భూమి కోసం రైతు పోరాటం.. తహసీల్దార్ కార్యాలయంలోనే ఆగిన గుండె

author img

By

Published : Sep 3, 2022, 6:06 PM IST

Updated : Sep 3, 2022, 9:00 PM IST

FARMER DIED AT MRO OFFICE

FARMER DIED AT MRO OFFICE : ప్రభుత్వం కేటాయించిన తన భూమిని తిరిగిప్పించాలంటూ తిరిగిన రైతు గుండె అలసిపోయింది. సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో.. తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. చివరికి కార్యాలయంలోనే కుప్పకూలి పోయాడు.

భూమి కోసం రైతు పోరాటం.. తహసీల్దార్ కార్యాలయంలోనే ఆగిన గుండె

FARMER DEATH AT MRO OFFICE : చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. పెనుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు రత్నం.. తన 2 ఎకరాల 50 సెంట్ల భూమి కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తన భూమిని ఇప్పించాలంటూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇలా 47 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి అధికారుల గుండె కరగకపోవడంతో.. తానే ప్రాణాలు వదిలారు.

ఈ ఘటనకు ముందు శుక్రవారం కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులకు రైతు చేసిన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. పెనుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామం తన సొంత ఊరు అని ఫిర్యాదులో పేర్కొన్న రైతు..తనకు 2 ఎకరాల 50 సెంట్ల భూమి ఉందని తెలిపారు. 1974లో ఈ భూమికి ప్రభుత్వం పట్టా మంజూరు చేసిందని.. అప్పటినుంచి భూమి తమ ఆధీనంలోనే ఉందన్నారు. తిమ్మరాజు కండ్రిగ గ్రామస్థులు కొందరు తనను ఆ భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని.. దీనిపై చిత్తూరు కోర్టులో కేసు వేశానన్నారు.

1981లో కోర్టు తనకు అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందని.. ఆ తర్వాత తనపై హత్యాయత్నం చేశారన్నారు. 2వేల సంవత్సరం నుంచి భూమిని తిరిగి సాగు చేసుకుంటున్నానన్న రైతు.. మళ్లీ ప్రత్యర్థులు కబ్జా చేసేందుకు యత్నించారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో.. మళ్లీ కోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఉత్తర్వులు పొందానని తెలిపారు. అయినా తర్వాత నుంచి ఇప్పటి వరకూ ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నారని..2016లో కోర్టు తనకు పూర్తిస్థాయి అనుమతి ఇచ్చినా.. తహసీల్దార్‌ తప్పుడు సమాచారం పంపడంతో కలెక్టర్‌ దగ్గరా తనకు న్యాయం లభించలేదన్నారు.

కలెక్టర్‌ దగ్గరా న్యాయం జరగకపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో.. వి. చంద్రశేఖర్‌, తహసీల్దార్, సర్పంచ్‌ వెంకటేష్‌, ఆర్‌ఐ, మరో అధికారి నారాయణ రెడ్డి కలిసి కేసు వెనక్కి తీసుకోవాలని తనను బెదిరించారని..అయినా వెనక్కి తగ్గకపోవడంతో కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టులో జేసీబీతో చదును చేసేందుకు యత్నించారని..అడ్డుకోబోయిన తనను దూషించారని వాపోయారు. సర్పంచ్‌ మాట వినకుంటే గ్రామంలో ఉండనీయనని బెదిరించారని చెప్పారు. వరుస ఘటనలతో తాను విసిగిపోయానని..మనోవేదనకు గురై ఓసారి గుండెపోటు వచ్చిందని లేఖలో తెలిపారు.

ఆ తర్వాత పోరాటం కొనసాగించిన రైతు..ఈరోజు గుండెపోటుతో కార్యాలయంలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై మృతుని కుటుంబసభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందువల్ల తాము ఏమీ చేయలేమని తహసీల్దార్‌ చెప్పారు.

చంద్రబాబు సంతాపం : న్యాయం కోసం పోరాడుతూ తహసీల్దార్​ కార్యాలయంలోనే ప్రాణాలు వదిలిన రత్నం బోయుడు ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రత్నం కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటికైనా ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని.. ఆయన మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 3, 2022, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.