Parishad Election Results: సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారు: మంత్రి పెద్దిరెడ్డి

author img

By

Published : Sep 19, 2021, 7:32 PM IST

Updated : Sep 19, 2021, 7:38 PM IST

minister peddireddy

పరిషత్ ఎన్నికల ఫలితాలు తెదేపాతో పాటు జనసేన ఇతర పార్టీలకు చెంపపెట్టులాంటివని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు.

ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఫలితాలను విశ్లేషించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనకు ప్రజలు ఏకపక్షంగా మద్దతు పలికారన్నారు. ఈ ఫలితాలు తెదేపాతో పాటు జనసేన ఇతర పార్టీలకు చెంపపెట్టులాంటివని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా ప్రభావం ఉన్నా రెండేళ్లలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు లోకేశ్​కు డబ్బు సంపాదించడం తప్ప రాజకీయాలలో ఓనమాలు నేర్పించలేకపోయారనన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బాయ్ కాట్ చేయడమంటే పరాజయాన్ని అంగీకరించటమేనని ఆయన తెలిపారు.

'పరిషత్ ఎన్నికల్లో ప్రజలు వైకాపా పక్షాన నిలబడ్డారు. 51 శాతం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది. వ్యూహం ప్రకారమే ముఖ్యమంత్రి జగన్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ నేరవేర్చలేదు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లలోనే అమలు చేసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించని ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. సీఎం పరిపాలన ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది. ఈ ఫలితాలు తెదేపాతో పాటు ఇతర పార్టీలకు చెంపపెట్టులాంటివి ' - మంత్రి పెద్దిరెడ్డి

ఫలితాలే నిదర్శనం: మంత్రి కన్నబాబు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే సీఎం జగన్‌ విజయ పరంపర కొనసాగుతున్నట్లు అర్థమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు 80 శాతం ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. సీఎం జగన్‌కు ప్రజాబలం ఉందని చెప్పేందుకు పరిషత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.

‘‘2018లోనే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా చంద్రబాబు పెట్టలేదు. పరిషత్‌ ఎన్నికలు పెట్టాలని చూస్తే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడ్డారు. కొందరు అడుగడుగునా అడ్డుతగిలినప్పటికీ ప్రజలు సీఎం జగన్ వెంటే నడిచారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలు, దుర్మార్గాలకు పాల్పడినట్లు తెదేపా ప్రచారం చేసింది. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా సీఎం జగన్‌కు ప్రజలు వెన్నుదన్నుగా నిలబడ్డారు. సామాజిక న్యాయాన్ని చేతల ద్వారా చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్‌. ఇప్పటికైనా ఓటమికి కారణాలను తెలుసుకొని.. రాష్ట్ర నిర్మాణాత్మక పరిపాలనకు తెదేపా సహకరిస్తే మంచిది’’ -కన్నబాబు, మంత్రి

ఇదీ చదవండి

VIZAG STEEL: త్వరలోనే ఉక్కు పోరాటంలోకి పవన్ కల్యాణ్: నాదెండ్ల మనోహర్

Last Updated :Sep 19, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.