TDP: 'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచామని చెప్పటం సిగ్గుచేటు'

author img

By

Published : Sep 19, 2021, 5:31 PM IST

Parishad Elections Results

వైకాపా నేతలపై తెదేపా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో అసలు తెదేపా పోటీనే చేయలేదని.. అధికార పార్టీ దౌర్జన్యాలకు నిరసనగా బహిష్కరించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపాకు 25 సీట్లు కూడా రావన్నారు.


పరిషత్ ఎన్నికల్లో తెదేపా కంటే వైకాపా ఎక్కువ స్థానాలు గెలిచిందని మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లో అసలు తెదేపా పోటీనే చేయలేదని.., వైకాపా అరాచకాలు, దౌర్జన్యాలకు నిరసనగా ఎన్నికలు బహిష్కరిందని గుర్తు చేశారు. వైకాపా నేతలు, కార్యకర్తలు ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు, అరచకాలకు పాల్పడి ప్రజలకు అంబేడ్కర్ ఇచ్చిన స్వేచ్చను, చివరకు ఓటు హక్కును కూడా హరించారని ధ్వజమెత్తారు.

తెదేపా అధికారంలో ఉన్నపుడు జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజల్ని మెప్పించి గెలిచామని.. వైకాపా మాదిరి దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి గెలవలేదని మండిపడ్డారు. పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72, శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైకాపా బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. రాష్ట్రం మెత్తం ఈ విధంగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో గెలిచామని చెప్పుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

గతంలో జయలలిత కూడా స్థానిక ఎన్నికలను బహిష్కరించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అరాచకాలపై ముఖ్యమంత్రి ఒక్క గంట దృష్టి పెట్టలేరా అని నిలదీశారు. అన్నపూర్ణగా పేరొందిన ఏపీని బిహార్, యూపీ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి తెచ్చారని ఆక్షేపించారు. వైకాపా ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 25 సీట్లు కూడా రావని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

జైల్లో అతడి మరణంతోనే స్టాలిన్​కు పునర్జన్మ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.