ETV Bharat / state

JP Nadda: వైకాపా ఇంటికెళ్లటం ఖాయం.. భాజపాదే అధికారం: జేపీ నడ్డా

author img

By

Published : Jun 7, 2022, 8:01 PM IST

Updated : Jun 8, 2022, 3:54 AM IST

వైకాపా ఇంటికెళ్లటం ఖాయం
వైకాపా ఇంటికెళ్లటం ఖాయం

ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. కేంద్రం నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన 'భాజపా గోదావరి గర్జన' సభకు హాజరైన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.., రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.

వైకాపా ఇంటికెళ్లటం ఖాయం

JP Nadda Fire On Jagan Govt: వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 'భాజపా గోదావరి గర్జన' సభకు నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉంటుందన్న ఆయన.. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని.., విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆక్షేపించారు. కేంద్ర నిధులు, పథకాలు దారి మళ్లించారని ఆరోపించారు. జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్లాయన్నారు. జగన్ పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని..,ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో అవినీతి తారస్థాయికి చేరి.., ఇసుక, భూమి, మద్యం మాఫియా అడ్డూ అదుపులేకుండా చేలరేగిపోతుందన్నారు. రాష్ట్రంలో వైకాపా పోవాలి.. భాజపా రావాలి అనే నినాదానిచ్చారు.

"రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. పెట్టుబడులు రాక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. రాష్ట్రంలో రూ.8.7 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్రం పెడుతోంది. 2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్‌ కోతలు ఉండేవి. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదు. గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలు నిలిచేవి. గతంలో బంధుప్రీతి, వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేది. మోదీ అధికారంలోకి వచ్చాక సంస్కరణలు తెచ్చారు. మోదీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తున్నాం. దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నారు."- జేపీ నడ్డా, భాజాపా జాతీయ అధ్యక్షుడు

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అద్వానంగా ఉందని నడ్డా ఆక్షేపించారు. పెట్టుబడులు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. భాజపా హయాంలో మాతృభాషకు పెద్దపీట వేశామని..,రాష్ట్రంలో తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యనించారు. పలు సంక్షేమ పథకాలకు నిధులు తగ్గుతున్నాయని.., కేంద్రం తరఫున రూ.77 వేల కోట్లు అందించామని చెప్పారు. పీఎం ఆవాస్‌ యోజన కింద ఏపీకి 27 లక్షల ఇళ్లు, ఏపీ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, గిరిజన వర్సిటీ మంజూరు చేశామని చెప్పారు.

"భాజపా హయాంలో సాగు బడ్జెట్‌ రూ.1.04 లక్షల కోట్లకు పెరిగింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది. కేంద్ర నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోంది. ప్రతిపక్షాలపై అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నారు." -జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

దేశంలో 35 కోట్ల మందికి ముద్ర రుణాలు అందించామని జేపీ నడ్డా వెల్లడించారు. కరోనా వేళ 80 కోట్ల మందికి రేషన్‌ అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 23 ఎయిమ్స్‌లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భాజపా హయాంలో పేదరికం 0.8 శాతం తగ్గిందని.., దేశంలో ప్రాథమిక పాఠశాలలు 6.53 లక్షలకు చేరాయని వెల్లడించారు. భారత్‌లో 70 వేల స్టార్టప్‌లు సేవలందిస్తున్నాయని చెప్పారు. సులభతర వాణిజ్యంలో 142 నుంచి 63వ స్థానానికి చేరామని అన్నారు. వంద దేశాలకు కరోనా టీకా డోసులు అందించామని.., 48 దేశాలకు ఉచితంగా కరోనా టీకా డోసులు అందజేశామని తెలిపారు. ఖాదీ వారసులమని కాంగ్రెస్‌ గొప్పలు చెప్పుకుంటోందని.., భాజపా హయాంలో రూ.1.15 లక్షల కోట్ల ఖాదీ అమ్మకాలు జరిగాయాన్నారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తోందని నడ్డా వెల్లడించారు.

"దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. భారత్‌ ఉత్పాదక దేశంగా మారింది. భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరిగాయి. రెండో అతిపెద్ద రిటైల్‌ చైన్‌గా భారత్‌ మారింది. ఒకే దేశం-ఒకే గ్రిడ్‌, ఒకే దేశం-ఒకే రేషన్‌ వంటి అనేక సంస్కరణలు. భారత్‌ అనేక రంగాల్లో ప్రగతి పథంలో వెళ్తోంది. దేశంలో 70 కోట్ల బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి. దేశంలో 2.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ సేవలు. అటల్‌ పింఛన్‌ యోజన కింద 2 కోట్ల మందికి లబ్ధి. అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు అందించే పథకం చేపట్టాం. పీఎం ఆవాస్‌ యోజన కింద 2.5 కోట్ల ఇళ్ల నిర్మాణం. దేశంలో అక్షరాస్యత శాతం 69 నుంచి 75కు పెరిగింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాం." - జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

మంత్రులు, ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూములు, ఇసుక, మట్టి ఇతర వనరులన్నీ దోచేస్తున్నారు. కాలువలు, చెరువులు కబ్జా చేస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన కోనసీమ జిల్లాలో ఓట్ల రాజకీయాలతో చిచ్చురేపారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. ఏ అంశంలోనూ వైకాపా ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి లేదు. రాష్ట్రంలో హిందుత్వంపై దాడులు పెరిగాయి. మహిళలకు భద్రత లేదు. మంత్రులు సామాజిక చైతన్య యాత్రలు చేస్తున్నారు, కాని దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ, తెలంగాణల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ కలిపి రైతులను దోచేస్తున్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్రంలో అవినీతి లేదు. వారసత్వ రాజకీయాలను భూస్థాపితం చేసేది భాజపానే. ఏపీలోనూ కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తాం. రాష్ట్రంలో రాజకీయాలను ప్రజా సంక్షేమానికి కాకుండా వైకాపా కుటుంబ సంక్షేమానికి వాడుకుంటోంది. నాడు-నేడు పేరుతో విద్యను ఉద్ధరిస్తామని చెప్పినా.. పదో తరగతి పరీక్షల్లో రెండు లక్షల మంది ఫెయిలయ్యారు. పోలవరం పూర్తికాకపోవడానికి తెదేపా, వైకాపా ప్రభుత్వాలే కారణం. మోదీ ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఇచ్చినా పూర్తి చేయలేకపోయారు. రాష్ట్రంలో నిరుద్యోగిత పెరిగినా ఉద్యోగ ప్రకటనలూ లేవు.
- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఏపీ స్వర్ణాంధ్రగా మారాలి: సినీనటి జయప్రద
అప్పులప్రదేశ్‌గా మారిన ఆంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడానికి జేపీ నడ్డా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని రూ.లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన వైకాపా ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదు. రాష్ట్రంలో అన్నదాతలు సుఖంగా లేరు. అన్నదాతకే అన్నంలేని పరిస్థితి నెలకొంది. దీనిపై రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఆడపిల్లలు బయటకు వెళ్తే సురక్షితంగా రాగలరా అన్నది ప్రశ్నార్థకమే. అత్యాచారాలు అరికట్టడానికి, న్యాయం చేయడానికి ఎవరూ లేరు. ఆంధ్ర- ఉత్తర్‌ప్రదేశ్‌ నాకు రెండు కళ్లు. కొన్ని పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది. నన్ను క్షమించండి.

ఇవీ చూడండి

Last Updated :Jun 8, 2022, 3:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.