చిన్నపాటి వివాదం.. కోపంతో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Mar 15, 2023, 10:35 PM IST

suicide attempt

Man Try To Suicide By Cutting His Neck: తన కోపమే తనకు శత్రువు అంటారు పెద్దలు. ఓ వ్యక్తి కోపంలో బ్లేడ్​తో గొంతు కొసుకున్న ఘటన బాపట్ల జిల్లా జరిగింది. అన్నమయ్య జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నిన్న బాలుడిపై దాడి చేయగా.. ఈరోజు టీచర్​పై విరుచుకుపడ్డాయి. మరో ఘటనలో ఆటో టైర్ పంచరై ప్రమాదం జరిగింది.

Man Try To Suicide By Cutting His Neck : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెంలోని రైల్వేస్టేషన్ సమీపంలో వెంకట్(21) అనే యువకుడు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. స్థానికులు గమనించి చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వెంకటేష్, మరో వ్యక్తి గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సర్దిచెప్పి ఇద్దరిని మందలించారు. దీంతో కోపంతో వెంకటేష్ రోడ్డుపైనే బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. క్షతగాత్రుడిని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్​కు తరలించారు.

రాజంపేటలో బాలుడిపై కుక్కల దాడి : అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని నలంద స్కూల్ వద్ద మంగళవారం ధనుష్ (7) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని ప్రథమ చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. బాధిత బాలుడు పాఠశాల భోజన విరామ సమయంలో బయటకు రాగా కుక్కలు దాడి చేసి కరవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ధనుష్ తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం కువైట్​కు వెళ్లగా, బాబాయ్ సంరక్షణలో ఉన్నాడు. రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు అధికమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. చిన్న పిల్లలు చదువుకునే ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని వీటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆగని స్వైర విహారం.. చర్యలు నిల్ : రాజంపేట పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వరుస దాడులతో పట్టణ ప్రజలను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. బుధవారం ఉదయం రాజు స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చౌడయ్య అనే వ్యక్తిని కుక్కలు విచక్షణరహితంగా కరిచాయి. పట్టణంలోని వైయస్సార్ వీధిలో నివాసం ఉంటున్న చౌడయ్య ఇంటి నుంచి కిందికి వస్తూనే కుక్కలు అతనిపై దాడి చేశాయి. ముఖం మీద కాళ్ల మీద చౌడయ్యకు గాయాలయ్యాయి. బాధితుడు రాజంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పట్టణంలో కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

టైరు పంచర్.. కూలీలకు గాయాలు : ప్రయాణంలో ఆటో టైరు పంచరు కావటంతో కాలువలోకి దూసుకెళ్లిన ఘటన ఉప్పు గుండూరు సమీపంలో చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాం నుంచి నాగులుప్పపాడు మండలం, ఓబన్నపాలెంలో పొగాకు పచ్చాకు కూలి పనులకు వెళుతూ ఆటో టైర్ పంచరు కావడంతో ఉప్పు గుండూరు నాగన్న వాగులోకి దూసుకెళ్లింది. ఆటోలో 18 మంది కూలీలు ప్రయనిస్తున్నారు. ప్రమాద సమయంలో ఒకరిపై ఒకరు పడి నలుగురికి గాయాలయ్యాయి. క్షత గాత్రులను ఉప్పు గుండూరు ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు ప్రొక్లెయినర్ సహాయంతో కాలువలో పడ్డ ఆటోను బయటకు తీశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.