ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకలి కేకలు.. చికిత్స మాత్రమే ఉచితం.. ఆహారం ఖర్చు రోగులదే

author img

By

Published : Jan 2, 2023, 7:31 AM IST

Updated : Jan 2, 2023, 9:43 AM IST

ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్‌పేషంట్లకు భోజనం పెట్టడం లేదు

Patients Suffering from hunger in AP Govt Hospitals: రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో, మండలాల్లో వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లకు అందించే ఆహారంలో నాణ్యత ఉండటం లేదని పలువురు రోగులు ఆవేదన చెందారు. ఏదైనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరితే.. చికిత్స ఉచితమైనా ఆహార ఖర్చు మాత్రం తడిసిమోపెడు అవుతుందని వాపోయారు.

Patients Suffering from hunger in AP Govt Hospitals: ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మంచి వైద్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌పేషంట్‌ రోగులకు భోజనం పెట్టడం లేదు. చాలా చోట్ల రోగులకు ఆకలికేకలు తప్పడం లేదు. గుత్తేదారులకు లక్షల్లో బిల్లుల పెండింగ్ పెట్టడంతో భోజన పంపిణీలో ఇబ్బందులు ఎదురువుతున్నాయి. చికిత్స ఉచితమైనా ఆహార ఖర్చు తడిసిమోపెడు అయ్యేసరికి రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లకు అందించే ఆహారంలో నాణ్యత ఉండాలని.. ఆసుపత్రుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, 2021 మార్చి 2న ముఖ్యమంత్రి జగన్‌ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇన్‌పేషెంట్లకు కొన్ని ఆసుపత్రుల్లో భోజన సరఫరా స్తంభించింది. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఏజెన్సీలు భోజనం పెట్టట్లేదు. దీనివల్ల ఒక్కో రోగిపై రోజుకు సగటున 150 నుంచి 250 వరకు ఆర్థికభారం పడుతోంది. రోగుల సహాయకుల భోజనాల ఖర్చు పేద కుటుంబాలను మరింత కుంగదీస్తోంది.

వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో కొన్నిచోట్ల ఇన్‌పేషెంట్లకు నెలలు, ఏళ్ల తరబడి భోజనం అందట్లేదు. ఎన్టీఆర్, పల్నాడు, విజయనగరం, వైఎస్‌ఆర్, మన్యం, ఏలూరు జిల్లాల్లోని పలు ఆసుపత్రుల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారికి రోజూ ఉచితంగా అల్పాహారం, రెండుపూటలా భోజనం అందించాలి. ప్రసవానికి చేరిన మహిళలు ఇళ్లకు వెళ్లేవరకూ జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద రోజుకు వంద రూపాయలు పోషకాహారానికి కేటాయించాలి. కొన్నిచోట్ల వీరికీ భోజనం అందడంలేదు. గుత్తేదారులు లేని ఆసుపత్రుల్లో గర్భవతులకు బయట హోటళ్ల నుంచి భోజనం అందించే ఏర్పాట్లు జరిగాయి.

ఆరోగ్యశ్రీ కింద చేరినవారికీ మూడుపూటలా ఆహారాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల్లోని ఇన్‌పేషెంట్లకు భోజన సరఫరా నిమిత్తం ఏడాదికి 15 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఆసుపత్రుల వారీగా టెండరు పొందిన గుత్తేదారులకు ప్రభుత్వం సకాలంలో చెల్లించలేకపోతోంది. దీంతో పలుచోట్ల ఏజెన్సీలు చేతులెత్తేస్తుండగా సూపరింటెండెంట్లు బతిమలాడుకుంటున్నారు. మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు భోజనాన్ని అందించే గుత్తేదారుకు రూ.12 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. దీనివల్ల భోజన సరఫరాకు వెనుకంజ వేస్తుండడంతో గుత్తేదారును ఒప్పిస్తూ నెట్టుకొస్తున్నామని సూపరింటెండెంట్‌ తెలిపారు.

