Organic farming: సేంద్రియ సాగుతో అద్భుతాలు.. రూ.12 లక్షల పెట్టుబడితో రూ.30 లక్షల ఆర్జన

author img

By

Published : May 14, 2023, 5:41 PM IST

Organic farming

Organic Farming: పెరుగుతున్న రసాయనాల వినియోగం.. అటు నేలకు, ఇటు జీవులకు నష్టాన్ని చేకూర్చుతోంది. అనారోగ్య సమస్యలకూ దారి తీస్తోంది. విచక్షణారహితంగా రసాయనాలు, పురుగు మందుల వినియోగంతో భూసారం క్షీణిస్తోంది. ఈ విధానంలో మార్పు రావాలని భావించిన ఆ దంపతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. అద్భుతాలను సృష్టిస్తూ.. అధిక లాభాలనూ పొందుతున్నారు.

Organic Farming: బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం చందలూరుకు చెందిన సూదనగుంట నరేంద్రబాబు ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన భార్య అనంతలక్ష్మి డిగ్రీ చదివారు.. 15 ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రం ఉండటంతో ఉద్యోగం చేయడంలో ఆసక్తి చూపకుండా వ్యవసాయంపై దృష్టి సారించారు. ఆదర్శ భావాలు కలిగిన నరేంద్రబాబు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్‌ పాలేకర్, రైతు నేస్తం నిర్వహించే సదస్సులకు హాజరయ్యేవారు. ప్రకృతి సేద్యంపై ఆసక్తి పెంచుకున్నారు. 2015 నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టిపెట్టాడు.. తొలి మూడేళ్లు ఆశించిన ఫలితాలు రాలేదు.

12 లక్షల పెట్టుబడితో 30 లక్షల ఆదాయం.. నాలుగో సంవత్సరం నుంచి ఈ దంపతులు చేస్తున్న కృషిని తితిదే వారు గుర్తించారు. రైతు పండించిన శనగల్ని పూర్తిగా కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బహిరంగ మార్కెట్ కంటే 20 శాతం అదనపు ధర చెల్లించారు. దీంతో సొంతంగా చేసే 15 ఎకరాలతో పాటు అదనంగా మరో 35 ఎకరాలను కౌలు తీసుకొని మొత్తం 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎకరా కౌలు గరిష్టంగా రూ.17 వేలు పలుకుతోంది. మొత్తంగా గత ఏడాది పెట్టుబడి రూ.12 లక్షలు కాగా రూ.30 లక్షల వరకు ఆర్జించారు. ఈ రైతు పొలంలో పండించే ఎలాంటి పంట అయినా కొనుగోలుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తితిదే వారు ప్రకటించారని రైతు పేర్కొంటున్నారు.

ప్రకృతి వ్యవసాయం తానొక్కడినే చేయడం కాదు. పదిమంది రైతుల్ని ఆ దిశగా నడిపించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.. కేవలం చందలూరులోనే కాకుండా అనంతపురం, మహబూబ్​నగర్, జమ్మలమడక, రాప్తాడు వంటి ప్రాంతాల నుంచి రైతులు నరేంద్రబాబుతో మాట్లాడుతున్నారు. పొలంలో ఘన జీవామృతం, అగ్నిఅస్త్రం, దశపన్ని కషాయం, గోకృపామృతం, వేపగింజల కషాయం, మట్టి(సీవీఆర్ విధానం) ఉపయోగిస్తారు. ప్రకృతి సేధ్యంతో పాటు, అనుబంధంగా సహజసిద్దంగా సబ్బులు, సాంబ్రాణి(ధూప్​స్టిక్స్) పిడకలు, గిన్నెల సబ్బు వంటివి తయారు చేస్తారు.

సాగు చేస్తున్న పంటలు.. ఈ క్షేత్రంలో శనగ, మిర్చి, మినుములు, ఆవాలు, ధని యాలు, క్యాలీఫ్లవరు బెండ, బీర, దోస, బీట్రూట్.. వంటి పంటలు సాగు చేస్తారు. వివిధ రకాల ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి గట్టిగా తయారైంది. మిత్ర పురుగులైన వానపాము, కాళ్లజెర్రి, పిచ్చుకలు కనిపించడం లేదు. ఫలితంగా చీడపీడలు ఆశిస్తు న్నాయి. తిరిగి భూమిని మెత్తగా చేయాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే పరిష్కారం. ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండాలి. గోవు నుంచి సంక్రమించే ఎన్నో రకాల పదార్థాలు మానవాళి మనుగడకు ఉపకరిస్తాయని రైతు పేర్కొంటున్నారు.

సబ్బుల పేటెంట్ హక్కులకు ప్రయత్నం.. సాధారణ సబ్బులతో కలిగే ప్రయోజనాల కంటే ప్రకృతి వనమూలికలతో తయారు చేసిన సబ్బుతో ప్రయోజనాలున్నాయి. కర్పూరం, వట్టివేళ్లు, పసుపు, గోమయం(పిడకలపొడి), ఆవునెయ్యి, కుంకుడుకాయ పొడి వంటివి ఉపయోగించి సబ్బులు తయారు చేస్తున్నాం. ఒక్కోటి తయారీకి రూ. 30 వరకు ఖర్చవుతోంది. బహి రంగ మార్కెట్లో రూ.80 విక్రయిస్తున్నాం. దూరప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసి వెళుతున్నారు. అందుకనే దీనిపై పేటెంట్ హక్కులకు ప్రయత్నిస్తున్నామని రైతు అనంతలక్ష్మి పేర్కొన్నారు. స్వచ్చమైన ఆహార పంటలు ఉత్పత్తి చేయడమే కాకుండా, నేలను, ప్రకృతిని కాపాడేందుకు ఈ దంపతులు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.

సేంద్రియ సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న దంపతులు.. లక్షల్లో ఆధాయం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.