ETV Bharat / state

ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి ఊరట.. కేసు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

author img

By

Published : Nov 8, 2022, 12:29 PM IST

Updated : Nov 8, 2022, 7:19 PM IST

TS HC Dismissed The OMC Case Against The IAS Officer : ఓబుళాపురం గనుల కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై సీబీఐ పేర్కొన్న అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఛార్జ్​షీట్​లో సీబీఐ నమోదు చేసిన సెక్షన్లకు తగిన ఆధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఆ సెక్షన్లు కాకుండా ఇతర చట్టనిబంధనలు వర్తిస్తాయేమో సీబీఐ కోర్టు పరిశీలించాలని హైకోర్టు సూచించింది. ఒకవేళ ఇతర అభియోగాలు వర్తిస్తే వాటి ప్రకారం శ్రీలక్ష్మిపై విచారణ కొనసాగించ వచ్చని హైకోర్టు పేర్కొంది.

ias sri lakshmi omc case
ias sri lakshmi omc case

OMC CASE : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఛార్జ్ షీట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై అభియోగాలకు తగిన ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సీబీఐ పేర్కొన్న ఐపీసీ 120బి రెడ్ విత్ 409తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ సెక్షన్ 13(1)(d) కాకుండా ఇతర చట్ట నిబంధనలు వర్తిస్తాయేమో పరిశీలించాలని సీబీఐ కోర్టుకు సూచించింది. ఒకవేళ ఇతర సెక్షన్లు వర్తిస్తే ఆ అభియోగాలు నమోదు చేసి విచారణ కొనసాగించ వచ్చునని సీబీఐ కోర్టుకు స్వేచ్ఛనిచ్చింది.

అనంతపురం జిల్లాలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న అభియోగాలపై 2012లో సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, విశ్రాంత అధికారులు కృపానందం, వి.డి.రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సీబీఐ ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొంది.

పరిశ్రమల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి నేరపూరిత నమ్మక ద్రోహానికి, కుట్రకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం మోపింది. గనుల లీజుల కేటాయింపులో నిబంధనలు పాటించకపోవడంతో పాటు.. ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ అనే పదాన్ని తొలగించారని సీబీఐ పేర్కొంది. అది అక్రమ మైనింగ్ కు దోహదపడిందని సీబీఐ అభియోగం మోపింది. అయితే... సీబీఐ తనను అనవసరంగా కేసులో ఇరికించిందని.. ఈ అభియోగాలను కొట్టివేయాలని గతంలో సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీలక్ష్మిని ఛార్జ్ షీట్ నుంచి తొలగించేందుకు నిరాకరిస్తూ సీబీఐ కోర్టు గత నెల 17న ఆమె డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టివేసింది.

సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇటీవల సీబీఐ కోర్టు శ్రీలక్ష్మి మినహా మిగతా నిందితులపై అభియోగాలు నమోదు చేసి విచారణ ప్రక్రియ ప్రారంభించింది. బుధవారం నుంచి సాక్షుల విచారణ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి వాదనలు విన్న హైకోర్టు శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

పరిశ్రమల శాఖ కార్యదర్శిగా తాను బాధ్యతలు చేపట్టకముందే గనుల లీజులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయిందని శ్రీలక్ష్మి వాదించారు. అధికారిగా ఆ నోటిఫికేషన్ ప్రకారమే వ్యవహరించినట్లుగా వివరించారు. క్యాప్టివ్ అనే పదం అవసరం లేదని అంతకుముందే కేంద్రం స్పష్టం చేసిందని.. చట్టసవరణ కూడా జరిగిందని.. అందులో తన తప్పేమీ లేదని శ్రీలక్ష్మి వాదించారు. శ్రీలక్ష్మి ప్రమేయంపై ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని.. అవన్నీ కోర్టు ముందుంచామని సీబీఐ తెలిపింది.

ఇరువైపుల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై ఛార్జ్ షీట్ లో పేర్కొన్న ఐపీసీ 120బి రెడ్ విత్ 409తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్ విత్ సెక్షన్ 13(1)(d)కు ఆధారాలు లేవని వెల్లడించింది. వాటిని తొలగించాలని... ఒకవేళ ఇతర సెక్షన్లు వర్తిస్తే విచారణ కొనసాగించవచ్చునని తెలిపింది.

ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి ఊరట.. కేసు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు


ఇవీ చదవండి:

Last Updated :Nov 8, 2022, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.