ఆరుగాలం శ్రమించిన అన్నదాత లాక్డౌన్ కారణంగా పంట అమ్ముకునే ఆస్కారం లేక దుఃఖిస్తున్నాడు. ఇలాంటి సమయంలో కొంత సాంత్వన చేకూర్చేందుకు చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ రెండు విభిన్న కార్యక్రమాలు రూపొందించింది. రెండింటి ప్రధాన ఉద్దేశం రైతును ఆదుకోవడమే. జిల్లాలో ఎక్కువగా ఉన్న పండ్లతోటలను దృష్టిలో ఉంచుకుని ఆయుష్ శాఖ సహకారంతో 'పంచశక్తి ఫల' పేరిట 5రకాల పండ్లు ఉండే ఓ కిట్ను రూపొందించింది. ప్రజల రోగనిరోధక శక్తి పెంచే ఫలాలను ఇందులో చేర్చింది. దీని వల్ల రైతు కాస్తంత డబ్బు కళ్లజూసే అవకాశముందని అధికారులు అంటున్నారు
ఇక కరోనాపై వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది... నిరంతరం పోరాడుతున్నారు. వీరందరి కష్టాన్ని గుర్తించేలా "సెల్యూట్ టు కోవిడ్ హీరోస్" పేరిట... విభిన్న కార్యక్రమం రూపొందించింది. పూలు ఇచ్చి వారి సేవలను కొనియాడాలని పిలుపునిచ్చింది. జిల్లా ఎస్పీ రమేష్రెడ్డికి రోజా పువ్వు ఇచ్చి కలెక్టర్ భరత్గుప్తా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఉద్యానశాఖ రూపొందించిన విధానాలపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి