ETV Bharat / state

PAWAN KALYAN: ప్రజల కోసమే తిట్లు భరిస్తున్నా.. నా కోసమే అయితే నార తీసేవాడిని: పవన్‌

author img

By

Published : Oct 2, 2021, 1:49 PM IST

Updated : Oct 2, 2021, 4:07 PM IST

PAWAN KALYAN
PAWAN KALYAN

15:21 October 02

బాలాజీపేటలో పవన్‌కల్యాణ్‌ శ్రమదానం

ప్రజల కోసమే తిట్లు భరిస్తున్నా.. నా కోసమే అయితే నార తీసేవాడిని

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 

'‘పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరు. రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోలేరు. తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదు. పోలీసుల ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు తొక్కేయొద్దు. మీరు తొక్కే కొద్ది మేము పైకి లేస్తాం' అని పవన్ వ్యాఖ్యనించారు.  

పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు..

పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని పవన్ అన్నారు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసని ప్రశ్నించారు. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకే వచ్చానన్నారు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష అని అన్నారు. శ్రమదానం తనకు సరదా కాదని..,కులాల పేరిట కొందరు  రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.  

ప్రజల కోసమే తిట్లు తింటున్నా

ప్రజల కోసమే తిట్లు తింటున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యనించారు. తన కోసమే ఆలోచిస్తే.. తిట్టినవారిని కింద కూర్చోపెట్టి నార తీసేవాడినిని మండిపడ్డారు. ఎన్నో మాటలు పడ్డా.. నా సహనాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇంతకాలం మానసిక అత్యాచారాలు భరించా. ఇక నుంచి పడేది లేదు...తొక్కతీసి నార తీస్తా.' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  

మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని..,మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని.., యాక్షన్‌, కెమెరా, కట్‌ అని వెళ్లే వ్యక్తిని కాదన్నారు.  

13:47 October 02

ప్రజల కోసమే తిట్లు భరిస్తున్నా.. నా కోసమే అయితే నార తీసేవాడిని

పవర్‌ వచ్చాకే పవర్‌స్టార్‌ అని పిలవండి

పవర్‌ వచ్చాకే పవర్‌స్టార్‌ అని పిలవండని పవన్‌ జనసైనికులకు సూచించారు. సీఎం అయ్యాకే సీఎం అని పిలవాలని కోరారు. ఇప్పుడు జనసేనాని అని పిలవండని సూచించారు. తాము బాధ్యతగా ఉంటామని..,బాధ్యతగా ఉండాలని అధికార ఎమ్మెల్యేలకు కూడా చెప్పాలని పోలీసులు,అధికారులకు సూచించారు.  

ఏ కులంలో పుట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం లేదు. ఎలా ప్రవర్తించాలనేది మన చేతిలో ఉంది. కులంలో చాలా గొప్పోళ్లు ఉంటారు. ఒకరు అన్నారని కులాన్ని నిందించకూడదు.తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్న సామెతలా ప్రవర్తిస్తున్నారు. ద్వారంపూడి మంచి ఇంటి పేరు పెట్టుకుని చంద్రశేఖర్‌రెడ్డి నన్ను దుర్భాషలాడారు. నేను ఆయన్ను ఒక్క మాట అనలేదు..ఆయన దేనిలో ఎక్కువ. నన్ను బూతులు తిడితే మరిన్ని తిట్టగలం.మా వీర మహిళలు అంత కన్నా తిట్టగలరు. ప్రజాస్వామ్యంలో అణచివేత ఏమాత్రం శ్రేయస్కరం కాదు. భాజపా కార్యకర్తలను కూడా వైకాపా వదల్లేదు. జనసేన సైనికులపై దాడులు చేసి వేధిస్తున్నారు.  వైకాపా దేనికంటే దానికి నేను 'సై'. అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చా.-పవన్‌ కల్యాణ్

గుంతలు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ?

గుంతలు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ? అని పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదన్నారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం మంచిది కాదని హితవు పలికారు. రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నానని వెల్లడించారు. కులాల పేరిట కొట్లాటలతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.  

