ETV Bharat / state

"పెద్దాయన" ఇలాకాలో అరాచకం.. ప్రశ్నిస్తే, కేసులు-దాడులు

author img

By

Published : Dec 6, 2022, 7:21 AM IST

PEDDIREDDY RAMACHANDRAREDDY: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన్ను అంతా.. పెద్దాయనగా పిలుస్తారు. వైసీపీ ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా., పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరిస్తున్న ఆయన మౌనంగా, శాంత స్వభావిగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ.. కాగల కార్యం మాత్రం ఆయన అనుచరులు, సంబంధీకులు నెరవేరుస్తుంటారు. ఫలితంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అడుగడుగునా అరాచకస్వామ్యం వర్ధిల్లుతోంది. వారికి అణిగిమణిగి ఉండకపోతే దాడులు, అక్రమాల్ని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు, తప్పుల్ని నిలదీస్తే హత్యాయత్నాలు, ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా నిలిస్తే అక్రమ కేసులు, ఆర్థికమూలాలను దెబ్బతీయడాలు, ఆస్తులను ధ్వంసం చేయడాలు నిత్యకృత్యంగా మారాయి.

"పెద్దాయన" ఇలాకాలో అరాచకం
"పెద్దాయన" ఇలాకాలో అరాచకం

PEDDIREDDY RAMACHANDRAREDDY : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో ఎవర్ని కదిపినా.. ఆయన సంబంధీకుల దారుణాలను కథలు కథలుగా చెబుతారు. కానీ.. వారెవ్వరూ బహిరంగంగా నోరు విప్పే సాహసం చేయరు. ప్రజల్ని ఇంతలా భయం గుప్పిట్లో పెట్టి ఏలుతున్నారు. తమ మాటే చట్టం.. తమకు నచ్చినదే రాజ్యాంగం.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై దాడి నేపథ్యంలో అరాచకాలు చర్చనీయాంశమయ్యాయి.

60మంది టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు: పుంగనూరులో పెద్దిరెడ్డి సంబంధీకులు..మూడున్నరేళ్లలో 300 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించారు. వారిలో 60 మందిపై హత్యాయత్నం, 40 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ అక్రమ కేసులేనని, తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలా ఇరికించారని పుంగనూరు తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆరోపించారు. పోలీసులూ వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు.

ప్రశ్నిస్తే ప్రైవేటు సైన్యం దాడి: పెద్దిరెడ్డి సంబంధీకుల అరాచకాలను ప్రశ్నిస్తే.. వారిపై ప్రైవేటు సైన్యం దాడులకు తెగబడుతోంది. సదుం మండలం బూరగమంద పంచాయతీ పచ్చార్లమాకులపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు రాజారెడ్డిని ఏప్రిల్‌లో కిడ్నాప్‌ చేశారు. ఓ తోటలో బంధించి రెండు కాళ్లు విరిచేశారు. వేలూరు ఆసుపత్రిలో ఆరు నెలలపాటు చికిత్స తీసుకున్న ఆయన ఇప్పటికీ నడవలేకపోతున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇద్దరు అనామకులను అరెస్టు చేశారు. పులిచెర్ల మండలం చల్లావారిపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త శివకుమార్‌పై జులైలో వైసీపీ నాయకులు దాడికి దిగారు. పెద్దిరెడ్డి కుటుంబీకులకు చెందిన శివశక్తి డెయిరీలోకి తీసుకెళ్లి మరీ ఆయన చేతులు విరగ్గొట్టారు.

టీడీపీ కార్యాలయానికి అద్దెకు ఇచ్చినందుకు కూల్చివేత నోటీసులు: తెలుగుదేశం నియోజకవర్గ కార్యాలయం కోసం ఇంటిని అద్దెకు ఇచ్చినందుకు దాని యజమానికి మున్సిపల్‌ అధికారులతో నోటీసులు ఇప్పించారు. ఆయన వెనక్కి తగ్గలేదు. కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ గ్రామ, బూత్‌ కమిటీల ఎంపిక సమావేశానికి టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో..అప్పటికప్పుడు మరోసారి నోటీసులిచ్చి భవనాన్ని కూల్చేందుకు సిద్ధయ్యారు. యంత్రాలను రప్పించి, పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. భవన యజమానికి బైపాస్‌ రోడ్డులో ఉన్న ఒక స్థలం విషయమై బెదిరింపులకు తెగబడ్డారు. భయపడిన బాధితుడు టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని బయట పడేశారు. తర్వాత మున్సిపల్‌ అధికారులు ఆ భవనం జోలికే వెళ్లలేదు.

