2024 మార్చి నాటికి కూడా పోలవరం పూర్తి కాకపోవచ్చు : కేంద్ర మంత్రి

author img

By

Published : Feb 6, 2023, 10:48 PM IST

Updated : Feb 7, 2023, 7:21 AM IST

Polavaram project
పోలవరం ()

Key Comments on Polavaram Project: నిర్ధేశిత గడువు లోపు పోలవరం నిర్మాణం పూర్తి కావడం సాధ్యపడక పోవచ్చని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులివ్వబోమని పునరుద్ఘాటించారు.

2024 మార్చి నాటికి కూడా పోలవరం పూర్తి కాకపోవచ్చు : కేంద్ర మంత్రి

Polavaram Project : తాజాగా నిర్దేశించిన గడువు ప్రకారం పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి.. పంపిణీ వ్యవస్థ 2024 జూన్‌ నాటికి పూర్తికావాల్సి ఉంది. అయితే 2020, 2022ల్లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదల దృష్ట్యా ప్రతిపాదిత షెడ్యూల్‌లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. గడువులోపు పోలవరం నిర్మాణం పూర్తికాదని సమాధానమిచ్చారు. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం చేసిన అర్హమైన ఖర్చులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందన్నారు. బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదముద్ర వేసిన వెంటనే ఇస్తున్నామన్నారు. 2014 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు పోలవరం ప్రాజెక్టు కోసం 16 వేల 35.88 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు. వీటిలో ఇప్పటివరకూ 13 వేల 226 కోట్ల రూపాయలు చెల్లించామని.. 2 వేల 390 కోట్ల రూపాయల నిధులకు తిరిగి చెల్లించే అర్హత లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ గుర్తించిందని ఆయన స్పష్టం చేశారు. ఇవి కాకుండా 548.38 కోట్ల రూపాయల బిల్లులు అథారిటీ పరిశీలన కోసం వచ్చాయన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో ఖర్చుల తిరిగి చెల్లింపు అన్నది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించే బిల్లులు, పీపీఏ, కేంద్ర జలసంఘం వాటిని పరిశీలించి చేసే సిఫార్సులపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రాజెక్టులో స్పిల్‌వే, ఎగువ కాఫర్‌ డ్యాం, కాంక్రీట్‌ డ్యాం, ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయ్యాయి. ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం, నిర్వాసిత కుటుంబాలకు సహాయ పునరావాస కల్పన వివిధ దశల్లో ఉంది అని మంత్రి పేర్కొన్నారు.

పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టును ఏపీ జెన్‌కో నిర్మిస్తోందని, 2016-17 నాటి ధరల ప్రకారం దీనికి 5 వేల 338.95 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆ సంస్థ తెలిపినట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్రాంటూ ఇవ్వదని స్పష్టం చేశారు. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ‘పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఏపీ జెన్‌కో 960 మెగావాట్ల జలవిద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తోందని.. ఇప్పటి వరకు పునాది కోసం భూమి తవ్వకం పనులు పూర్తయినట్లు జెన్‌కో తెలిపిందన్నారు. 2026 జనవరి నాటికి దీని నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యమని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 7, 2023, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.