యువత వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తోంది. చదువుకుని.. సేద్యం ఎలా చేస్తామంటూ ఇతర రంగాల్లో స్థిరపడేందుకు గ్రామాలను వదిలి నగరాలకు వెళ్తున్నారు. కానీ లక్షల జీతాన్ని వదులుకొని.. వ్యవసాయం వైపు అడుగు వేశాడు ఓ యువకుడు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తగ్గుపర్తికి చెందిన భువనేశ్వర్ చక్రవర్తి బెంగళూరులో ఐటీ ఉద్యోగం సాధించారు. కానీ లాక్డౌన్ సమయంలో పొలం బాట పట్టారు. తనకున్న పొలంలో ఆపిల్ బేర్, దానిమ్మ పంటలు సాగు చేస్తూ.. అధిక దిగుబడి సాధిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తండ్రి బాటలో తనయుడు..
తగ్గుపర్తి గ్రామ సమీపంలో భువనేశ్వర్ చక్రవర్తి కుటుంబానికి 16 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. గతంలో ఈ యువకుడి తండ్రి సాధారణ పంటలు సాగు చేసి నష్టాలు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి మార్చాలనే ఉద్దేశంతో నాలుగు ఎకరాల్లో యాపిల్ బేర్, ఆరు ఎకరాల్లో దానిమ్మ సాగు చేపట్టారు. ఏడాది క్రితం తండ్రి అనారోగ్యంతో మరణించడంతో సాగు బాధ్యతలు భువనేశ్వర్ తీసుకున్నారు. సొంతూరిలో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగం చేస్తూనే... ఉద్యాన పంటల సంరక్షణ చూసుకుంటున్నారు.
అధునాతన పద్ధతులు..
సాగులో మెళకువలు పాటిస్తూ.. సాంకేతికతను ఉపయోగించుకొని దానిమ్మ, ఆపిల్ బేర్ పంటల నుంచి మంచి దిగుబడి సాధిస్తున్నారు. దళారులు బెడద లేకుండా నేరుగా కంపెనీలకే విక్రయాలు జరుపుతున్నారు. దానిమ్మ పూత, కాయ దశలో ఉన్నప్పుడు పక్షులు, జంతువుల బెడద లేకుండా.. ప్రత్యేకంగా సోలార్ సౌండ్ పరికరాన్ని అమర్చారు. క్రిమికీటకాల నుంచి పంటను రక్షించేందుకు వాటర్ బాటిల్లో ఒక ద్రవాన్ని ఉంచి ఆ కీటకాలు అందులో పడేటట్టు చేస్తున్నారు. తండ్రికి ఇష్టమైన సేద్యాన్ని కొనసాగిస్తున్నానంటున్న భువనేశ్వర్... సాగు రంగంలోతనకు తెలిసిన అధునాతన పద్ధతులను మిగిలిన రైతులకూ నేర్పేందుకు సిద్ధమంటున్నారు.
ఇదీ చదవండీ.. The Times : బ్రిటీష్ పత్రికలో తెలుగు బుడతడి ఘనత