పోలవరం ప్రాజెక్టును సందర్శించిన.. సీడబ్ల్యూసీ కమిటీ

author img

By

Published : May 12, 2022, 5:40 AM IST

Polavaram

పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ....సీడబ్ల్యూసీ కమిటీ సభ్యుల బృందం జలవనరుల శాఖ అధికారులకు సూచించింది. సీడబ్ల్యూసీ. కమిటీ డైరెక్టర్లు మహమ్మద్, రాహుల్ కుమార్ సింగ్ నేతృత్వంలో ప్రాజెక్టులోని స్పిల్‌వే, రేడియల్ గేట్స్, ఫిష్ లేడర్‌పై ఆరా తీశారు. జలవనరుల శాఖ అధికారులు పనుల పురోగతిపై వివరాలు వివరించారు.

పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం కేంద్ర జల సంఘానికి చెందిన డైరెక్టర్లు ఖయ్యమ్‌ మహ్మద్, రాహుల్‌ కుమార్‌ సింగ్, డిప్యూటీ డైరెక్టర్లు సోమేష్‌ కుమార్, అశ్వనీ కుమార్‌ వర్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గౌరవ తివారీ పరిశీలించారు. వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను పటిష్ఠం చేసే విషయంపై వివిధ శాఖల అధికారులు ఈ నెలలో సమావేశం కానున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వారు ఇక్కడకు వచ్చినట్లు జల వనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు డెరెక్టర్ల బృందం డయాఫ్రమ్‌ వాల్‌తోపాటు స్పిల్‌వే బ్రిడ్జి, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించింది.

48 గేట్లకు సంబంధించి పెయింటింగ్‌ పనులు జరుగుతున్నాయని, స్పిల్‌వే బ్రిడ్జిపై ఏర్పాటు చేసే గ్యాంట్రీకి సంబంధించి ఆకృతుల అనుమతి రావాల్సి ఉందని గేట్ల డైరెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ సింగ్‌ దృష్టికి ఇంజినీరింగ్‌ అధికారులు తీసుకొచ్చారు. వారి వెంట పీపీఏ డైరెక్టర్‌ పి.దేవేంద్రరావు, ప్రాజెక్టు సీఈ బి.సుధాకరబాబు, ఈఈలు పి.సుధాకరరావు, పి.ఆదిరెడ్డి, ఎం.మల్లికార్జునరావు, పలువురు డీఈలు, ఏఈలు ఉన్నారు.

ఇదీ చదవండి: POLAVARAM: ధ్వంసమైన డయాఫ్రం వాల్‌పై ఎలా ముందుకెళ్లాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.