ETV Bharat / state

చేతబడి అనుమానంతో వ్యక్తి పై దాడి..

author img

By

Published : Jan 19, 2021, 3:21 PM IST

Guntur
చేతబడి అనుమానంతో వ్యక్తి పై దేహశుద్ధి

కూర్చున చోటు నుంచి కదలకుండా... మనకు అవసరమైన అన్ని పనులు చేసుకోవచ్చు. అంతలా సాంకేతికత అభివృద్ధి చెందింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు... ప్రపంచం మెుత్తం మన ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంత ఆధునిక కాలంలో మనుషులు జీవిస్తున్నా... కొందరిలో మూఢ నమ్మకాల ఆలోచనలు తొలగిపోవడం లేదు. గుంటూరు జిల్లాలోని రచ్చమల్ల పాడు గ్రామానికి చెందిన ముగ్గురికి ఆరోగ్యం బాగాలేకపోతే... అందుకు చేతబడే కారణం అని భావించారు. ఆదే ఊరికి చెందిన ఒక వ్యక్తే ఇది చేసి ఉంటారని అనుకుని... అతన్ని చితకొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది.

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలోని రచ్చమల్ల పాడుకి చెందిన నాగేశ్వరి, మంగమ్మ, వెంకటేశ్వర్లు ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురయ్యారు. వారి మానసిక పరిస్థితిలో మార్పు వచ్చింది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించారు. అందుకు కారణం చేతబడి అని వారు భావించారు. దీంతో అదే గ్రామానికి చెందిన సూదుల ఆంజనేయులు అనే వ్యక్తి పై అనుమానం పెంచుకున్నారు.

ఆ ముగ్గురికి చేతబడి చేసి... ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఊర్లో జనాలు నమ్మారు. వెంటనే గ్రామంలోని కొందరు కలిసి... ఆంజనేయులు ఉండే ప్రాంతానికి వెళ్లారు. చేతబడికి విరుగుడు చేయమని అతన్ని అడిగారు. ఏమి స్పందించక పోవడంతో... ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని... పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత గ్రామస్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చేతబడి పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్న ఆంజనేయులు ను అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరి, మంగమ్మ, వెంకటేశ్వర్లును ఆరోగ్య పరీక్షల నిమిత్తం మాచర్లకు తరలించారు.

ఇదీ చదవండి: భీమవరం మర్యాదలా మజాకా.. అల్లుడికి 125 వెరైటీ వంటకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.