ఆసుపత్రుల నిర్వహణ, రోగులకు అన్నం అందుతోందా అన్నదాని గురించి కూడా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షించట్లేదని విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రజిని, ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్, వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ వినోద్‌కుమార్‌ నిర్వహిస్తున్న సమీక్షలకు తగ్గట్లు జిల్లాల అధికారులు రోగులకు భోజన సదుపాయాన్నీ సరిగా కల్పించడం లేదు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో భోజనాలపై జేసీల పర్యవేక్షణ దాదాపుగా ఉండట్లేదు.

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు 14 నెలల నుంచి భోజన సరఫరా లేదు. ఇక్కడ ఇన్‌పేషెంట్లు రోజుకు సగటున 40 మంది వరకు ఉంటున్నారు. గుత్తేదారుకు సుమారు 10లక్షల బిల్లులు పెండింగులో ఉన్నాయి. గర్భిణులకూ భోజనం అందట్లేదని ఇన్‌పేషెంటుగా చేరిన మౌనిక తల్లి వెంకటలక్ష్మి తెలిపారు. రోగుల సహాయకులకు అక్కడే ఉన్న సత్యసాయి సేవాసంస్థ ద్వారా మధ్యాహ్నభోజనం ఉచితంగా అందుతోంది. త్వరలోనే రోగులకు భోజన పంపిణీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బేబీ కమల తెలిపారు.

సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిలో కొన్నేళ్లుగా భోజన సరఫరా నిలిచింది. ఆసుపత్రిలో రోగులు తక్కువసంఖ్యలో ఉండటంతో గిట్టుబాటు కాదని గుత్తేదారులు ముందుకు రావట్లేదు’ అని సూపరింటెండెంట్‌ డేవిడ్‌ సెల్వన్‌రాజ్‌ పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వాసుపత్రికి వస్తే భోజనం పెట్టకపోవడం దారుణమని రోగులు అంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని నియోజకవర్గం చిలకలూరిపేటలోని ఏరియా ఆసుపత్రిలో 30 పడకలు ఉన్నాయి. ఇన్‌పేషెంట్లు, గర్భవతులకు భోజనం పెట్టడం 8నెలల నుంచి నిలిచిపోయింది. గర్భవతులకు నేరుగా ఎన్‌హెచ్‌ఎం నిధులతో రోజుకి వంద చొప్పున ఇచ్చే అవకాశం ఉన్నా... అదీ ఇవ్వట్లేదు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట సీహెచ్‌సీలో ఇన్‌పేషెంట్లకు చాలాకాలం నుంచి భోజనం అందడంలేదు. గర్భిణులు, బాలింతలకే భోజనం పెడుతున్నారు. ఆసుపత్రి భవనాల విస్తరణలో భాగంగా భోజనశాల నిర్మించినా అది ఉపయోగంలోకి రాలేదు.

రాజంపేట ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలోనూ సెప్టెంబరు 22 నుంచి భోజన పంపిణీ ఆగిపోయింది. మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సామాజిక ఆసుపత్రిలో రెండేళ్లు, కురుపాం సీహెచ్‌సీలో ఏడాది నుంచి ఇన్‌పేషెంట్లకు భోజనం అందించడం ఆగిపోయింది. ఇక్కడికి వచ్చేవారంతా గిరిజనులే. విజయనగరం జిల్లా బాడంగి సామాజిక ఆసుపత్రిలో జననీ శిశుసురక్ష కార్యక్రమానికి రెండేళ్లుగా బిల్లులు రావట్లేదు. పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో జేఎస్‌ఎస్‌కేకు 16 లక్షల బకాయిలు ఉన్నాయి. ఆసుపత్రుల్లో భోజనాలు పెట్టకపోయేసరికి ఇంటి నుంచి తెప్పించుకొని.. లేదంటే బయట నుంచి తెచ్చుకొని రోగులు, రోగుల సహాయకులు ఆకలి తీర్చుకుంటున్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల ఆకలి తిప్పలు

ఇవీ చదవండి

Last Updated :Jan 2, 2023, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.