తొమ్మిదికి చేరింది. దీంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా పెరిగింది. రెండో దశలో మరో ఎనిమిది ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌, సంగారెడ్డిలో నూతన వైద్యకళాశాలలు నిర్మించారు. కళాశాలల పనులు పూర్తై అనుమతులు కూడా రావడంతో నేడు సీఎం కేసీఆర్​ ప్రారంభించారు.

కొత్త కళాశాలలతో కలుపుకుని రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఒక్క మంచిర్యాలలో మాత్రం వంద సీట్లకు అనుమతి ఇచ్చారు. దీంతో అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. 2014లో 850గా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పుడు 2,790కి పెరిగాయి. అటు రాష్ట్రంలో పీజీ సీట్లు కూడా 531 నుంచి 1122కు పెరిగాయి. సూపర్‌ స్పెషాలిటీ సీట్లు 76 నుంచి 152కు పెరిగాయి.

కేటీఆర్​ హర్షం..: వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చిన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందించారు. 57 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 3 వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయని.. తెలంగాణ ఏర్పడ్డాక ఎనిమిదేళ్లలో 8 వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడం రాష్ట్ర వైద్య రంగంలో ఓ అద్భుతమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావుకు అభినందనలు తెలిపారు. అలాగే 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలతో పాటు.. 33 నర్సింగ్‌ కళాశాలలు కూడా నిర్మిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.