నామినేషన్లు వేసేవారిని భయభ్రాంతులకు గురి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భాజపాల తరఫున నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేశారు. నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారు. పోటీదారులకు అవసరమైన ధ్రువపత్రాలను జారీ చేయకుండా ఆటంకాలు సృష్టించారు. నియోజకవర్గం మొత్తంలో ఒకట్రెండు స్థానాలు మినహా అన్నింటినీ బలవంతంగా, భయపెట్టి మరీ ఏకగ్రీవం చేయించుకున్నారు. పుంగనూరు 16వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకొచ్చిన శ్రీకాంత్‌ను ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి దౌర్జన్యంగా బయటకు తీసుకొచ్చి, పోలీసుల సమక్షంలోనే నామినేషన్‌ పత్రాలను లాగేశారు. సదుం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్‌ వేయటానికి వచ్చిన భాజపా నాయకులను రాళ్లతో కొట్టి తరిమేశారు. పుంగనూరు మండలం మార్లపల్లెకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు అంజిరెడ్డి టీడీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా దాడికి ప్రయత్నించారు.

చీరల పంపిణీ తలపెడితే అక్రమ మద్యం కేసు: పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తూ... పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఎన్నికలు లేని సమయంలో 2020లో కొత్త సంవత్సరం సందర్భంగా మహిళలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు కర్ణాటక నుంచి చీరలను తీసుకొస్తుండగా వాహనాలను సీజ్‌ చేశారు. మద్యం అక్రమ రవాణా, పంపిణీ ఆరోపణలతో కేసు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేయగా అనుమతులు లేవంటూ రాత్రికిరాత్రే వేదిక తొలగించారు. ఆ స్థలం వివాదంలో ఉందని, పోలీసు చట్టం సెక్షన్‌ 30, సీఆర్‌పీసీ 144 సెక్షన్‌ అమలులో ఉన్నాయన్నారు. మూడున్నరేళ్లలో రామచంద్రయాదవ్‌పై 12కు పైగా కేసులు పెట్టారు.

పెద్దిరెడ్డి కుటుంబీకుల యాజమాన్యంలోని శివశక్తి డెయిరీ.. పాడి రైతులను దోచుకుంటోందని ఆరోపిస్తూ రామచంద్రయాదవ్‌ ఈ నెల 4న రైతుభేరి సభ తలపెట్టగా.. ముందు రోజు రాత్రి నుంచే గృహనిర్బంధం చేశారు. ‘పుంగనూరులో అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా.. పెద్దిరెడ్డి రాజ్యాంగం అమలవుతోంది’అంటూ రామచంద్రయాదవ్‌ వ్యాఖ్యానించటంతో దాదాపు 300 మంది వైసీపీ కార్యకర్తలు రామచంద్రయాదవ్‌ ఇంటిపై కర్రలు, రాళ్లు, ఇనపరాడ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు.

ఆ ధరకు మాత్రమే పాలు పోయాలి: పుంగనూరు నియోజకవర్గంలో పాడిరైతులు ఎవరైనా సరే పెద్దిరెడ్డి కుటుంబీకులకు చెందిన శివశక్తి డెయిరీకి, వారు ఖరారు చేసిన ధరకు మాత్రమే పాలుపోయాలని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అంతకంటే ఎక్కువ ధర చెల్లించేందుకు ఇతర డెయిరీలు ముందుకొచ్చినా సరే వాటి వాహనాలను పుంగనూరు నియోజకవర్గంలోకి అడుగే పెట్టనివ్వరని విమర్శిస్తున్నారు. కొన్ని నెలల కిందటి వరకు శివశక్తి డెయిరీ లీటరు పాలకు 18 రూపాయలు మాత్రమే చెల్లించేది. ఇటీవలి నుంచి మాత్రమే లీటరుకు 30 రూపాయల చొప్పున ఇస్తోంది. సుదుం మండలంలో పెద్దిరెడ్డి కుటుంబీకులకు పల్ప్‌ పరిశ్రమ ఉంది. మామిడి రైతులు వారికి నచ్చినా, నచ్చకున్నా తమ పంటనంతా ఈ పరిశ్రమకు వారు చెప్పిన ధరకు అమ్మాల్సిందేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

పుంగనూరులో రోడ్డు వేయాలన్నా, రహదారిని విస్తరించాలన్నా, గుంతలు పూడ్చాలన్నా, కొత్తగా సాగునీటి ప్రాజెక్టు కట్టాలన్నా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన PLR సంస్థ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామ్యం వహించాల్సిందే. వారిని కాదని అక్కడెవరూ పనులు చేపట్టలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.