ముగిసిన పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష.. హాజరు శాతం ఎంతంటే..

author img

By

Published : Jan 22, 2023, 8:37 AM IST

Updated : Jan 22, 2023, 3:28 PM IST

పోలీసు కానిస్టేబుల్ పరీక్ష

Today AP Police Constable Preliminary Written Exam: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నేతృత్వంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక పరీక్ష పూర్తయింది. బోర్డు ఛైర్మన్ మనీశ్‌ కుమార్ సిన్హా విజయవాడ సిద్దార్థ మహిళా కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అభ్యర్థులకు అభ్యంతరాలుంటే వెబ్‌సైట్‌లో తెలపవచ్చు సిన్హా సూచించారు.

AP Constable Jobs Preliminary Exam Updates:: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష ముగిసింది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కేవలం హాల్ టికెట్, పెన్ను మాత్రమే పరీక్షకు అభ్యర్థులకు అధికారులు అనుమతినిచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరవాతే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు హాజరయ్యేందుకు పోలీసు నియామక మండలి అనుమతిని నిరాకరించింది. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు మొత్తం 5.3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పరీక్ష కోసం 997 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

90 శాతం హాజరు : పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ మనీశ్‌ కుమార్ సిన్హా విజయవాడ సిద్దార్థ మహిళా కళాశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. రాత పరీక్షకు 90 శాతం అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. అభ్యర్థులకు పరీక్షపై, అభ్యంతరాలు, సందేహాలు ఉంటే వెబ్‌సైట్‌లో తెలపవచ్చని సిన్హా సూచించారు.

పరీక్ష సమయంలో అభ్యర్ధులకు ఎదురైన ఆటంకాలు: పరీక్షకు హాజరయ్యేందుకు ప్రభుత్వం విధించిన సమయపాలన నిబంధన అభ్యర్థులకు తిప్పలు తెచ్చింది. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేక కొంతమంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. బాపట్ల జిల్లాలో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజిలో పరీక్ష రాసేందుకు పాలెం నుంచి బయలుదేరిన భూ లక్ష్మి అనే అభ్యర్థిని కర్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స అనంతరం 10 గంటల 2నిమిషాలకు పరీక్షా కేంద్రానికి చేరుకుంది. అయితే, పోలీసులు మాత్రం ఆమెకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అక్కడకు రాగా.. ఆయనను కూడా అనుమతి ఇవ్వాలని వేడుకొంది. నిబంధనలు పాటించాలని ఎస్పీ చెప్పడంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. మరో ముగ్గురు అభ్యర్థులు సైతం ఇదే కేంద్రానికి ఆలస్యంగా వచ్చి పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. అయితే వివిధ జిల్లాలలో మాత్రం అభ్యర్థలు పరీక్షకు హాజరయ్యారు.

బాపట్ల జిల్లా : కానిస్టేబుల్ ఉద్యోగాల రాత పరీక్ష 8,567 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.. చీరాలలో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఉదయం 9 గంటల నుండి పరీక్ష హాల్లోకి అనుమతిస్తుండటంతో అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే లోపలికి అనుమతించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకున్నారు. చీరాల సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో 3 పరీక్షా కేంద్రాలలో 3800 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. చీరాల డీఎస్పీ పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పరీక్ష తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసి అభ్యర్థులను లోపలికి అనుమతించారు. వాచీలు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకుని వెళ్లకుండా పోలీసులు అభ్యర్థులను తనిఖీలు నిర్వహించారు.

కర్నూలు జిల్లా : కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో 22 వేల 630 అభ్యర్థులు పరీక్షకు హజయ్యారు. పరీక్ష కోసం పోలీసులు అన్ని రకాాల ఏర్పాట్లు చేశారు.

శ్రీకాకుళం జిల్లా : పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులను పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు చేసి లోపలికి పంపించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నరసన్నపేటలో 10 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా 2700 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,800 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చే అభ్యర్థులకు నిశ్చలంగా పరిశీలించి ఎటువంటి వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

విశాఖపట్నం జిల్లాలోని 97 కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించామని.. మొత్తం 54,772 మంది అభ్యర్ధులు పరీక్షకు అర్హత కలిగిఉన్నారని సీపీ శ్రీకాంత్ తెలిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాము..అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యాలు లేవని అన్నారు. వుమెన్స్ కాలేజీ సెంటర్ లో 500 మంది అభ్యర్ధులు పరిక్ష రాయాల్సి వుండగా 45 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లా నుంచి మొత్తం 24 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలోని గుత్తిలో మొత్తం 47 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పామిడి మండలంలో మొత్తం 14 పరీక్ష కేంద్రాలలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు.

ఎన్టీఆర్ జిల్లా : జిల్లాలో కానిస్టేబుల్​ రాత పరీక్ష సజావుగా ముగిసింది. జిల్లా కేంద్రంలో 61 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 30 వేల మంది హాజరయ్యారు. నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక రాత పరీక్షకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నందిగామ నియోజకవర్గంలో 10, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాలాలో సుమారు 9వేల అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. నందిగామలో ఉదయం 6గంటల నుంచే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్ధులు పరీక్ష సమయం కంటే ముందే ఇలా కేంద్రాలకు చేరుకున్నారు.

కోనసీమ జిల్లా : నిరుద్యోగులైన యువతీ యువకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష సరిగ్గా ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ముమ్మిడివరం పరిధిలోని పరీక్ష కేంద్రాలలో 16 వందల మంది పరీక్ష రాశారు.

కాకినాడ జిల్లా : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి కైట్ కాలేజీలో జరుగుతున్న పోలీసు నియామక ప్రాథమిక పరీక్షకు.. దూర ప్రాంతాల నుంచి చేరుకున్న అభ్యర్థులు చివరి నిమిషంలో పరుగులు పెడుతు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.. ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని తెలిపిన అభ్యర్థులు వాటిని తీసుకురావటంతో.. పోలీసులు వాటిన తమ ఆదీనంలోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లా : జిల్లాలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో 500 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నిర్ణీత సమయంలోపే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.

వైయస్సార్ జిల్లా : జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 71 పరీక్ష కేంద్రాలలో 36,650 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు. సెల్​ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, చేతి గడియారాలు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 గంటలు దాటిన తర్వాత పరీక్ష కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు.

ఏలూరు జిల్లా : పోలీస్ కానిస్టేబుల్​ ఎంపికకు ప్రాథమిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 14,450 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్​ను అమలు చేశారు.

అన్నమయ్య జిల్లా : జిల్లాలోని రాజంపేట పట్టణంలో జిల్లా నలుమూలల నుంచి సుమారు 4,738 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్​ఫోన్లు అనుమతించలేదు. ఐడి కార్డులు, హాల్ టికెట్లు వెంట తీసుకురాని అభ్యర్థులను అధికారులు పరీక్షకు అనుమతినివ్వలేదు. చిన్న పిల్లలతో హాజరైన వారికోసం హెల్ప్​ డెస్క్​ను అధికారులు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 22, 2023, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.