ETV Bharat / state

ISRO తక్కువ వేగం వల్లే ఎస్‌ఎస్‌ఎల్‌వీ విఫలం

author img

By

Published : Aug 15, 2022, 10:21 AM IST

ISRO SSLV ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి, మొట్టమొదటిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) తక్కువ వేగం కారణంగానే నిర్దేశించిన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేక పోయినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఉపగ్రహం తన కక్ష్యను కోల్పోవడం వల్లే ఎస్‌ఎస్‌ఎల్‌వీలో లోపం జరిగినట్లు స్పష్టమవుతోంది.

ISRO SSLV
ISRO SSLV

ISRO NEW LAUNCH ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి, మొట్టమొదటిసారి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) తక్కువ వేగం కారణంగానే నిర్దేశించిన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేక పోయినట్లు సంబంధిత వర్గాల సమాచారం. రాకెట్‌లోని మూడో దశ ఫైరింగ్‌ మొదలవడం, అది పూర్తయిన వెంటనే ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకు నిర్దేశిత వేగంతో ఉపగ్రహాలను కక్ష్యలోకి ఇంజెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి వాహక నౌక వేగం సెకనుకు 7.3 కి.మీ అయితే అది సెకనుకు 7.2 కి.మీలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఆ సమయానికి 356 కి.మీ. ఎత్తుకు వాహక నౌక చేరగా ఇది నిర్దేశిత పెరిజీ (భూమికి దగ్గర కక్ష్య) ఎత్తు కంటే తక్కువ. ఇక్కడ ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో కదులుతున్నప్పుడు వాతావరణం కీలకంగా మారుతుంది. ఉపగ్రహం చాలా వేగంగా కిందికి వచ్చేలా పనిచేస్తుంది. దీంతో ఉపగ్రహం తన కక్ష్యను కోల్పోతుంది. ఈ లోపమే ఎస్‌ఎస్‌ఎల్‌వీలో జరిగినట్లు స్పష్టమవుతోంది. రాకెట్‌లో అన్ని దశలు, ప్రొపల్షన్‌, సీక్వెన్స్‌ వ్యవస్థలు పనిచేసినట్లు భావిస్తున్నారు. యాక్సిలరో మీటర్‌లో అసాధారణత కారణంగా లోపల ఉన్న కంప్యూటర్‌.. యాక్సిలరో మీటర్‌ విఫలమైనట్లు చూపింది. ఆ కారణంగానే ఉపగ్రహాలను తప్పు కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా ప్రేరేపించింది. అయితే యాక్సిలరో మీటర్లతో సమస్య లేకపోయినా చిన్న సమస్య ఉన్నట్లు కంప్యూటర్‌ సూచించిందని, ఎందుకు అలా జరిగిందన్నది అర్థంకావడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సెన్సర్‌లో అసలు సమస్య ఉండొచ్చని ఓ అభిప్రాయానికి వచ్చారు. మొత్తం మీద రెండు సెకన్లపాటు వాహన నౌకలో క్రమరాహిత్యం నెలకొని ఉపగ్రహాలు చేజారినట్లు చెబుతున్నారు.

అసలేం జరిగిందంటే.. దేశం 75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ చేపట్టిన.. దేశ తొట్ట తొలి చిన్న ఉపగ్రహ వాహకనౌక SSLV-D1 ప్రయోగం విఫలమైంది. ప్రాథమిక దశలను విజయవంతంగా దాటుకుని నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్.. ఉపగ్రహాలను తప్పుడు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాహకనౌక EOS-02, అజాదీశాట్ ఉపగ్రహాలను వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ.. సాంకేతిక సమస్య కారణంగా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఫలితంగా రెండు ఉపగ్రహాలూ పనికిరావని ఇస్రో వెల్లడించింది.సెన్సార్‌ వైఫల్యమే ఇందుకు కారణమని తేల్చింది. త్వరలో SSLV-D2 చిన్న ఉపగ్రహ వాహకనౌకను ప్రవేశపెడతామని ఇస్రో ప్రకటించింది.

ఆదివారం ఉదయం 9.18 గంటలకు తిరుపతి జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ.. మూడు దశలు అనుకున్నట్లుగానే పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది. అయితే.. టెర్మినల్‌ దశకు సంబంధించిన సమాచారం రావడంలో జాప్యం జరిగినట్లు తొలుత ప్రకటించింది. ఆ తర్వాత రాకెట్‌ గమనాన్ని విశ్లేషిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ వెల్లడించారు. ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరుకున్నాయో.. లేదో.. విశ్లేషించి మిషన్‌ తుది ఫలితంపై త్వరలో సమాచారమిస్తామని తెలిపారు. కానీ.. చివరకు మిషన్ విఫలమైందని ప్రకటించారు.

ఇస్రో ఇప్పటిదాకా చిన్న, మధ్యస్థ, ఓ మోస్తరు బరువైన ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారానే కక్ష్యలోకి పంపేది. దీన్ని తయారుచేసేందుకు 600 మంది 70 రోజులు శ్రమించాల్సి వచ్చేది. అదే చిన్న ఉపగ్రహ వాహకనౌకకు ఆరుగురు శాస్త్రవేత్తలు 72 గంటల్లోనే రూపకల్పన చేయగలరు. ఇందుకయ్యే ఖర్చు కూడా రూ.30 కోట్లే. దీని పొడవు 34 మీటర్లు, వ్యాసం 2 మీటర్లు. ఇది 10 నుంచి 500 కిలోల వరకు బరువున్న వాణిజ్య ఉపగ్రహాలను సమీప భూకక్ష్యలో ప్రవేశపెట్టగలదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.