ETV Bharat / state

ప్రభుత్వంపై పోరాటానికి అందరూ సిద్ధంకండి.. ఏపీ జేఎసీ పిలుపు

author img

By

Published : Mar 2, 2023, 10:00 PM IST

Apjac Amaravath
Apjac Amaravath

AP JAC AMARAVATHI NIRASANA UPDATES: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్లు ఏపీ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఐదు బృందాలుగా ఏర్పడి అమరావతి, ఏలూరు, నెల్లూరు, విజయనగరం, బాపట్ల జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, రిటైర్డ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించడం లేదని ఉద్యోగ సంఘ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వంపై పోరాటానికి అందరూ సిద్ధంకండి

AP JAC AMARAVATHI NIRASANA UPDATES: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్లు ఏపీ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఐదు బృందాలుగా ఏర్పడి.. ఏలూరు జిల్లా, నెల్లూరు జిల్లా, విజయనగరం జిల్లా, బాపట్ల జిల్లా, అమరావతిలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, రిటైర్డ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఈరోజు సమావేశమయ్యారు. సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల గురించి ఈ నెల 9 నుండి చేపట్టనున్న ఉద్యమం గురించి, జీతాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు తమ సమస్యలను మొరపెట్టుకున్నా పట్టించుకోవటంలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే తామంతా ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

9వ తేదీ నుండి ఉద్యమం ప్రారంభం: ఏలూరులోని రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ జెఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికే 9వ తేదీ నుండి ఉద్యమాన్ని చేపట్టనున్నామని.. ఆ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారానికి.. గత ఏడాది ఫిబ్రవరి నెలలో 11వ పీఆర్సీ అమలులో భాగంగా జరిగిన ఉద్యమం సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో సమస్యలు పరిష్కారంలో జాప్యం చేస్తున్నందునే మార్చి 9 నుండి ఏప్రిల్ 3వరకు దశలవారీగా ఉద్యమానికి సిద్దమయ్యామన్నారు.

ఇది ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం కాదని..కేవలం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న పోరాటమేనని ఆయన స్పష్టం చేశారు. స్వయానా ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రే ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు.. ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్దంకాని పరిస్దితిలో ఈ ఉద్యమానికి సిద్దపడ్డామని తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాల కోసం కేటాయించిన బడ్జెట్ ఏమౌతుందో? తెలియడం లేదన్నారు.

ఉద్యమ కార్యచరణకు అందరూ కదిలిరండి: నెల్లూరులో సమావేశంలో భాగంగా ఉద్యమ కార్యచరణకు సిద్ధంకండి అని ఏపీ జేఏసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి, ఉద్యమ సమస్యలు, హక్కులను కాపాడుకుందాం అనే అంశాలతో ఏపీ జేఏసీ ముందుకెళ్తుందని..ఏపీజేఏసీ అమరావతి అసోసియేట్ చైర్మన్ కోపరేటివ్ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఫణిపేర్రాజు తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం దుర్భరంగా ఉందని.. ఉద్యమ కార్యచరణకు అందరూ కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫేస్ రికగ్నేషన్‌ను వెంటనే తొలగించాలి: మరోవైపు బాపట్ల జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జి. ఆస్కార్ రావు పాల్గొని పలు విషయాలపై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇవ్వట్లేదని.. అంతకు ముందులా కాకుండా బయోమెట్రిక్ స్థానంలో ఫేస్ రికగ్నేషన్ అనే ఒక యాప్‌ని తెచ్చి ఉద్యోగులను చిత్రహింసలకు గురిచేస్తోందన్నారు.

ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతున్న ఫేస్ రికగ్నేషన్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద గవర్నర్‌ను ఉద్యోగుల సంఘాలు కలవడం జరిగిందని.. దీనిపై కొన్ని ఉద్యోగ సంఘాలు మాపై బురద జల్లి మేమేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని అపోహలు సృష్టించి ప్రభుత్వానికి మాపై వ్యతిరేకంగా ప్రచారం చేశారని ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు.. ఏప్రిల్ నెలలో సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మేం పాక్ ప్రధానిని, తీవ్రవాదులను కలవలేదు: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం విచ్చేసిన.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. . రాజ్యాంగబద్ధంగా ఉద్యోగులకు కల్పించిన హక్కులను హరిస్తున్నందునే గవర్నర్‌ను కలిసి మెమొరాండం ఇచ్చామన్నారు. అంతేగానీ తీవ్ర నేరం చేయలేదని.. తామేమీ పాక్ అధ్యక్షుడిని, తీవ్రవాదులనూ కలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతమాత్రానికే సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదంటూ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం హాస్యస్పాందంగా ఉందన్నారు. మా సంఘాన్ని రద్దు చేసే హక్కు ముఖ్యమంత్రికే కాదు.. దేశంలో ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం నెల రోజులు శ్రమించే ఉద్యోగులు ప్రతి నెలా ఒకటో తేదీ నాటికి జీతాల కోసం చూస్తారని, అవి సకాలంలో అందక, ఆర్ధిక ఇబ్బందులతో వారు ఎలా పని చేయగరని ప్రశ్నించారు. అనేక దఫాలు ముఖ్యమంత్రితోపాటు, పెద్దలందరికీ విన్నవించుకున్నామన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు రావాల్సిన వివిధ ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు చెల్లింపులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. 12 వేల కోట్ల రూపాయల చెల్లింపుల బకాయిలు సీఎఫ్ఎంఎస్‌లో పెండింగులో చూపుతున్నాయని తెలిపారు. జీపీఎఫ్, డీఏ ఆరియర్లు ఖాతాలో జమ చేసినట్లే చేసి, మళ్లీ వెనక్కి తీసుకోవడం శిక్షార్హం కాదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కాదని.. అది పబ్లిక్ ఖాతా అని ఆయన పేర్కొన్నారు. 31.3.21 ఆర్ధిక సంవత్సరానికి జీపీఎఫ్ ఖాతాలో 11 వేల కోట్లు ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉందో చెప్పడం లేదన్నారు. ఈ సొమ్ము ఖాతాలో లేదని, కాగితాల్లోనే చూపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ఎంతగా సహకరిస్తున్నా ఉద్యోగులకు ఒకటో తేదీన సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.