గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ కొండ మార్గంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పర్యావరణ, పర్యాటక క్షేత్రంలోని అక్వేరియంలో గల అరుదైన చేపలు మృత్యువాత పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని లక్షలాది రూపాయలు వెచ్చించి వివిధ ప్రాంతాల నుంచి అరుదైన జాతి చేపలు తెచ్చి 14 అక్వేరియంలలో ఉంచారు. కొంత కాలంగా అక్వేరియాల నిర్వహణ సరిగా లేనందున 50కి పైగా చేపలు చనిపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యమే చేపల మృతికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అనుభవజ్ఞులైన సిబ్బంది ఇక్కడ పని చేసేవారు. ప్రభుత్వం మారాక పర్యావరణ, పరిరక్షణ క్షేత్రంలో కొందరు సిబ్బందిని విధులను తప్పించారు. వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులను నియమించారు. వీరికి అక్వేరియం నిర్వహణపై అవగాహన లేకపోవటం చేపల మరణానికి కారణమైంది. సుమారు రూ. 4లక్షలకు పైగా విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. చేపల మృతి అంశంపై అటవీశాఖ రేంజర్ నీలకంటేశ్వరరెడ్డిని వివరణ కోరగా ఇంతవరకూ తమకు విషయం తెలియదని... చేపల మృతిపై విచారణ జరుపుతామని తెలిపారు.
కోటప్పకొండలోని పర్యావరణ, పర్యాటక క్షేత్రంలో రూ.50 లక్షల వ్యయంతో 14 అక్వేరియంలు ఏర్పాటు చేశారు. అందులో సింగపూర్, మలేషియా దేశాల నుండి సైతం వివిధ రకాల చేపలను తెప్పించారు. వాటిలో గోల్డెన్ ప్యారేట్, కోయు కర్పప్, కిసింగ్ గోరమి, బ్లాక్ మూర్, స్యాట్ ఫిష్, ఫైర్ మౌత్ చిచీర్లిడ్, అలిబినో జెట్ గోరమి ఇవే కాకుండా పలు రకాల చేపలను సందర్శకుల కోసం తెప్పించారు. అదే విధంగా సందర్శకులు సైతం రకరకాల చేపలను చూసేందుకు భారీగా తరలి వచ్చేవారు. ఇప్పుడు చేపలు మృత్యువాత పడటంతో వారంతా నిరాశ చెందుతున్నారు.