ETV Bharat / state

పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంపు.. వరద ముంచెయ్యకుండా చర్యలు

author img

By

Published : Jul 15, 2022, 5:56 PM IST

Updated : Jul 16, 2022, 3:44 AM IST

పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంపు
పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంపు

17:52 July 15

ఎగువ కాఫర్ డ్యామ్‌ను పటిష్టపరిచి, ఎత్తు పెంచాలని నిర్ణయం

Polavaram: గోదావరికి భారీ వరద పోటెత్తడంతో పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాంకు ప్రమాదం వాటిల్లకుండా కొంత మేర ఎత్తు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు ఒక మీటరు మేర రెండు మీటర్ల వెడల్పున పెంచనున్నారు. భారీ వరదను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎగువ కాఫర్‌ డ్యాంకు ఎగువ వైపునే ఈ ఎత్తు పెంచనున్నారు. ఇవాళ సాయంత్రానికే ఈ పని పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగాయి. ఎగువ కాఫర్‌ డ్యాం 2,480 మీటర్ల పొడవునా ఒక మీటరు ఎత్తు, 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచే పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పోలవరం వద్ద ఎగువ కాఫర్‌ డ్యాం సమీపంలో 37.8 మీటర్ల స్థాయిలో గోదావరి నీటిమట్టం ఉంది. ఎగువ కాఫర్‌ డ్యాం మరో ఆరు మీటర్ల ఎత్తు ఉంటుంది. అందులో పూర్తి కోర్‌తో నిర్మించిన ప్రాంతం 3 మీటర్లే ఉందని ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం 19 లక్షల క్యూసెక్కుల నీటిని పోలవరం గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి మరింత పెద్ద ఎత్తున వస్తున్న ప్రవాహాన్ని ఎలా ఎదుర్కొవాలనేది చర్చనీయాంశమైంది.

మేడిగడ్డ జలాశయం నుంచి గురువారం తెల్లవారుజామున 28.75 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శుక్రవారం సాయంత్రానికి కూడా దాదాపు 27 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతూనే ఉన్నారు. భద్రాచలం వద్ద 71 అడుగులకు నీటిమట్టం చేరింది. అది 73 నుంచి 75 అడుగులకు చేరవచ్చని అంచనా. ఆ నీరంతా పోలవరం వద్దకే రావాలి. దీంతో పోలవరం వద్ద 25 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యాం 28 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మించారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎగువ కాఫర్‌ డ్యాం పై నుంచి దిగువకు ప్రవహించే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలోపెట్టుకొని ఒక మీటరు మేర ఎగువ కాఫర్‌ డ్యాం పొడవునా 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచాలని నిర్ణయించారు. ఎగువ కాఫర్‌ డ్యాం ఎగువ భాగం మొత్తం 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ మొత్తం కాకుండా 2 మీటర్ల వెడల్పుతోనే ఎత్తు పెంచుతారు. నీరు ఎగువ కాఫర్‌ డ్యాం దాటి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పనులు చేయాలని నిర్ణయించారు.

భారీ వరదల్లో ఇదొకటి..: భద్రాచలం వద్ద ఇప్పటికే 71 అడుగులకు చేరడం, అది మరింత పెరిగే ఆస్కారం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఇది గతంలో వచ్చిన అత్యంత భారీ వరదతో సమానమనే మాట వినిపిస్తోంది. గోదావరికి 1986లో అత్యంత భారీ వరద వచ్చి అప్పట్లో ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అప్పట్లో 75.6 అడుగుల స్థాయికి భద్రాచలం వద్ద వరద వచ్చింది. అదే ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం ఉన్న ప్రవాహాలు ఆధారంగా రెండో అతి పెద్ద వరదగా పరిగణించే పరిస్థితి వచ్చింది. 1986 స్థాయికి చేరుతుందేమోనన్న భయమూ ఉంది. ధవళేశ్వరం వద్ద శుక్రవారం సాయంత్రానికి 21 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు.

