ETV Bharat / state

DOLLAR SESHADRI DIED: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత

author img

By

Published : Nov 29, 2021, 6:51 AM IST

Updated : Nov 29, 2021, 2:11 PM IST

thirumala-srivari-temple-osd-dollar-seshadri-eyelid
తిరుమల శ్రీవారి ఆలయ ఓయస్‌డీ డాలర్ శేషాద్రి కన్నుమూత

06:47 November 29

వేకువజామున గుండెపోటు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత

TTD OSD DOLLAR SESHADRI PASSES AWAY: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన ఆయనకు ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. హుటాహుటిన రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించగా... అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాసేపటికి ఆయన భౌతికకాయాన్ని అక్కడినుంచి కేజీహెచ్​కు తరలించారు. 1978 నుంచి శ్రీవారి సేవలో శేషాద్రి తరించారు. 2007లో పదవీ విరమణ చేసినప్పటికీ.. ఆయన సేవలను గుర్తించిన తితిదే ఓఎస్డీగా కొనసాగిస్తూ వస్తోంది. మరణించే చివరి క్షణం వరకు స్వామివారి సేవలో శేషాద్రి తరించారు. డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని విశాఖ నుంచి తిరుపతికి అధికారులు అంబులెన్సులో తరలిస్తున్నారు. రేపు తిరుపతి గోవిందధామంలో ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

డాలర్ శేషాద్రి కుటుంబ సభ్యులకు సానుభూతి

VENKAIAH NAIDU COMMENTS ON DOLLAR SESHADRI: డాలర్ శేషాద్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తిరుమల వెళ్లినప్పుడు దగ్గరుండి ఆలయ విశేషాలు వివరించేవారని.. వివిధ హోదాల్లో ఆయన సేవలందించారని గుర్తు చేసుకున్నారు. శేషాద్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆయన కుటుంబసభ్యులకు వెంకయ్యనాయుడు సానుభూతి ప్రకటించారు.

డాలర్‌ శేషాద్రి మృతిపట్ల సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి..

CM JAGAN CONDOLENCE ON DOLLAR SESHADRI: డాలర్ శేషాద్రి మృతిపట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారని.. చివరి క్షణం వరకూ స్వామి సేవలో తరించారని గుర్తు చేసుకున్నారు.

గవర్నర్ సంతాపం..

GOVERNOR CONDOLENCE ON DOLLAR SEHSADRI: డాలర్‌ శేషాద్రి మృతిపట్ల గవర్నర్‌ బిశ్వభూషణ్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తితిదేకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరం..

CBN RESPONDS ON DOLLAR SESHADRI: డాలర్ శేషాద్రి మృతి తితిదేకు తీరనిలోటని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించిన ఆయన ఇంత త్వరగా మనందరినీ వదిలి వెళ్లడం బాధాకరమని తెలిపారు. తితిదేకు విశేష సేవలందించిన ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.

శేషాద్రి అంతియ సంస్కారాల్లో పాల్గొననున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ

డాలర్ శేషాద్రి మృతిపట్ల సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ సంతాపం తెలిపారు. శ్రీవారి సేవలపై శేషాద్రికి ఉన్న అవగాహన అనన్యసామాన్యంమన్నారు. ఆలయ ఆచారాలపై శేషాద్రికి ఎంతో అవగాహన, పరిజ్ఞానం ఉందన్న సీజేఐ... ఆయన మృతి దేవస్థానానికి, భక్తకోటికి తీరనిలోటని వ్యాఖ్యానించారు. డాలర్ శేషాద్రి ఆలయ వ్యవహారాలపై చెరగని ముద్ర వేశారని..ఆయన నిష్క్రమణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు జస్టిస్ ఎన్వీ రమణ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శేషాద్రి అంతిమ సంస్కారాల్లో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పాల్గొననున్నారు.

ఆయన మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది..

