Farmers not Received Compensation: ప్రాజెక్టు పూర్తై 14 ఏళ్లవుతున్నా.. రైతులకు న్యాయం జరగలేదు..

author img

By

Published : May 22, 2023, 7:30 AM IST

Updated : May 22, 2023, 10:34 AM IST

Farmers not Received Compensation

Farmers not Received Compensation: న్యాయం కోసం పెద్దమనిషి దగ్గరకు వెళ్తాం.! కానీ ఆ పెద్దమనిషే అన్యాయం చేస్తే? ఎవరికి చెప్పుకోవాలి..? ఏమని అడగాలి.? చిత్తూరు జిల్లా చల్లంపల్లె ప్రాజెక్టు నిర్వాసితులదీ అదే పరిస్థితి! ప్రాజెక్టుకు భూములివ్వాలని వెంటపడింది ఆ పెద్దాయనే! కుదరదని చెప్తే ఒప్పించిందీ ఆయనే.! చివరకు పనులు చేసిందీ..ఆయన కుటుంబ సంస్థే.! ప్రాజెక్టులో నీళ్లొచ్చాయి.. గుత్తేదారుకు డబ్బులొచ్చాయి. కానీ నిర్వాసితులకే ఇంకా పరిహారం అందలేదు. ఒకట్రెండు ఏళ్లు కాదు.. 13 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న నిర్వాసితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నమ్మి.. నట్టేట మునిగామని.. వాపోతున్నారు.

ప్రాజెక్టు పూర్తై 14 ఏళ్లవుతున్నా.. రైతులకు న్యాయం జరగలేదు..

Farmers not Received Compensation: చిత్తూరు జిల్లా రొంపిచర్ల - ఎర్రావారిపాలెం మండలాల సరిహద్దులో నిర్మించిన చల్లంపల్లె ప్రాజెక్ట్‌.. నీటితో కళకళలాడుతుంటే.. దీని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల కళ్లలో కన్నీరు సుడులు తిరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తై 14 ఏళ్లవుతున్నా నేటికీ భూములిచ్చిన రైతులకు పరిహారం అందలేదు.

2009 కంటే ముందే రూ.10 కోట్ల అంచనా వ్యయంతో.. చల్లంపల్లె ప్రాజెక్టు మంజూరైంది. దీని కోసం 60 మంది రైతుల నుంచి వందెకరాల భూమి సేకరించింది. ఈ విషయంలో ప్రస్తుత మంత్రి, అప్పటి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నీతానై వ్యవహరించారు. ఎందుకంటే పెద్దిరెడ్డి కుటుంబీకులకు చెందిన.. పీఎల్​ఆర్ కన్‌స్ట్రక్షన్సే పనులు దక్కించుకుంది.

పరిహారం ఇవ్వకుండా పనులెలా మొదలుపెడతారని మొదట్లో రైతులుఅడ్డుకున్నారు. కానీ.. పనులు పూర్తికానివ్వండి.. పరిహారం ఇప్పించే బాధ్యత నాదని పెద్దిరెడ్డి అప్పట్లో.. వారికి నమ్మబలికారు. పీఎల్​ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రాజెక్టు కట్టేసింది. వాటికి బిల్లులూ తీసేసుకుంది. ఇదంతా జరిగి పదమూడేళ్లవుతోంది. కానీ నేటికీ పైసా పరిహారం అందలేదని రైతులు వాపోతున్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2009 నుంచి కొన్నాళ్లు వైఎస్ కేబినెట్‌లో.. ఆ తర్వాత రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఐనా చల్లంపల్లె నిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తానన్న హామీని.. నెరవేర్చలేదు. సందర్భం వచ్చిన ప్రతీసారీ రైతులు అడుగుతూనే ఉన్నారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వం మనది కాదంటూ మభ్యపెడుతూ వచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా.. వారికి న్యాయం జరగలేదు.

జగన్‌ మంత్రివర్గంలో పెద్దిరెడ్డే నంబర్‌-2. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ.. కీలక వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారని పేరు. ఆయన తలచుకుంటే ఒక్కఫోన్‌ కొట్టి.. చల్లంపల్లె నిర్వాసితులకు పరిహారం ఇప్పించవచ్చు. పరిహారం కూడా పెద్దమొత్తమేమీ కాదు. వడ్డీతో కలిపినా రూ.8 కోట్లలోపే ఉంటుందని అంచనా. ఐనా నిర్వాసితులకు న్యాయం చేయడంలేదు.

చల్లంపల్లె ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ప్రాజెక్టు అవతలి వైపునా పొలాలున్నాయి. అక్కడికి వెళ్లి సాగు చేసే దారి లేక రైతులు వాటిని బీడుగా వదిలేశారు. అటు వైపు వెళ్లేందుకు ఒక కల్వర్టయినా నిర్మించాలని కోరుతున్నా పట్టించుకోలేదు. 2011లో పరిహారం కోసం 3 కోట్ల 36 లక్షలు మంజూరయ్యాయని, అవి ఏమయ్యాయో తెలియడం లేదని.. కొందరు రైతులు వాపోతున్నారు.

చల్లంపల్లె ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కొందరు రైతులకు మాత్రమే పరిహారం అందాల్సి ఉందని జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. నిధులు విడుదలైన వెంటనే రైతులకు అందిస్తామని తెలిపారు. నిర్వాసిత రైతులు మాత్రం 13 ఏళ్లుగా ఇలాంటి మాటలు వినీవినీ విసిగిపోయామని నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు.


ఇవీ చదవండి:

Last Updated :May 22, 2023, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.