ఎత్తు పెంచడంలోనూ ఇబ్బందులు: పోలవరంలో 42.5 మీటర్ల ఎగువన కాఫర్‌ డ్యాం ఎగువ వైపు కోర్‌ సాయంతోనే ఎత్తు పెంచాలని నిర్ణయించారు. ఇందుకు ఆ సమీపంలో కొంత మట్టి లభ్యమై ఆ మేరకు పని ప్రారంభించినా 2,480 మీటర్ల పొడవునా అవసరమైన మట్టితో కోర్‌ వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. కురిసిన వర్షాల కారణంగా అవసరమైన మట్టి లభ్యత కష్టంగా ఉంది. దీంతో కోర్‌ బదులు రాళ్లతోనే ఎత్తు పెంచాలని యోచిస్తున్నారు.

వాహనాల రాకపోకల్లో ఇబ్బందులు: ఎగువ కాఫర్‌ డ్యాం పైన 9 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. అక్కడ 2 మీటర్ల వెడల్పుతో పని చేయాల్సి ఉంది. ఇప్పటికే ఒక వైపు అవసరమైన రాళ్లు, ఇతరత్రా సామగ్రి సిద్ధం చేశారు. ఈ పని చేసేందుకు వాహనాలు తిరగాల్సి ఉంది. పైన 2 మీటర్లు వదలేసి వాహనాలు ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదురెదురుగా వాహనాలు, డ్యాం నిర్వహణ పనులకు ఉపయోగించేవి తిరగవలసి వస్తే ఒక వాహనం ఆగి మరో వాహనానికి దారి ఇస్తుంది. ఇక్కడ ఎగువ కాఫర్‌ డ్యాం తాత్కాలిక నిర్మాణం కావడం వల్ల అలాంటి వెసులుబాటు కూడా లేదని చెబుతున్నారు. ఈ కారణంతో శనివారం సాయంత్రానికి పూర్తి చేయాలనుకున్న ఎత్తు పెంపు సాధ్యమేనా అన్న అనుమానాలు ఇంజినీర్లలోనే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యాం 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. అందులో 41 మీటర్ల మేర మాత్రమే కోర్‌ ఉంది. ఆ పైన రాళ్లతోనే నిర్మించారు. ఇప్పుడు ఆ పైన కూడా రాళ్లతోనే ఎత్తు పెంచబోతున్నారు. ఒక వేళ 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎగువ కాఫర్‌ డ్యాం పై నుంచి నీరు ప్రవహించకుండా అడ్డుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఆదివారం ఉదయం వరకు ఆందోళనే...: ప్రస్తుతం ఎగువన వదిలిన ప్రవాహం పోలవరం వద్దకు చేరాల్సిందే. ఆదివారం ఉదయం వరకు కూడా ఇది పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన మేడిగడ్డ వద్ద సుమారు 29 లక్షల క్యూసెక్కులు వదిలిన సందర్భం ఉంది. ఆ దిగువన తాలిపేరు వంటివి కూడా కొంత జతఅయ్యాయి. దిగువకు ఆ ప్రవాహం వచ్చే సరికి సర్దుకుని ఒకేసారి ఆ పూర్తి స్థాయి ప్రవాహం వస్తుందా లేదా అన్న విషయంలో అధికారుల్లో కొంత సందేహం ఉంది. 26 లక్షల క్యూసెక్కుల నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరకు ఎంతైనా రావచ్చని అంచనా వేస్తున్నారు. 28 లక్షలు దాటకపోతే పెద్ద ఇబ్బందులు ఉండబోవని అంచనా వేస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆరా: పోలవరం పరిస్థితిపై, ఎగువ కాఫర్‌ డ్యాం అంశంపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరా తీశారు. శుక్రవారం జల వనరులశాఖ అధికారులను వివరాలు అడిగారు. ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచే ప్రతిపాదన సీఎం వద్దకు కూడా తీసుకువెళ్లి ఆమోదం తీసుకున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

Last Updated :Jul 16, 2022, 3:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.