సజ్జల..మేము సమస్యల గురించి మాట్లాడుతాం. మా కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పోలీసులకు చెప్పడం సరికాదు. వైకాపా ద్వంద్వ వైఖరిని బలంగా ఎండగడతాం. వైకాపా అన్ని కులాలను నలిపేస్తోంది. రెడ్డి సామాజిక వర్గంలోనూ చాలా బాధ ఉంది. వారి చుట్టూ ఉండేవారికి తప్ప ఎవరికీ మేలు జరగట్లేదు. యువత వైకాపాకు ఓటు వేస్తే..ఇప్పటివరకు ఉద్యోగాలు ఇచ్చిందా?. పరిశ్రమలు రావాలి..ఉద్యోగాలు కావాలి. రెండు వేలు, ఐదు వేలు ఇస్తామంటే కుదరదు. వైకాపాకు అధికారమిస్తే అన్ని కులాల్ని కుళ్ల బొడుస్తోంది- పవన్‌, జనసేన అధినేత  

వైకాపా చేయాల్సిన నేరాలు, ఘోరాలన్నీ చేస్తోంది

వైకాపా చేయాల్సిన నేరాలు, ఘోరాలన్నీ చేస్తోందని పవన్‌ మండిపడ్డారు. వివేకా హత్యపై వైకాపా ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు. పోలీసులే మా వెంట పడితే మేం ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమినల్‌ గ్యాంగ్‌కు వంతపాడి సెల్యూట్‌ చేయడం బాధగా ఉందన్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు వారి పని వాళ్లు చేయాలని లేదంటే తాము రోడ్డు మీదకు వస్తామని హెచ్చరించారు. జనసేన అంటే వైకాపాకు భయం ఉందని.., అందుకే సభకు వచ్చేవారిని ఎక్కడిక్కడ అడ్డుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాని..,పోతే ప్రాణం పోవాలి కానీ రాజకీయాల నుంచి పారిపోయేది లేదన్నారు. సామాజిక మార్పు వచ్చేవరకు పోరాటం చేసి..పదవి తీసుకుంటానన్నారు.  

అందుకే తెదేపాకు మద్దతిచ్చా..

కోపాన్ని దాచుకునే కళ అందరూ నేర్చుకోవాలని పవన్‌ సూచించారు. రాయలసీమలో కోపాన్ని మూడు తరాలు దాచుకుంటారన్నారు. మన కోపం అన్యాయం చేసేవాడికి వెన్నులో నుంచి వణుకు పుట్టించాలన్నారు.  

కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు. సమాజంలో కాపు, తెలగ, ఒంటరి, బలిజలు పెద్దన్న పాత్ర వహించాలి. కమ్మలకు జనసేన వ్యతిరేకం కాదని చెప్పేందుకు తెదేపాకు మద్దతిచ్చా. నేను తగ్గిచూపిస్తున్నా...పెద్దన్నపాత్ర వహించేందుకు మీరు కూడా తగ్గాలి. సమాజంలో మార్పు అనేది గోదావరి జిల్లాలపై ఆధారపడి ఉంది. అధికారంలో లేని వర్గాలకు అధికారమిచ్చేందుకు అందరూ ఏకం కావాలి.లాల్‌ బహదూర్‌శాస్త్రి వంటి నేతల స్ఫూర్తితో జనసేన ముందుకెళ్తోంది. అన్ని కులాలు, మతాలకు హామీ ఇస్తున్నా. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను. వైకాపాను ఎదుర్కొనేందుకు తెదేపాకు బలం చాలడం లేదు. శక్తి కోసమే జనసేన ముందుకొచ్చింది. ఈ సుదీర్ఘ యుద్ధంలో నా ప్రాణాలు పోతే దేశం నలుమూలలా నా మట్టి చల్లండి. దాష్టీకాన్ని ఎదిరించే కత్తులం కావాలి. వైకాపాపై యుద్ధానికి సిద్ధంకండి. వైకాపా జోలికి నేను వెళ్లలేదు. నేను వెళ్తుంటే లాక్కొచ్చి మానసిక అత్యాచారం చేశారు. ఎలాంటి యుద్ధం కావాలో వైకాపానే నిర్ణయించుకోవాలి. -పవన్‌

ఇదీ చదవండి

PAWAN TOUR: రాజమహేంద్రవరంలో పవన్​ పర్యటన.. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

Last Updated :Oct 2, 2021, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.