ETV Bharat / state

Tanuku: తణుకులో ఉద్రిక్తత.. అమరావతి అనుకూల, వ్యతిరేక నినాదాలు

author img

By

Published : Oct 12, 2022, 6:45 PM IST

Updated : Oct 13, 2022, 7:04 AM IST

Tension in farmer march
పాదయాత్రలో వ్యతిరేక నినాదాలు

Tension in Tanuku: అమరావతి రైతులు గాంధేయమార్గంలో శాంతియుతంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మూడు రాజధానులకు మద్దతుగా నరేంద్ర కూడలిలో వైకాపా బహిరంగ సభ ఏర్పాటు చేసింది. నల్లబెలూన్లు, ప్లకార్డులతో నిరసన తెలపడంతోపాటు.. గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే సమయంలో పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు.

Tension in farmer march: అమరావతి రైతుల మహాపాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో చివరి రోజు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా నేతలు నల్లబెలూన్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో.. ఒకానొక సమయంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎవరెన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా రైతులు సంయమనం కోల్పోకుండా.. జైఅమరావతి అని నినదిస్తూ ముందుకు సాగారు.

పాదయాత్రలో అమరావతి అనుకూల, వ్యతిరేక నినాదాలు
అమరావతి రైతుల మహాపాదయాత్ర 31వ రోజు ఉద్రిక్తతల మధ్య సాగింది. పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరులో యాత్ర ప్రారంభానికి ముందు పోలీసులు ఆంక్షలు విధించారు. డీజే వాహనాలు ఉండరాదని, బాణసంచా కాల్చవద్దని షరతులు పెట్టారు. పాదయాత్రతో రాజకీయ పార్టీలకు పనేమిటంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికే పలు జిల్లాల్లో యాత్ర పూర్తి చేశామని, కొత్తగా ఆంక్షలు విధించడమేంటని ఐకాస నేతలు ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత యాత్ర ప్రారంభమైంది.

పాదయాత్రకు వేల్పూరులో ప్రజలు అపూర్వ మద్దతు అందించారు. అమరావతికి సంఘీభావం తెలుపుతూ మండపాక మహిళలు పూలు, పండ్లు అందించారు. బొట్టు పెట్టి గ్రామంలోకి ఆహ్వానించారు. పాదయాత్ర తణుకు చేరుకునే సరికి.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యాన నరేంద్ర కూడలిలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. వికేంద్రీకరణ పేరిట వైకాపా నేతలు పెద్దసంఖ్యలో మహిళలను తీసుకువచ్చారు. వారంతా నల్ల కండువాలు వేసుకుని ప్లకార్డులు ప్రదర్శించారు. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో వైకాపా మద్దతుదారులు, అమరావతి రైతులు పెద్దఎత్తున తమతమ నినాదాలు చేశారు. రైతులను అడ్డుకునేందుకు వైకాపా వర్గీయులు యత్నించినా.. నిలువరించేందుకు పోలీసులు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. వైకాపా వర్గం ఎంత కవ్వించినా చలించని రైతులు.. అమరావతి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

తణుకు మున్సిపల్ కార్యాలయం, మహాలక్ష్మమ్మ గుడి మీదుగా జాతీయ రహదారిపైకి పాదయాత్ర చేరుకోగా.. పెద్దఎత్తున మహిళలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. రైతులపై పూలు చల్లి హారతులు పట్టారు. అక్కడి నుంచి పాలంగి మీదుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరానికి పాదయాత్ర చేరింది. 31వ రోజు దాదాపు 20 కిలోమీటర్ల మేర నడిచారు.

తణుకు నరేంద్ర కూడలి ఘటనపై అమరావతి పరిరక్షణ సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేటీఎం బ్యాచ్‌ని తీసుకొచ్చిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అడ్డంకులు సృష్టించడం దారుణమని మండిపడ్డారు.

నేడు ఉండ్రాజవరం నుంచి మునిపల్లె వరకు మహా పాదయాత్ర సాగుతుందని ఐకాస నేతలు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 13, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.