ETV Bharat / state

వీఆర్ఏల ముఖ ఆధారిత హాజరుపై గందరగోళం.. మినహాయింపు ఇవ్వాలంటూ వినతులు

author img

By

Published : Feb 10, 2023, 9:07 PM IST

Andhra Pradesh
Andhra Pradesh

VRAs face-based attendance issues: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు ఉండాలనే నూతన పద్ధతి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పద్దతిని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లకు కూడా వర్తింప చేయాలని ఆయా జిల్లాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీఆర్ఏలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ ఆధారిత హాజరు పద్దతిపై ఈ నెల 14న కలెక్టరేట్ల వద్ద మహా ధర్నా కార్యక్రమాలను చేయడానికి సిద్దమయ్యారు.

VRAs face-based attendance issues: గ్రామ రెవెన్యూ సహాయకులకు ముఖ ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) యాప్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేడు ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం అందజేసింది. ఈ మేరకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సీసీఎల్ఏను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏలకు ముఖ ఆధారిత హాజరును వర్తింప చేయటం సరికాదని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అనంతరం ఏపీఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాలన్న ఆదేశాలతో వీఆర్ఏల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని ఉద్యోగుల సంఘం ఆక్షేపించింది. వీఆర్ఏలంతా పార్ట్ టైమ్ వృత్తిగా పనిచేసే ఉద్యోగులు మాత్రమేనని.. ప్రభుత్వం వారికి గౌరవ వేతనం మాత్రమే ఇస్తోందని స్పష్టం చేసింది. అతి తక్కువ వేతనం వచ్చే వీఆర్ఏలకు సెల్‌ ఫోన్లు కొనుగోలు చేసుకునే స్థోమత కూడా లేదని పేర్కొంది. వీఆర్ఏల్లో కొందరు నిరక్షరాస్యులు కూడా ఉన్నారని, వీరికి స్మార్ట్ ఫోన్ వాడకమే తెలియదని వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ వాడకమే తెలియని.. వీఆర్ఏలను ముఖ ఆధారిత హాజరు నుంచి ప్రభుత్వం మినహాయించాలని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

మరోవైపు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని మినహాయించాలని, ఇతర అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 14న కలెక్టరేట్ల వద్ద మహా ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)ల సంఘం వెల్లడించింది. వయసు రీత్యా వీఆర్‌ఏలు ముఖ ఆధారిత హాజరుకు సచివాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాలకు రాలేరని తెలిపింది. చాలామందికి సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదని పేర్కొంది.

2018లో బయోమెట్రిక్‌ హాజరు విధానం నుంచి ఇచ్చినట్లే.. ముఖ ఆధారిత హాజరు నమోదులోనూ మినహాయింపు ఇవ్వాలని కోరింది. నెలకు వేతనాన్ని రూ.26వేలకు పెంచాలని అభ్యర్థించింది. నామినీలకు వీఆర్‌ఏలుగా నియమించే అవకాశాన్ని కల్పించాలని, పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది.

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత హాజరు ఉండాలనే నూతన పద్ధతి ప్రవేశపెట్టింది. ఈ పద్దతిని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లకు కూడా వర్తింప చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు. దీని వల్ల రాష్ట్రంలోని వీఆర్ఏ‌లు అందరూ తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఆర్ఏలకు ముఖ ఆధారిత హాజరు వల్ల నానా సమస్యలు తలెత్తుతున్నాయని.. చాలామంది సాంకేతిక పరిజ్ఞానం లేక, ల్‌ ఫోన్లు కొనుగోలు చేసుకునే స్థోమత లేక అవస్థలు పడుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.