'అదనపు అప్పు కోసమే మోటార్లకు మీటర్లు'

author img

By

Published : Mar 7, 2023, 6:12 PM IST

Updated : Mar 7, 2023, 10:41 PM IST

Nara Lokesh

Nara Lokesh Yuvagalam 37th Day Padayatra Updates: ఉచిత విద్యుత్‍ రైతుల హక్కు అని.. అదనపు అప్పు కోసమే మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసి రైతులకు ఊరితాళ్లు వేస్తున్నారని నారా లోకేశ్‍ ఆరోపించారు. 37వ రోజు 'యువగళం' పాదయాత్రలో లోకేశ్​ వాల్మికీపురం మండలం వాండ్లపల్లిలో రైతులతో సమావేశం కాగా.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ముస్లిం ప్రతినిధులతో సమావేశమైన లోకేశ్.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకు ఏయే కార్యక్రమాలు చేపట్టనున్నారో తెలిపారు.

'అదనపు అప్పు కోసమే మోటార్లకు మీటర్లు'

Nara Lokesh Yuvagalam 37th Day Padayatra Updates: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర అనేక ఆంక్షలు, అడుగడుగునా అడ్డంకులు, తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటూ నేటితో 37 రోజులకు చేరుకుంది. 'యువగళం' పాదయాత్ర మొదలైన (జనవరి 27వ తేదీన) రోజు నుంచి ఈరోజు వరకూ ఆయా గ్రామాల్లో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున్న పాదయాత్రలో పాల్గొంటూ.. లోకేశ్‌కు మద్దతును ప్రకటిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ అన్ని వర్గాల వారితో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించి, వారి సమస్యలను ఓపికగా వింటున్నారు. అనంతరం 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలవారి కోసం ఏయే పథకాలను ప్రవేశపెట్టనున్నారో.. ఏయే చర్యలు తీసుకోనున్నారో.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం అవలంబించబోయే విషయాలను ప్రస్తావిస్తూ, మహిళలకు, వృద్దులకు, రైతులకు భరోసానిస్తున్నారు.

ఈ క్రమంలో 37వ రోజు 'యువగళం' పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలోని కలికిరి ఇందిరమ్మ కాలనీ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు లోకేశ్ ఇందిరమ్మ కాలనీలోని విడిది కేంద్రం వద్ద ముస్లిం ప్రతినిధులతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సోదరులకు ఏయే కార్యక్రమాలు చేపట్టనున్నారో తెలపాలని పలు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు యువనేత నారా లోకేశ్ సమాధానాలు చెప్పారు.

కార్యక్రమంలో లోకేశ్ మాట్లడూతూ.. ''దేశంలోనే మొదటిసారిగా మైనారిటీ కుటుంబాాల్లో పేదరికం ఉందని గుర్తించి, వారికోసం మైనారిటీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. ఎందుకోసం మైనారిటీ కార్పొరేషన్‌ను పెట్టారంటే.. ఆ రోజుల్లోనే పేద మైనారిటీలకు లోన్లు ఇచ్చి.. వారిని ఆ పేదరికం నుంచి బయటికి లాగడానికే మైనారిటీ కార్పొరేషన్‌ను ఆనాడే తారకరామారావు గారు పెట్టారు. కానీ, ఈ వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. టీడీపీ హయాంలో ముస్లింలకు అమలు చేసిన పథకాలను ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. జగన్ పాలనలో మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్‌బోర్డుని బలోపేతం చేసి.. ముస్లింల ఆస్తులను కాపాడతాం. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో మైనార్టీలపై ఎలాంటి దాడులు జరగలేదు'' అని ఆయన ఆగ్రహించారు.

అనంతరం దూదేకుల కులానికి చెందిన వారికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తుందని లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా, పీలేరులో ముస్లింలకు ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేసి.. స్వయం ఉపాధి కోసం షాపులు కేటాయిస్తామన్నారు. గల్ఫ్ బాధితులకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సహాయం అందిస్తుందని.. అక్కడ ఏ సమస్య వచ్చినా ఆదుకునేలా ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని లోకేశ్ వ్యాఖ్యానించారు.

రైతులకు ఉరితాళ్లు: ఉచిత విద్యుత్‍ రైతుల హక్కు అని.. అదనపు అప్పు కోసమే మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసి రైతులకు ఊరితాళ్లు వేస్తున్నారని నారా లోకేశ్‍ ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా వాల్మికీపురం మండలం వాండ్లపల్లిలో రైతులతో లోకేశ్​ సమావేశమయ్యారు. సమావేశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు లోకేశ్‍ దృష్టికి తెచ్చారు. టమోటాకు గిట్టుబాటు ధర లేకపొవడంతో పాటు మార్కెట్‍ యార్డులలో జాక్‍ పాట్‍ పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై లోకేశ్‍ స్పందించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోకేశ్‍ తెలిపారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు బిందుసేద్య పరికరాలు 90 శాతం రాయితీపై రైతులకు అందజేశామని వివరించారు.

రాయలసీమలో ఎక్కువ లోతుకు వెళ్తే తప్ప బోర్లలో నీళ్లు రాని పరిస్ధితి ఉందని.. మీటర్ల ఏర్పాటుతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. మీటర్లు ఒక్కసారి ఏర్పాటు చేస్తే తొలగించడం సాధ్యం కాదని మీటర్లు ఏర్పాటు చేయకుండా ఉద్యమాలు చేయాల్సిన అవసరముందన్నారు. మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించాలని విద్యుత్‍ కనెక్షన్‍ తొలగిస్తే పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. రోజుకో విధంగా టమటా ధర మారుతోందన్నారు. టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో హమీ ఇచ్చిన జగన్‍.. నాలుగేళ్లు గడుస్తున్నా హామీని నిలబెట్టుకోలేదన్నారు. గిట్టుబాటు ధర లేనప్పుడు టమాటాలు రోడ్లపై కాకుండా.. సీఎం జగన్‍ నివాసం ఉన్న తాడేపల్లి ప్యాలెస్‍ ముందు పొసి ధర్నాలు చేపట్టాలన్నారు. ఎరువులు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆర్బాటంగా ప్రారంభించిన ఆర్బీకేలతో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. జగన్ వచ్చాక అన్ని హలీడేల్లేనని.. పవర్, క్రాప్, ఆక్వా హాలిడేలతో రైతులను నిలువునా ముంచారన్నారు.

ఇవీ చదవండి

Last Updated :Mar 7, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.