ETV Bharat / state

Ap Crime News: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం..

author img

By

Published : May 12, 2023, 1:34 PM IST

AP Crime News: ఆటోలో ఇంటికి వెళ్తున్న ఒంటరి మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. మరో ఘటనలో అనంతపురం జిల్లాలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. 108 వాహనానికి ఫోన్ చేసినా రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మేడపై నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది

auto driver rape on women in bapatla district
బాపట్ల జిల్లాలో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం

AP Crime News : ఆటోలో ఇంటికి వెళ్తున్న ఒంటరి మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో జరిగింది. గురువారం రాత్రి సమయంలో ఓ మహిళ చిలకలూరిపేటలో శుభకార్యానికి వెళ్లి తెనాలి వచ్చింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ముసలపాడు గ్రామ శివారులో డ్రైవర్ ఆటోను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద బంగారం ఆభరణాలు, నగదు తీసుకొని ఆటో వదిలి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడనీ పోలీసులకు బాధితురాలు వివరించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు.. ఘటన స్థలానికి చేరుకోని అంబులెన్స్ : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ శివారులోని బూత్మాల్ కొండ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రసాద్, గోవిందు అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తరలించడానికి 108 అత్యవసర వాహనానికి స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దాదాపుగా అరగంటైనా 108 వాహనం ఘటనా స్థలానికి రాకపోవడంతో గాయపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరవకొండ వైపునకు వస్తున్న కారులో ప్రసాద్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

గోవిందుకి తీవ్ర గాయాలు కాగా అతనిని అక్కడే వదిలేశారు. గాయపడిన గోవిందు రోడ్డుపై ఉండడం చూసిన స్థానికులు మరో సారి ఫోన్ ద్వారా 108 వాహనానికి సమాచారం అందించినా, రాకపోవడంతో ప్రెవేట్ అత్యవసర వాహనంలో గాయపడిన గోవిందుని అక్కడ ఉన్న స్థానికులు ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగి అరగంట అవుతున్న ప్రమాద ఘటన స్థలానికి 108 అత్యవసర వాహనం చేరుకోకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉరవకొండ నియోజకవర్గ కేంద్రానికి ఘటనా స్థలం కేవలం ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న 108 వాహనం రాకపోవడం స్థానికులను ఇబ్బందికి గురిచేసింది.

జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరు మృతి : చిత్తూరు - నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పాలకూర గ్రామం సమీపంలో కారును లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంగళూరుకు చెందిన కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారి దర్శనానంతరం స్వస్థలానికి వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కోడలి ఇంటికి తాళం వేసిన అత్త : కోడలు నివాసం ఉంటున్న ఇంటికి ఓ అత్త తాళాలు వేసిన ఘటన విశాఖలోని 91వ వార్డు ఎయిర్ పోర్ట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జయప్రకాశ్ నగర్​కు చెందిన జగన్ మోహన్, గౌరీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మానసిక దివ్యాంగురాలు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాలతో భర్త కొద్ది రోజుల నుంచి భార్యా పిల్లలను వదిలేసి, తల్లి రాజేశ్వరి వద్ద మరో ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. గురువారం గౌరీదేవి, ఆమె చిన్న కుమార్తెతో కలిసి పెద్ద కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లింది.

ఈ సమయంలో కోడలు నివాసం ఉంటున్న ఇంటికి వచ్చిన అత్త రాజేశ్వరి వారి ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయింది. ఆసుపత్రి నుంచి వచ్చిన గౌరీ విషయం తెలుసుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి పిల్లలతో ఎండలోనే ఇంటిబయట వేచి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని... ఇంటి తాళాలు తీయించారు. బాధితురాలు ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో సీఐ బీఎండీ. ప్రసాదరావు ఆధ్వర్యంలో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

మేడపై నుంచి పడి మహిళ మృతి : విశాఖపట్నం జిల్లా మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి త్రినాధపురంలో వాసం శాంతి (28) అనే మహిళ ప్రమాదవశాత్తు మేడపై నుండి పడి మృతి చెందింది. భర్తతో మనస్పర్ధలు కారణంగా ఇద్దరు పిల్లలతో సహా రెండేళ్లుగా వారి తల్లి వద్దనే శాంతి ఉంటుంది. రాత్రి మెడపై నిద్రించేందుకు వెళ్లిన శాంతి ఉదయం శవమై కనిపించిందంటూ తల్లి కుమారి మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.