ETV Bharat / state

ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి.. ఇన్ని కుట్రలా? - చంద్రబాబు

author img

By

Published : Nov 15, 2021, 1:59 PM IST

Updated : Nov 15, 2021, 4:13 PM IST

ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా చేయాలా అని.. వైకాపా ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత దారుణ పనులు చేస్తే.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.

tdp-chief-chandrababu-speaks-about-kuppam-muncipal-elections-in-ap
'ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా?'

ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి.. ఇన్ని కుట్రలా? - చంద్రబాబు

చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిందెన్నడూ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తప్పుడు పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘వైకాపా నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇలాగైతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు. దొంగ ఓట్లు వేయబోతున్నారని ముందే చెప్పాం. మున్సిపల్‌ ఎన్నికలను కూడా అపహాస్యం చేసిన ఘటనలా? ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా? గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారు." అని ధ్వజమెత్తారు.

అడుగడుగునా నీచ రాజకీయాలు..
"పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కుప్పంలో దొంగ ఓటర్లను రాత్రే తెదేపా నేతలు పట్టుకున్నారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఫిర్యాదును పట్టించుకోకుండా తెదేపా నేతలను అరెస్టు చేశారు. దొంగ ఓటర్లను వారి కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారు. పోలింగ్‌ ఏజెంట్లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారు." అని మండి పడ్డారు.

నిర్వహణ చేతకాకుంటే వెళ్లిపోవాలి..
"ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే శిక్ష తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలి. అడుగడుగునా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఘటనపైనా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఎన్నికల నిర్వహణ చేతకాకుంటే ఎస్‌ఈసీ వెళ్లిపోవాలి. ప్రభుత్వాన్నే నిర్వహించుకోవాలని వెళ్లిపోవచ్చు కదా." అని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు.

లాఠీఛార్జ్‌ దుర్మార్గం..
"వైకాపా ఎంపీలు, మేయర్లు, పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఎందుకెళ్లారు? అనధికార వాహనాలను ఎందుకు సీజ్‌ చేయలేదు. ఎంతమందిని అరెస్టు చేశారో సమాధానం చెప్పాలి. దొంగ ఓటర్లపై పోరాడేవారిపై పోలీసుల లాఠీఛార్జ్‌ దుర్మార్గం. శాంతి భద్రతల సాకుతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారం చేసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారా?’’ అని చంద్రబాబు నిలదీశారు.

ఇదీ చూడండి: KUPPAM ELECTIONS: కుప్పంలో దొంగ ఓటర్లు.. అడ్డుకున్న తెదేపా.. ఉద్రిక్తత

Last Updated :Nov 15, 2021, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.