NARA LOKESH TWEETS ON DOLLAR SESHADRI: తితిదే ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ అన్నారు. దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరిస్తూ.. ఆయన పాదపద్మాల చెంతనే ఉన్నశేషాద్రి ధన్యజీవి అని కొనియాడారు. డాలర్‌శేషాద్రి కుటుంబసభ్యులకు లోకేశ్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఆయన మృతి నన్ను ఎంతగానో బాధించింది..

జీవితాంతం శ్రీవారి సేవలో పునీతులైన తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం తనను ఎంతగానో బాధించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తిరుమలలో వేంకటేశ్వర స్వామివారికి, హిందూ ధార్మికతకు ఆయన చేసిన సేవలు మరువరానివని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

ఆయన సేవలు అభినందనీయం...

డాలర్ శేషాద్రి హఠాన్మరణం తిరుమల తిరుపతి దేవస్థానానికి తీరనిలోటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. శేషాద్రి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన... శేషాద్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మొదట్లో శేషాద్రిపై అందిరిలాగే తనకు అపోహలు ఉండేవని, ఆయన్ని కలిశాక తిరుమల శ్రీనివాసుడికి ఆయన ఎంతగా సేవలు చేస్తున్నారో అర్థమైందన్నారు. చిన్న ఉద్యోగిగా మొదలైన శేషాద్రి ప్రస్థానం... శ్రీనివాసుడి గర్భగుడిలో సేవలు చేసే స్థాయికి ఎదిగిన తీరు అభినందనీయమన్నారు. శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఐవైఆర్ శ్రీనివాసుడ్ని ప్రార్థించారు.

ఆయన మరణం తీరని లోటు..

డాలర్ శేషాద్రి మరణం తితిదేకు తీరనిలోటు అని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఆరోగ్యరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని తాము సూచించినా..... స్వామివారి సేవలో కన్నుమూసినా పర్వాలేదనేవారని గుర్తుచేసుకున్నారు. శ్రీవారి సేవలో తరించడమే తన జీవిత లక్ష్యమనేవారన్నారు. 2013లో శేషాద్రికి కిడ్నీ మార్పిడి జరిగిందని తెలిపారు.

శేషాద్రిస్వామి ఆత్మకు శాంతి కలగాలి..

డాలర్‌ శేషాద్రి మృతిపట్ల తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి స్వామి మరణం తితిదేకు తీరని లోటని పేర్కొన్నారు. శ్రీవారి సేవే ఊపిరిగా శేషాద్రి పనిచేశారని వ్యాఖ్యానించారు. జీవితమంతా స్వామి సేవలో తరించిన ధన్యజీవని స్పష్టం చేశారు. ఆలయ కార్యక్రమాల్లో అర్చకులకు పెద్ద దిక్కుగా పనిచేసిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

శేషాద్రి మృతి హృదయాన్ని కలిచివేసింది..

శేషాద్రి మృతి హృదయాన్ని కలచివేసిందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. నిత్యం స్వామివారి పాదాల చెంత జీవించిన ఆయన... ప్రతి ఒక్కరికీ సుపరిచితులని తెలిపారు. శేషాద్రి ఆప్యాయతను పొందినవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు. అలాగే శారదా పీఠానికి కూడా శేషాద్రితో సుదీర్ఘకాల అనుబంధం ఉందని స్పష్టం చేశారు.

డాలర్ శేషాద్రి మృతి తీరని లోటని మాజీ తితిదే బోర్డు సభ్యులు ఏవీ రమణ పేర్కొన్నారు. డాలర్‌ శేషాద్రి టీటీడీలో 42 సంవత్సరాలపాటు శ్రీవారికి సుదీర్ఘ సేవలు అందించారన్న ఆయన... శ్రీవారి భక్తులకు మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ఏవీ రమణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చూడండి: ప్రముఖ కొరియోగ్రాఫర్​ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

Last Updated :Nov 29, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.