చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు సంస్థానాధీశులుగా ఉన్న కంగుంది జవ్వాది వెంకటగిరి(కేజేవీగిరి) పాలనలో ప్రజల కనీస అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నీటి ట్యాంకులను నిర్మించి కొళాయిల ద్వారా ప్రజలకు తాగునీటి వసతి కల్పించారు. పంచాయతీ కేంద్రంలో 24 గంటల పీహెచ్సీకి సొంత భవన వసతికి అర ఎకరా.. స్థానికంగా పోలీస్స్టేషన్, గ్రామ పంచాయతీ తదితర కార్యాలయాలకు స్థలాలను వితరణగా అందించారు. డ్రైనేజీ వసతి కల్పించారు. వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. ఎగువ వీధిలో వందలాది మంది పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలను వితరణగా ఇచ్చారు. దేవాలయాల అభివృద్ధి తోపాటు, ఏటా ఉత్సవాలను జరిపించారు.
చెదరని ప్రజాదరణ
స్వాతంత్య్రం అనంతరం పంచాయతీ పాలన ఆరంభం నుంచి జమిందారీ కుటుంబంపై స్థానికుల్లో ఉన్న ఆదరణ కేజేవీగిరిని సర్పంచిగా గెలిపించింది. ఆయన 30 ఏళ్ల పాటు సర్పంచిగా సేవలను అందించగా.. కోడలు రుక్మిణమ్మ పదేళ్ల పాటు సర్పంచిగా కొనసాగారు. గిరి 2013లో మృతి చెందారు.
వీరప్పల్లెలో రామకృష్ణారెడ్డి ముద్ర
పెద్దపంజాణి మండలంలోని వీరప్పల్లె పంచాయతీకి ప్రత్యేకత ఉంది. మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి కుటుంబీకులు పంచాయతీ సర్పంచుల ఏకగ్రీవ విషయంలో తమదైన ముద్ర వేసుకున్నారు.ఇక్కడ రెండుసార్లు మినహా సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. 650 కుటుంబాలు ఉండగా సుమారు 1850మంది ఓటర్లు ఉన్నారు.
తండ్రి, తల్లి, తనయుడు
పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీ నూతన కాల్వ రామకృష్ణారెడ్డి కుటుంబానిదే పైచేయిగా ఉంది. ఈయన 4సార్లు, ఆయన కుమారుడు మాజీ మంత్రి అమరనాథరెడ్డి రెండుసార్లు, రామకృష్ణారెడ్డి సతీమణి తాయారమ్మ రెండు సార్లు సర్పంచులుగా పనిచేశారు.
అభివృద్ధికి అవకాశం
సర్పంచులుగా పనిచేసిన వారు సొంత నిధులతో గ్రామాలకు వసతులు కల్పించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులు గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, మురుగునీటి కాలువలు, తాగునీటి బోర్లు, పైపులైన్ల ఏర్పాటు చేయడంతోపాటు పాఠశాలలు అభివృద్ధి చేశారు.
ఇదీ చూడండి:
తొలివిడత నామినేషన్లు: కొన్ని చోట్ల ఒప్పందాలు.. మరికొన్ని ప్రాంతాల్లో విభేదాలు