ETV Bharat / state

ఏపీలో పెరిగిన అప్పులు.. వివరాలు బయటపెట్టిన కేంద్రం

author img

By

Published : Dec 19, 2022, 5:46 PM IST

Updated : Dec 20, 2022, 7:12 AM IST

AP DEBTS :రాష్ట్రం చేసిన అప్పుల లెక్కల్నే లోక్‌సభ వేదికగా కేంద్రం వెల్లడించింది. బడ్జెట్‌ గణాంకాల ప్రకారం రాష్ట్ర అప్పు 3.98 లక్షల కోట్లని కేంద్రమంత్రి చెప్పారు. అయితే.. ఈ అంకెలేవీ ఖరారైన పబ్లిక్‌ డెట్‌ కానేకాదు. ఎందుకంటే.. అందులో కార్పొరేషన్ల అప్పులు, నాన్‌ గ్యారంటీ రుణాలు, పెండింగ్ బిల్లులు కలపలేదు. ఇవన్నీ కలిపితే... ఏపీ అప్పులు, చెల్లింపుల భారం 8 లక్షల 71 వేల కోట్ల రూపాయలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

central released the debts of andhra pradesh
ఏపీలో పెరిగిన అప్పులు.. వివరాలు బయటపెట్టిన కేంద్రం

AP DEBTS: దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల గణాంకాలను కేంద్రం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలియజేసింది. 2022 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పు 3 లక్షల 98వేల 903.60 కోట్లని.. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి లోక్‌సభకు ఇచ్చిన గణాంకాల్లో చెప్పారు. జీడీపీలో అప్పుల వాటాను కూడా వెల్లడించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌ అప్పు, ఇతరత్రా చెల్లింపుల భారం కలిపి 8 లక్షల 71 వేల కోట్లకు చేరిందని నిపుణులు లెక్కలు వేస్తున్న వేళ.. కేంద్రం చెప్పిన రుణాల లెక్క ఇంత తక్కువుగా ఉందేమిటన్న సందేహం ఎవరికైనా వస్తుంది. ఇందులో అసలు లెక్క వేరే ఉంది. ఆయా గణాంకాలకు ఆధారం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా... కేంద్రం ఇచ్చిన గణాంకాల్లోనే పేర్కొన్నారు.

"స్టేట్‌ ఫైనాన్సెస్‌: ఏ స్టడీ ఆఫ్‌ బడ్జెట్స్‌ ఆఫ్‌ 2021-22” పుస్తకమే తమ లెక్కలకు ఆధారమని కేంద్రమంత్రి స్వయంగా వెల్లడించారు. 2021 నవంబర్‌లోనే రిజర్వ్ బ్యాంకు ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. R.B.I వెబ్‌సైట్‌లోనూ ఉంది. లోక్‌సభలో సోమవారం కేంద్రం వెల్లడించిన గణాంకాలన్నీ అందులోనివే. మరి ఆ గణాంకాలకు ఆధారమేమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లో ప్రతిపాదించిన, సవరించిన గణాంకాలేనని అదే పుస్తకంలో రిజర్వ్ బ్యాంకు స్పష్టంగా చెప్పింది. అంటే.. కేంద్రం వెల్లడించిన అప్పుల లెక్కలన్నీ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఎప్పటికప్పుడు చెబుతున్నవే. కేంద్రం కొత్తగా చెప్పినవేవీ ఇందులో లేవు. పైగా రాష్ట్రాలు రహస్యంగా చేస్తున్న, పరిమితికి మించి వివిధ రూపాల్లో తీసుకుంటున్న అప్పుల వివరాలు ఆయా గణాంకాల్లో కలిసి ఉండే అవకాశమే లేదు.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే... రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తున్న అప్పుల అంకెలనే కేంద్రమూ లోక్‌సభలో వెల్లడించింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ అసలు అప్పులు ఇందులో బయటపడే అవకాశం లేకుండా పోయింది.

తెలంగాణ ఎంపీలు వెంకటేష్‌ నేత బొర్లకుంట, జి.రంజిత్‌రెడ్డి, కవిత మాలోతు అడిగిన ప్రశ్నలకు.. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి లిఖితపూర్వక జవాబిచ్చారు. రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రానికి అప్పు ఎంత ఉంది, అయిదేళ్లలో ఏ రాష్ట్ర అప్పు ఎంత శాతం పెరుగుతూ వస్తోంది, ప్రస్తుత ఏడాది ఎంత అప్పుందనే వివరాలను ఎంపీలు అడిగారు. వీటితోపాటు కేంద్రం చేసిన అప్పులు, జీఎస్​డీపీలో ఆయా రాష్ట్రాల అప్పుల వాటా ఎంత అని కూడా ప్రశ్నించారు. రాష్ట్రాలు తాము అప్పులు చేసుకునేందుకు ఉన్న నికర రుణ పరిమితిని అధిగమించాయా, ఒకవేళ అధిగమిస్తే వాటినీ తెలియజేయాలని ఎంపీలు కోరారు.

ఈ ప్రశ్నకు మాత్రం కేంద్రం సమగ్రంగా సమాధానం పొందుపరచలేదు. రాష్ట్రాలు తమ ఎఫ్​ఆర్​బీఎం చట్టం ప్రకారం రుణాలు తీసుకుంటున్నాయని, కేంద్ర ఆర్థికశాఖ, వ్యయ నియంత్రణ విభాగాలు పరిమితులు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నాయని మాత్రమే మంత్రి సమాధానం ఇచ్చారు.

కేంద్రమంత్రి వెల్లడించిన ఏపీ అప్పుల వివరాలు (రూ.కోట్లలో)

సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ వార్షిక వృద్ధి%
2018 2,29,333.8 9.8
2019 2,64,451.015.3
2020 3,07,671.5 16.3
2021(సవరించిన అంచనా) 3,60,333.4 17.1
2022(బడ్జెట్‌ అంచనా) 3,98,903.610.7

జీఎస్‌డీపీలో ఆంధ్రప్రదేశ్‌ రుణ వాటా (శాతాల్లో)

సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌
2014 42.3
201523.3
201624.5
201737.2
201829.2
201930.4
202031.7
2021(సవరించిన అంచనా) 36.5
2022(బడ్జెట్‌ అంచనా)37.6

అసలు భారం 8.71 లక్షల కోట్లుగా అంచనా!

ప్రజా రుణం 4,62,278.00 కోట్లు
కార్పొరేషన్ల ద్వారా 1,71,903.58 కోట్లు
నాన్‌ గ్యారంటీ రుణాలు 87,233.00 కోట్లు
పెండింగ్ బిల్లులు 1,50,000.00 కోట్లు
మొత్తం రూ.8,71,414.58 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అన్నిరకాల అప్పులు, పెండింగ్ బిల్లుల లెక్కలను కలిపితే... అసలు భారం 8 లక్షల 71 వేల కోట్లు ఉంటుందని అంచనా. రాష్ట్ర బడ్జెట్‌లో పొందుపరిచిన లెక్కలనే కేంద్రం చెప్పడం వల్ల... వాస్తవ లెక్కలతో పోలిస్తే తేడా ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం 4 లక్షల 62వేల 278 కోట్ల రుణం ఉన్నట్లు అంచనా. కార్పొరేషన్ల రుణాల లెక్కలను రాష్ట్రం నవీకరించడం లేదు. సెప్టెంబర్ వరకు లక్షా 71 వేల 903.58 కోట్ల రూపాయలను కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం వినియోగించుకున్నట్లు అంచనా. నాన్‌ గ్యారంటీ రుణాలు 87వేల 233 కోట్లను కూడా కేంద్రం లెక్కల్లో కలపలేదు. మూడున్నరేళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లులు లక్షా 50వేల కోట్లుగా లెక్కిస్తున్నారు. కార్పొరేషన్ల రుణాల వివరాలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్‌ పదేపదే అడుగుతున్నా సమర్పించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల లెక్కలు ఇవ్వడం లేదని కాగ్‌ కూడా ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 20, 2022, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.